CSK vs PBKS IPL 2024 Punjab Kings opt to bowl:  చెన్నై  చెపాక్‌ స్టేడియం వేదికగా ఐపీఎల్ 2024(IPL 2024), 49వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్(CSK), పంజాబ్ కింగ్స్(PBKS) జట్లు తలపడనున్నాయి. టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ సామ్ కర్రాన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకూ రెండు జట్లూ భిన్నమైన ప్రయాణాన్ని సాగించాయి. చెన్నై తొమ్మిది మ్యాచుల్లో 5 విజయాలు సాధించగా... పంజాబ్‌ తొమ్మిది మ్యాచుల్లో కేవలం 3 విజయాలే సాధించింది. పాయింట్ల పట్టికలో చెన్నై మూడో స్థానంలో ఉండగా... పంజాబ్‌ ఎనిమిదో స్థానంలో ఉంది.  అయితే విజయం సాధించినప్పుడు మాత్రం  ఈ రెండు జట్లూ తమ గత మ్యాచ్‌ల్లో భారీ విజయం సాధించాయి.


సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై చెన్నై 78 పరుగుల తేడాతో విజయం సాధించగా... గత మ్యాచ్‌లో పంజాబ్‌ కూడా ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక లక్ష్యాన్ని ఛేదించి రికార్డు సృష్టించింది. అయితే  ఈ ఒక్క మ్యాచ్‌ ఫలితం పాయింట్ల పట్టికను తారుమారు చేసే అవకాశం ఉండడంతో ఈ మ్యాచ్‌లో విజయం చెన్నైకు తప్పనిసరి.  మరోవైపు పంజాబ్‌కు కూడా ప్లే ఆఫ్‌ దారులు పూర్తిగా మూసుకుపోకుండా ఉండాలంటే  ఈ మ్యాచ్‌లో విజయం కీలకం.


సొంత మైదానంతో  బ్యాటింగ్ కు దిగిన చెన్నై 


చెపాక్ స్టేడియం సాధారణంగా బౌలర్లకు అనుకూలిస్తుండడంతో పంజాబ్‌ బ్యాటర్లను కట్టడి చేయడంపైనే చెన్నై విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. అయితే చెన్నై కి ఇది స్వంత గ్రౌండ్ కావడంతో వారు పూర్తి అవగాహనతో ఉండే అవకాశం ఉంది. దీనితోపాటూ చెన్నై గత మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై 78 పరుగుల తేడాతో రుతురాజ్‌ సేన  గెలుపొందింది. రాత్రి సమయంలో చెన్నైలో మంచు కురిసే అవకాశం లేకపోవడంతో ఈ మ్యాచ్‌లో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. సన్‌రైజర్స్‌ బౌలర్లను ఎదుర్కొని 200కుపైగా స్కోరు చేసిన చెన్నై బ్యాటర్లు... మరోసారి రాణించాలని కోరుకుంటున్నారు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌పై మంచి టచ్‌లో ఉండడం చెన్నైకు కలిసిరానుంది. ఈ మ్యాచ్ లో ధోనీ మరో మూడు సిక్స్‌లు బాది ఐపీఎల్‌లో 250 సిక్సర్ల మైలురాయిని అందుకుంటాడు. దీంతో  రోహిత్ శర్మ , విరాట్ కోహ్లీ తర్వాత ఈ రికార్డు అందుకున్న మూడో ఇండియన్ క్రికెటర్ గా  నిలుస్తాడు. ఈ మ్యాచ్ కు పేసర్లు మతిశా పతిరన, తుషార్‌ దేశ్‌పాండే దూరంగా ఉన్నారు.


పంజాబ్‌   ఊపు కొనసాగనుందా 


పంజాబ్‌ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది. పాయింట్ల పట్టికలో పైకి చేరాలంటే పంజాబ్‌ బ్యాటర్లు మరోసారి మంచి ఇన్నింగ్స్‌లు ఆడాల్సి ఉంది. శశాంక్ సింగ్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌, జానీ బెయిర్‌స్టోపై పంజాబ్‌ బ్యాటింగ్‌ భారం ఉంది. జితేష్ శర్మ నుంచి పంజాబ్‌ భారీ స్కోరు ఆశిస్తోంది. కగిసో రబడా, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, శామ్ కరణ్‌లు ఉన్నా పంజాబ్‌ బౌలింగ్‌ బలహీనంగా కనిపించడం ఆందోళన కలిగిస్తోంది.  


పంజాబ్‌ జట్టు : సామ్ కరన్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో,, రిలీ రోసోవ్‌, శశాంక్ సింగ్, జితేశ్‌ శర్మ, అషుతోష్ శర్మ, హర్‌ప్రీత్‌ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబాడ, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్.


 చెన్నై జట్టు : రుతురాజ్‌ గైక్వాడ్ (కెప్టెన్‌), అజింక్య రహానె,  డారిల్ మిచెల్, మొయిన్ అలీ, శివమ్ దూబె, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, రిచర్డ్ గ్లీసన్, ముస్తాఫిజుర్ రెహ్మన్.