గుంటూరు జిల్లాకు చెందిన షేక్ రషీద్ శనివారం ఇంగ్లండ్ లో జరిగిన అండర్ -19 ప్రపంచకప్ చివరి మ్యాచ్ లో కీలకమైన 50 పరుగులు చేసి అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఈ మ్యాచ్ లో భారత్ విజయం సాధించి వరుసగా 5వ సారి టైటిల్ ని కైవసం చేసుకుంది. అంతకుముందు ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో రషీద్ 94 పరుగులు చేశాడు. అతను ప్రస్తుత సీజన్ ప్రారంభం నుంచి నిలకడగా స్కోర్ చేస్తూ ఈ సీజన్ లో మంచి ప్రదర్శన చేశాడని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్, అపెక్స్ సభ్యులు శరత్ చంద్ర రెడ్డి అన్నారు. రషీద్ విజయానికి అభినందనలు తెలుపుతూ అతడు భవిష్యత్తులో భారత జట్టులో భాగం కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ తరపున పది లక్షల రూపాయలు, నగదు బహుమతిని ప్రకటించారు.
తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేవ్
వెస్టిండీస్లో జనవరి 14 నుంచి ఫిబ్రవరి 5వ తేదీ వరకు జరిగిన ఐసీసీ అండర్–19 మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ 2022లో గుంటూరు జిల్లాకు చెందిన యువకుడు కీలక ప్రదర్శన చేశాడు. వైస్ కెప్టెన్ రషీద్ గుంటూరు జిల్లాకి చెందిన యువకుడు. ప్రత్తిపాడు మండలం పాతమల్లాయపాలెంకు చెందిన షేక్ బాలీషా, జ్యోతిలకు ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు రియాజ్ మెకానికల్ ఇంజినీరింగ్ చదువుతుండగా, రెండవ కుమారుడు రషీద్ ప్రస్తుతం నరసరావుపేటలోని రెడ్డి కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. తండ్రి వృత్తిరీత్యా ప్రైవేటు ఉద్యోగి కావడం, కుమారుడి ప్రాక్టీస్ నిమిత్తం, ప్రస్తుతం గుంటూరులోని హౌసింగ్ బోర్డు కాలనీలో నివాసం ఉంటున్నారు. రషీద్కు చిన్నతనం నుంచే క్రికెట్పై అమితమైన ఆసక్తి ఉంది. స్వతహాగా బ్యాటింగ్ అంటే మంచి ఇష్టమున్న రషీద్ ఆ దిశగానే తన ప్రయత్నాలను మొదలుపెట్టాడు. పన్నెండేళ్ల వయస్సులోనే ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్కు సెలక్ట్ అయ్యాడు. మంగళగిరిలో ప్రత్యేక కోచ్ల ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్నాడు. రషీద్కు తల్లిదండ్రుల నుంచి కూడా మంచి ప్రోత్సాహం ఉంది. కుమారుడి ప్రాక్టీసుకు ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో పదేళ్ల క్రితం కుటుంబంతో సహా గుంటూరుకు వెళ్లిపోయారు. రషీద్ ప్రదర్శన పట్ల తల్లిదండ్రులతో పాటు పాతమల్లాయపాలెం గ్రామస్తులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.