ఇండోనేషియా మాస్టర్స్‌-2022లో భారత యువ కెరటం లక్ష్య సేన్‌ ఓటమి పాలయ్యాడు. పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో చైనీస్‌ థైపీ షట్లర్‌ చౌ టీన్‌ చెన్‌ చేతిలో పోరాడి ఓడాడు. గంట రెండు నిమిషాల పాటు సాగిన పోరులో 16-21, 21-12, 14-21 తేడాతో పరాజయం చవిచూశాడు.






తొలి గేమ్‌లో లక్ష్య సేన్‌ వేగంగా ఆడలేకపోయాడు. కోర్టులో కదల్లేకపోయాడు. దాంతో ప్రత్యర్థి 11-9తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అదే ఊపులో 21-16తో గేమ్‌ గెలిచేశాడు. కీలకమైన రెండో గేమ్‌లో ప్రపంచ కాంస్య పతక విజేత లక్ష్యసేన్‌ పుంజుకున్నాడు. ముందుగానే ఆధిక్యం సంపాదించాడు. 11-5తో దుమ్మురేపాడు. 21-12తో మ్యాచ్‌ను 1-1తో సమం చేశాడు.


నిర్ణయాత్మక మూడో గేమ్‌లో సేన్‌ తేలిపోయాడు. చెన్‌ 3-0తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆపై మరింత జోరు పెంచి 11-5తో ఆధిపత్యం చెలాయించాడు. చివరికి 21-14తో గేమ్‌తో పాటు మ్యాచ్‌ గెలిచేశాడు. ఇంటర్నేషనల్‌ కెరీర్లో లక్ష్య సేన్‌పై 2-0తో చెన్‌దే పైచేయి.