Dhoni IPL Retirement: ఐపీఎల్‌ చాలా ఎన్నో అద్భుతాలకు వేదికగా నిలిచింది. ఎంతో మంది మట్టిలో మాణిక్యాలను వెలుగులోకి తీసుకొచ్చింది. అలాంటి స్టోరీల్లో చాలా మంది హీరోలను క్రికెట్ అభిమానులు చూశారు. అలాంటి హీరోల్లో టాప్‌లో ఉంటాడు మహేంద్రసింగ్ ధోని. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేసినప్పటికీ 18 సీజన్లుగా అభిమానులను అలరిస్తూనే ఉన్నాడు. నలభై ఏళ్లు దాటినా ఆరోగ్యం సహకరించకున్నా సీఎస్కే జట్టు కోసం ఆడుతూనే ఉన్నాడు. ఏ ప్రయాణమైనా ఏదోచోట ముగియాల్సిందే. ఇప్పుడు ధోనికి కూడా ఆ టైం వచ్చినట్టే కనిపిస్తోంది. 

చెపాక్‌లో మ్యాచ్‌కు ధోనీ పేరెంట్స్

ఇవాళ(శనివారం, 5 ఏప్రిల్‌ 2025) ఐపీఎల్‌కు ధోనీ రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడనే వార్త అభిమానులను కలవరపాటుకు గురి చేస్తోంది. ఎప్పుడూ రాని ధోనీ తల్లిదండ్రులు మ్యాచ్‌కు రావడంతో అంతా దీనిపై చర్చించుకుంటున్నారు. చాలా కాలం తర్వాత వాళ్లిద్దరు చెన్నైలోని చెపాక్ స్టేడియంలో మ్యాచ్ చూస్తున్నారు. ఇలా వాళ్లు రావడంతో అందరికి అనుమానం మొదలైంది. 

సోషల్ మీడియాతోపాటు మెయిన్ మీడియా కూడా దీనిపై చర్చించుకుంటోంది. ఐపీఎల్‌కు ధోనీ వీడ్కోలు పలికే సమయం వచ్చేసిందని చెబుతున్నాయి. సోషల్ మీడియాలో ఇదో ట్రెండింగ్ టాపిక్ అయిపోయింది. ధోనీ తొలిసారి ఐపీఎల్ ఆడిన ఫొటోలు, ఇప్పుడు ఫొటోలను కూడా అభిమానులు షేర్ చేస్తున్నారు. ఆయన తల్లిదండ్రులు మ్యాచ్ చూస్తున్న వీడియోలు, ఫొటోలను కూడా పోస్టు చేస్తున్నారు. కామెంట్స్ పెడుతున్నారు. 

రిటైర్మెంట్‌పై చర్చ కొత్తకాదు

ధోనీ రిటైర్మెంట్‌పై చర్చ జరగడం ఇదేమీ కొత్తకాదు. గత రెండు సీజన్స్‌ నుంచి ఇదే ప్రచారం నడుస్తోంది. తొలి మ్యాచ్‌లో కూడా ఆయన్ని మీడియా ఇదే అంశంపై ప్రశ్నిస్తే... తాను ఆడలేను అన్నా సరే సీఎస్కే యాజమాన్యం ఊరుకోదని అన్నాడు. చక్రాల కుర్చీలో ఉన్నాసరే తీసుకొచ్చి ఆడించేస్తారని నవ్వుతూ చెప్పాడు. గత సీజన్‌లో ఆఖరి మ్యాచ్‌లో కూడా ధోనీ తన రిటైర్మెంట్‌పై ఓ స్టేట్మెంట్ ఇచ్చాడు. వచ్చే సీజన్‌కు ఆరోగ్యం సహకరిస్తే ఆడతానని స్పష్టం చేశాడు. 

ఇంతకు ముందులా ధోనీ కదల్లేకపోతున్నాడు. మోకాలి నొప్పి ఆయన్ని ఎప్పటి నుంచో ఇబ్బంది పెడుతోంది. అంతర్జాతీయ క్రికెట్‌లో ఉన్నప్పుడే దీనికి ట్రీట్మెంట్ చేసుకున్నాడు. ఐపీఎల్‌లోని కొన్ని మ్యాచ్‌లలో కాలికి కట్టుతో ఆడుతూ కనిపించాడు. ఏమైనా సరే అతనిలో మునుపటి ఉత్సాహం కనిపించడం లేదు. 

ఫీల్డ్‌లో ఉండే దడదడ

ఆడినా ఆడకపోయినా  ధోనీ ఫీల్డ్‌లో ఉంటే ప్రత్యర్థులకు ఏదో భయం. వ్యూహాలతో మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉన్న తల ఉంటే యాజమాన్యానికి, అభిమానులకు అదో ధైర్యం. అందుకే ఆయన ఆడినా ఆడకపోయినా కొనసాగిస్తున్నా ఎవరూ అభ్యంతరం చెప్పడంలేదు. అలాంటి గేమ్‌ఛేంజర్‌ పసుపు జెర్సీకి దూరమవుతాడు అంటే అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. 43 ఏళ్ల ధోనీ మహోన్నతమైన క్రికెట్‌తో అలరించాడు. ఐదు ఐపీఎల్‌ ట్రోఫీలను సీఎస్కేకు అందించాడు. పది సార్లు జట్టును ఫైనల్స్‌కు తీసుకొచ్చాడు. 250కిపైగా మ్యాచ్‌లు, 5,000 కంటే ఎక్కువ పరుగులు, 137.53 స్ట్రైక్ రేట్‌ ఐపీఎల్‌లో ధోనీ కెరీర్ చాలా అద్భుతంగా సాగింది.  

సైలెంట్‌గా తప్పుకోవడం మిస్టర్ కూల్ స్పెషాలిటీఅంతర్జాతీయ క్రికెట్‌లో ఇంకా ఆడే సత్తా ఉన్నప్పటికీ సడెన్‌గా తప్పుకొని అందరికీ షాక్ ఇచ్చాడు ఎంఎస్డీ. 15ఆగస్టు,2020న అంతర్జాతీయ క్రికెట్‌గు గుడ్‌బై చెబుతూ  తన నిర్ణయాన్ని ప్రకటించాడు. సింపుల్‌గా ఇన్‌స్టాలో ఓ పోస్టు పెట్టేసి దేశంలో తుపాను సృష్టించాడు. అప్పటి నుంచి ఐపీఎల్‌ ఆడుతూ వచ్చాడు. దీంతో ఆయన అభిమాన గణం ఆటను ఆస్వాధిస్తూ వచ్చారు. రిటైర్మెంట్ పుకార్లను తోసిపుచ్చిన ధోనీ 2024లో కెప్టెన్సీ నుంచి తప్పుకొని రుతురాజ్‌ గైక్వాడ్‌కు బాధ్యతలు అప్పగించాడు.  

 ఆ తప్పు చేస్తాడా?టోర్నీ మధ్యలో రిటైర్మెంట్ చెప్పడం ఆ జట్టుపై తీవ్ర ప్రభావం పడుతుంది. అందుకే అలాంటి తప్పు ధోనీ చేయబోడనే వాదన బలంగా ఉంది. ధోనీ రిటైర్మెంట్‌కు మ్యాచ్‌కు తల్లిదండ్రులు రావడానికి సంబంధం లేదని అభిమానులు అంటున్నారు. ఇప్పటికే వరుస వరుస ఓటములతో ఒత్తిడిలో ఉన్న చెన్నైసూపర్ కింగ్స్‌ను మరింత ఒత్తిడిలోకి నెట్టే పని ధోనీ చేయబోడని అంటున్నారు. ఈ టోర్నీ పూర్తి అయిన తర్వాత మాత్రమే రిటైర్మెంట్‌పై ప్రకటన ఉంటుందని చెబుతున్నారు.