నవంబర్ 15న ప్లేయర్ రిటెన్షన్ గడువు ముగియనున్నందున శార్దూల్ ఠాకూర్, కేఎస్ భరత్, న్యూజిలాండ్ ఆటగాడు టిమ్ సీఫెర్ట్‌లతో సహా ఐదుగురు ఆటగాళ్లను ఢిల్లీ క్యాపిటల్స్ విడుదల చేయనుందని తెలుస్తోంది. వీరితో పాటు మన్‌దీప్ సింగ్, ఆంధ్ర ఓపెనర్ అశ్విన్ హెబ్బార్‌లు కూడా విడుదలయ్యే అవకాశం ఉంది.


శార్దూల్ ఠాకూర్‌ను రూ.10.75 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. ఐపీఎల్ 2022 ఎడిషన్‌లో 14 మ్యాచ్‌ల్లో శార్దూల్ 15 వికెట్లు పడగొట్టాడు. అయితే ఓవర్‌కు 10 పరుగుల పైనే ఇచ్చాడు. బ్యాట్‌తో అతను 10.81 సగటుతో, 137.93 స్ట్రైక్ రేట్‌తో 120 పరుగులు చేశాడు.


ఢిల్లీ క్యాపిటల్స్ అతనిని ఇతర జట్లకు ట్రేడ్ చేయాలని కోరుకుంది కానీ ఆ ఒప్పందం కుదరలేదు. అతను అధిక ధర ట్యాగ్ కారణంగా డిసెంబర్‌లో జరిగే మినీ వేలానికి ముందు అతన్ని విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. "శార్దూల్ ప్రీమియం ఆల్ రౌండర్. కానీ అతని ధర ఒక సమస్యగా ఉంది. విడుదల కానున్న ఇతరులు హెబ్బార్, మన్‌దీప్, సీఫెర్ట్, భరత్" అని ఐపీఎల్ అధికారి ఒకరు తెలిపారు.


న్యూజిలాండ్ బ్యాటర్ సీఫెర్ట్ తిరిగి వేలంలోకి వెళ్లే అవకాశం ఉంది, ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీ తరపున కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడి 24 పరుగులు చేశాడు. కెప్టెన్ రిషబ్ పంత్ వికెట్ కీపింగ్ చేయడంతో తనకు ఎక్కువ అవకాశాలు రాలేదు.


పంజాబ్ వెటరన్ మన్‌దీప్ సింగ్ జట్టు తరపున ఆడిన మూడు గేమ్‌లలో 18 పరుగులు మాత్రమే చేశాడు. 2021లో జరిగిన మునుపటి సీజన్‌లో కూడా అతను పెద్దగా ఆడలేకపోయాడు. ఆంధ్రా బ్యాటర్ అశ్విన్ హెబ్బార్ తాజా ఎడిషన్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అయితే U-19 ప్రపంచ కప్ విజేత కెప్టెన్ యశ్ ధుల్‌ను ఫ్రాంచైజీ తన వద్ద ఉంచుకోనుంది.