గుంటూరు జిల్లాకు చెందిన షేక్ రషీద్ శనివారం ఇంగ్లండ్ లో జరిగిన అండర్ -19 ప్రపంచకప్ చివరి మ్యాచ్ లో  కీలకమైన 50 పరుగులు చేసి అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఈ మ్యాచ్ లో భారత్ విజయం సాధించి వరుసగా 5వ సారి టైటిల్ ని కైవసం చేసుకుంది. అంతకుముందు ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో రషీద్ 94 పరుగులు చేశాడు. అతను ప్రస్తుత సీజన్ ప్రారంభం నుంచి నిలకడగా స్కోర్ చేస్తూ ఈ సీజన్ లో మంచి ప్రదర్శన చేశాడని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్, అపెక్స్ సభ్యులు శరత్ చంద్ర రెడ్డి అన్నారు. రషీద్ విజయానికి అభినందనలు తెలుపుతూ అతడు భవిష్యత్తులో భారత జట్టులో భాగం కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ తరపున పది లక్షల రూపాయలు, నగదు బహుమతిని ప్రకటించారు.



తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేవ్


వెస్టిండీస్‌లో జనవరి 14 నుంచి ఫిబ్రవరి 5వ తేదీ వరకు జరిగిన ఐసీసీ అండర్‌–19 మెన్స్‌ క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ 2022లో గుంటూరు జిల్లాకు చెందిన యువకుడు కీలక ప్రదర్శన చేశాడు. వైస్ కెప్టెన్ రషీద్‌ గుంటూరు జిల్లాకి చెందిన యువకుడు. ప్రత్తిపాడు మండలం పాతమల్లాయపాలెంకు చెందిన షేక్‌ బాలీషా, జ్యోతిలకు ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు రియాజ్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చదువుతుండగా, రెండవ కుమారుడు రషీద్‌ ప్రస్తుతం నరసరావుపేటలోని రెడ్డి కళాశాలలో ఇంటర్‌ సెకండియర్‌ చదువుతున్నాడు. తండ్రి వృత్తిరీత్యా ప్రైవేటు ఉద్యోగి కావడం, కుమారుడి ప్రాక్టీస్‌ నిమిత్తం, ప్రస్తుతం గుంటూరులోని హౌసింగ్‌ బోర్డు కాలనీలో నివాసం ఉంటున్నారు. రషీద్‌కు చిన్నతనం నుంచే క్రికెట్‌పై అమితమైన ఆసక్తి ఉంది. స్వతహాగా బ్యాటింగ్‌ అంటే మంచి ఇష్టమున్న రషీద్‌ ఆ దిశగానే తన ప్రయత్నాలను మొదలుపెట్టాడు. పన్నెండేళ్ల వయస్సులోనే ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌కు సెలక్ట్‌ అయ్యాడు. మంగళగిరిలో ప్రత్యేక కోచ్‌ల ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్నాడు. రషీద్‌కు తల్లిదండ్రుల నుంచి కూడా మంచి ప్రోత్సాహం ఉంది. కుమారుడి ప్రాక్టీసుకు ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో పదేళ్ల క్రితం కుటుంబంతో సహా గుంటూరుకు వెళ్లిపోయారు. రషీద్ ప్రదర్శన పట్ల తల్లిదండ్రులతో పాటు పాతమల్లాయపాలెం గ్రామస్తులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.



 
రషీధ్ ఇతర ప్రదర్శనలు :
1.  4 సంవత్సరాలు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అండర్-14 జట్ల కోసం రషీద్ ఆడాడు. ఆంధ్ర జట్టు కెప్టెన్ గా 3 సార్లు, ఆంధ్ర జట్టు సౌత్ జోన్ ఛాంపియన్ షిప్  3 సార్లు గెలుచుకుంది.
2. ఇంటర్ డిస్ట్రిక్ట్ మ్యాచ్ లలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అండర్ -14లో 2 డబుల్ సెంచరీలు, ఒక ట్రిపుల్ సెంచరీ సాధించాడు.
3. 2016లో  ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ద్వారా ఇంగ్లండ్ కు వెళ్లాడు. అక్కడ  అండర్ -14 లీగ్లో బర్నార్డ్ కాజిల్ స్కూల్ తరపున ఆడాడు. ఆ లీగ్ లో 53, 68, 38, 59, 109 నాటౌట్ పరుగులు చేశాడు.
4. 2017-18లో ఆంధ్రా అండర్ -16 జట్టుకు 6 మ్యాచ్ల్లో కెప్టెన్ గా ఉన్నాడు. అతను పాండిచ్చేరిపై 168.5 సగటుతో మొత్తం 674 పరుగులు చేశాడు. కర్ణాటక, కేరళ మరియు గోవాలపై సెంచరీలు సాధించాడు.
5. 2018-19లో అండర్ -16 విజయ్ మర్చంట్ ట్రోఫీలో డబుల్ సెంచరీ, 2 సెంచరీలు చేశాడు.
6. 2021లో మొహాలీలో వినూ మన్కడ్ ట్రోఫీ కోసం ఆంధ్రా అండర్ -19 జట్టుకు కెప్టెన్ గా నిలిచాడు. టోర్నమెంట్లో మొత్తం 376తో దిల్లీ, చత్తీస్ గఢ్, రాజస్థాన్ పై 86. ఉత్తరప్రదేశ్ పై 68 పరుగులు చేశాడు.
7. 2021-22 సీజన్ లో అండర్-19 ఛాలెంజర్ ట్రోఫీకి సారథ్యం వహించిన భారతదేశం- డి పై సెంచరీ చేశాడు. ఇండియా-సి జట్టుతో జరిగిన మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్నాడు. టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు.
8. ముక్కోణపు టోర్నమెంట్ లో ఇండియా-ఎ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించి, ఇండియా-బి జట్టుపై సెంచరీ చేసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు.
9. 2021లో జరిగిన ఆసియా కప్ లో  సెమీఫైనల్లో బంగ్లాదేశ్ మీద 90 పరుగులు చేశాడు.