GT vs RCB  IPL 2024 Royal Challengers Bengaluru won by 9 wkts: ఐపీఎల్‌(IPL)లో ఆలస్యంగా పుంజుకున్న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(RCB)... వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. విల్‌ జాక్స్‌  మెరుపు శతకంతో మెరవడంతో గుజరాత్‌ టైటాన్స్‌(GT)పై ఘన విజయం సాధించింది. విల్‌ జాక్స్ కేవలం 41 బంతుల్లో 5 ఫోర్లు, 10 సిక్సర్లతో సరిగ్గా వంద పరుగులు చేశాడు. చివరి బంతికి ఒక్క పరుగు కావాల్సిన దశలో సిక్స్‌ కొట్టిన జాక్స్‌... శతక గర్జన చేశాడు. విరాట్‌ కోహ్లీ కూడా అద్భుత అర్థ శతకంతో మరోసారి రాణించాడు. దీంతో 200 పరుగుల లక్ష్యాన్ని మరో 24 బంతులు మిగిలి ఉండగానే కేవలం ఒకే వికెట్‌ కోల్పోయి... బెంగళూరు సునాయసంగా ఛేదించింది.

 

సుదర్శన్ పోరాటం

ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ వృద్ధిమాన్‌ సాహా 5 పరుగులకే ఔటయ్యాడు. స్వప్నిల్ బౌలింగ్‌లో కర్ణ్ శర్మకు క్యాచ్‌ ఇచ్చి సాహా పెవిలియన్‌కు చేరాడు. దీంతో 6 పరుగుల వద్ద గుజరాత్‌ మొదటి వికెట్‌ను కోల్పోయింది. బెంగళూరు బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో గుజరాత్‌కు పరుగులు రావడం కష్టమైపోయింది. గత మ్యాచుల్లో తేలిపోయిన బెంగళూరు బౌలింగ్‌ ఆరంభంలో కాస్త గాడినపడ్డారు. యశ్ దయాల్ వేసిన 4వ ఓవర్‌లో కేవలం నాలుగు పరుగులే ఇచ్చాడు. పవర్‌ ప్లేలో గుజరాత్ ఒక వికెట్‌ నష్టానికి కేవలం 42 పరుగులే చేసింది. 45 పరుగుల వద్ద గుజరాత్‌ రెండో వికెట్ కోల్పోయింది. మ్యాక్స్‌వెల్ ఓవర్‌లో కామెరూన్‌ గ్రీన్‌కు క్యాచ్‌ ఇచ్చి 16 పరుగులు చేసి శుభ్‌మన్ గిల్ ఔటయ్యాడు. 10 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ స్కోరు 82/2. కామెరూన్ గ్రీన్ వేసిన 11 ఓవర్‌లో షారుక్ ఖాన్ సిక్స్ బాదాడు. షారుక్ ఖాన్‌ ఉన్నంతవరకూ ధాటిగా ఆడాడు. 24 బంతుల్లోనే షారుక్ ఖాన్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కామెరూన్ గ్రీన్ వేసిన 13 ఓవర్‌లో వరుసగా 4, 4, 6 బాదేసి 24 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. షారుక్‌కు ఐపీఎల్‌లో ఇది తొలి హాఫ్‌ సెంచరీ. 30 బంతుల్లో మూడు ఫోర్లు, అయిదు సిక్సర్లతో 58 పరుగులు చేసి షారూఖ్‌ఖాన్‌ అవుటయ్యాడు. సిరాజ్‌ బౌలింగ్‌లో షారూక్‌ క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. మరోవైపు సాయి సుదర్శన్‌ మరోసారి కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. 34 బంతుల్లో అయిదు ఫోర్లు, రెండు సిక్సర్లతో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.  సాయి సుదర్శన్‌ 49 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 68 పరుగులు చేశాడు. నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి సరిగ్గా 200 పరుగులు చేసింది. బెంగళూరు బౌలర్లలో స్వప్నిల్‌ సింగ్‌ ఒకటి, మహ్మద్‌ సిరాజ్‌ ఒకటి, మ్యాక్స్‌వెల్‌ ఒక వికెట్‌ తీశారు.

 

కోహ్లీ, జాక్స్‌ ధనాధన్‌

201 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన బెంగళూరు కేవలం ఒకే వికెట్‌ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 40 పరుగుల వద్ద ఫాఫ్‌ డు ప్లెసిస్‌ అవుటయ్యాడు. గుజరాత్‌ బౌలర్లకు ఇదొక్కటే ఓదార్పు. ఆ తర్వాత కోహ్లీ, విల్‌ జాక్స్‌ మరో వికెట్‌ పడకుండా బెంగళూరుకు విజయాన్ని అందించారు. కోహ్లీ 44 బంతుల్లో ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లతో 70 పరుగులు చేశాడు. విల్‌ జాక్స్ కేవలం 41 బంతుల్లో 5 ఫోర్లు, 10 సిక్సర్లతో సరిగ్గా వంద పరుగులు చేశాడు. చివరి బంతికి ఒక్క పరుగు కావాల్సిన దశలో సిక్స్‌ కొట్టి జాక్స్‌ సెంచరీ పూర్తి చేశాడు. వీరిద్దరి విధ్వంసంతో మరో మరో 24 బంతులు మిగిలి ఉండగానే కేవలం ఒకే వికెట్‌ కోల్పోయి... బెంగళూరు సునాయసంగా ఛేదించింది.