ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2024కు సంబంధించిన మినీ వేలం ముగిసింది. మొత్తం 333 మంది ఆటగాళ్లు మినీ వేలంలో పాల్గొనగా... ఫ్రాంచైజీలు తమ జట్టు అవసరాలకు తగిన వారిని కొనుగోలు చేశాయి. ఈ వేలంలో ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ భారీ ధర పలికారు. పాట్ కమిన్స్ రెండో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. 20.50 కోట్లకు కమిన్స్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. వేలంలో అత్యంత ఖరీదైన భారత ఆటగాడిగా హర్షల్ పటేల్ నిలిచాడు. పంజాబ్ కింగ్స్ అతడిని రూ.11.75 కోట్లకు కొనుగోలు చేసింది. యూపీ తరఫున ఆడిన సమీర్ రిజ్వీ అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ప్లేయర్. సమీర్‌ను చెన్నై సూపర్ కింగ్స్ 8.40 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే ఈ వేలంలో తెలంగాణ కుర్రాడిని కూడా అదృష్టం వరించింది. 


హైదరాబాద్‌ క్రికెట్ అసోసియేషన్ తరఫున ఆడుతున్న అరవెల్లి అవనీశ్ రావును చెన్నై సూపర్‌ కింగ్స్‌ కొనుగోలు చేసింది. అరవెల్లి అవనీశ్ రావును చెన్నై సూపర్‌ కింగ్స్‌ కనీస ధర రూ.20 లక్షలకు సొంతం చేసుకుంది. ఈ 18 ఏళ్ల హిట్టర్, వికెట్ కీపర్‌ని వేలం చివరలో చెన్నై దక్కించుకుంది. అవనీశ్‌ది రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామం. 18 ఏళ్ల అవనీశ్‌ వికెట్‌కీపర్‌ బ్యాటర్‌కాగా ఈ ఏడాది నవంబర్‌లో అండర్‌-19 నాలుగు జట్ల టోర్నీలో భారత్‌-ఏ తరఫున ఆడిన అతడు భారత్‌-బిపై 163 పరుగులతో అదరగొట్టాడు అదే నెలలో విజయ్‌హజారె ట్రోఫీలో హైదరాబాద్‌ తరఫున సర్వీసెస్‌పై లిస్ట్‌-ఏ అరంగేట్రం చేశాడు. 
 న్యూజిలాండ్ ఆల్ రౌండర్ డారిల్ మిచెల్ ను చెన్నై సూపర్ కింగ్స్14 కోట్లకు కొనుగోలు చేసింది. ఈసారి ఐపీఎల్ వేలంలో భారీ ధర పలుకుతుందని అంచనా వేసిన ఆటగాళ్లలో న్యూజిలాండ్ హిట్టర్ డారిల్ మిచెల్ కూడా ఒకడు. నిలకడగా ఆడుతూ మంచి స్కోర్లు నమోదు చేస్తుండే మిచెల్ కోసం ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి.అంచనాలకు తగ్గట్టుగానే నేటి ఐపీఎల్ వేలంలో డారిల్ మిచెల్ కు భారీ ధర పలికింది. చెన్నై సూపర్ కింగ్స్ రూ.14 కోట్లకు కొనుగోలు చేసింది. ఎందుకంటే డారిల్ మిచెల్ కనీస ధర రూ.1 కోటి మాత్రమే అయితే పలు ఫ్రాంచైజీలు వేలం పాటను అమాంతం పెంచేశాయి. అయితే తొలి దశలో వ్యూహాత్మకంగా మౌనంగా ఉండిపోయిన చెన్నై రూ.11 కోట్ల పాట వద్ద ఎంటరైన చెన్నై రూ.14 కోట్లతో అతడిని సొంతం చేసుకుంది. అలాగే ఇటీవల వరల్డ్ కప్ ద్వారా వెలుగులోకి వచ్చిన న్యూజిలాండ్ యువ సంచలనం రచిన్ రవీంద్రను కూడా కోటి 80 లక్షలకు సొంతం చేసుకుంది.
చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు: 
ఎం.ఎస్‌. ధోనీ (కెప్టెన్), రవీంద్ర జడేజా, డేవాన్ కాన్వే, రుతురాజ్‌ గైక్వాడ్, డారిల్ మిచెల్, సమీర్ రిజ్వి, శార్దూల్ ఠాకూర్‌, ముస్తాఫిజుర్ రెహ్మాన్‌, రచిన్‌ రవీంద్ర, అవనీష్ రావు అరవెల్లి, అజింక్య రహానె, షేక్ రషీద్,  మిచెల్ శాంట్నర్, మొయిన్‌ అలీ, శివమ్ దూబే, నిశాంత్ సింధు, అజయ్ మధ్వల్, రాజ్యవర్ధన్ హంగార్గేకర్, దీపక్ చాహర్, మహీశ్ తీక్షణ, ముకేశ్‌ చౌదరి, ప్రశాంత్ సోలంకి, సిమర్‌జిత్ సింగ్, మతీశా పతిరన, తుషార్‌ దేశ్‌పాండే.