Indian Tennis Young Sensation Sumit Nagal Achieves Career Best Rank: భారత టెన్నిస్‌ స్టార్ ఆటగాడు, యువ సంచలనం సుమిత్‌ నాగల్‌(Sumit Nagal) కెరీర్‌ బెస్టు ర్యాంకుకు చేరుకున్నాడు. తాజాగా అసోసియేషన్‌ ఆఫ్‌ టెన్నిస్‌ ప్రొఫెషనల్స్‌(ATP Rankings) ప్రకటించిన ర్యాంకులలో నాగల్‌.. ఏకంగా 18 స్థానాలు ఎగబాకి 713 ఏటీపీ పాయింట్లతో 77వ ర్యాంకుకు చేరుకున్నాడు. జర్మనీ వేదికగా ఆదివారం ముగిసిన హీల్‌బ్రోన్‌ నెకర్‌కప్‌ చాలెంజర్‌ ఈవెంట్‌లో టైటిల్‌ నెగ్గడంతో నాగల్‌ ర్యాంకు బాగా మెరుగుపడింది. దీంతో అతడు రాబోయే పారిస్‌ ఒలింపిక్స్‌లో సింగిల్స్‌ విభాగంలో భారత్‌ తరఫున పాల్గొనేందుకు కోటానూ దక్కించుకున్నట్టే భావించవచ్చు . నిబంధనల ప్రకారం పురుషుల, మహిళల సింగిల్స్‌లో టాప్‌-56 ప్లేయర్లు నేరుగా ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తారు. కానీ ఎంతమంది మెరుగైన ర్యాంకులో ఉన్నప్పటికీ ఒక్క దేశం నుంచి మాక్సిమం  నలుగురు ప్లేయర్లు మాత్రమే ఈ టోర్నీ లో పోటీపడాల్సి ఉంటుంది. ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన ఆటగాళ్ల జాబితాను ఆయా జాతీయ సమాఖ్యలకు బుధవారం లోపు అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య పంపిస్తుంది. చివరగా ఒలింపిక్స్‌ సింగిల్స్‌లో 2012లో సోమ్‌దేవ్‌ దేవ్‌వర్మన్‌ ఆడాడు. అప్పుడతను వైల్డ్‌కార్డు ద్వారా ప్రవేశం పొందాడు. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన నాగల్ జనవరిలో ర్యాంకింగ్స్‌లో 138వ స్థానంలో ఉన్నాడు, అయితే అప్పటి నుండి అసాధారణ ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో చెన్నై ఓపెన్ గెలిచిన తర్వాత భారత టెన్నిస్ ప్లేయర్ తొలిసారి టాప్ 100లోకి ప్రవేశించాడు.


 

బోపన్నతో కలిసి

టెన్నిస్ స్టార్‌ రోహన్ బోపన్న(Bopanna), సుమిత్ నాగల్ పారిస్ ఒలింపిక్స్ కోటాలను దక్కించుకుని పతకంపై ఆశలు రేపుతున్నారు. సోమవారంతో పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత పోటీలు ముగిశాయి. ప్రపంచ నాలుగో ర్యాంకర్ బోపన్న తన కోటాను సునాయాసంగా సంపాదించగా... నాగల్‌ మాత్రం పోరాడి పారిస్‌ ఒలింపిక్స్‌ స్థానం దక్కించుకున్నాడు. పారిస్ 2024లో పురుషులు, మహిళల సింగిల్స్ 64 మంది క్రీడాకారులు పాల్గొంటారు. జూన్ 10న విడుదల చేసిన ATP ర్యాంకింగ్స్ ప్రకారం పురుషుల సింగిల్స్ పోటీల్లో టాప్ 56 మంది ఆటగాళ్లు పారిస్‌ ఒలింపిక్స్‌ బెర్తులను పొందారు. ప్రతి దేశం గరిష్టంగా నాలుగు కోటాలను పొందే అవకాశం ఉండగా భారత్‌ రెండు కోటాలను దక్కించుకుంది. 

 

నాగల్‌ మంచి ఫామ్‌లో

26 ఏళ్ల నాగల్‌ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో రెండో రౌండ్‌కు చేరుకుని తన కెరీర్‌లో మొదటి సారి టాప్ 100లోకి ప్రవేశించాడు. 1990లో ప్రారంభమైన మాస్టర్స్ 1000 ఈవెంట్‌లో మెయిన్ డ్రా మ్యాచ్‌ను గెలుచుకున్న భారత ఆటగాడిగానూ నాగల్‌ రికార్డు సృష్టించాడు. గాయం కారణంగా ఎదురైన వైఫల్యాలను దాటి ఇప్పుడు నాగల్‌ అత్యుత్తమమైన ఫామ్‌లో ఉన్నాడు. నాగల్ గత ఏడాది టాప్ 500 బయట ఉన్న నాగల్‌ తర్వాత టాప్‌ 100లోకి ప్రవేశించి సంచలనం సృష్టించాడు. తాను ప్రస్తుతం టెన్నిస్ ఆడటం ఆనందిస్తున్నానని.. ప్రతీ మ్యాచ్‌ను ఆస్వాదిస్తున్నానని నాగల్‌ తెలిపాడు. కొన్ని సంవత్సరాలుగా తన ఆటను పరిశీలిస్తే  గాయాల నుంచి  బయటపడి అద్భుతంగా ముందుకు సాగుతుందని నాగల్‌ తెలిపాడు.