ప్రపంచకప్‌లో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న క్రికెట్ అభిమానులకు భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్టు( BCCI) శుభవార్త చెప్పింది. ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ టికెట్లు దొరక్క బాధ పడుతున్న వారందరికీ మళ్లీ ఆశలు రేపుతూ ప్రకటన చేసింది. దాయాదుల మధ్య మ్యాచ్‌ కోసం మరో 14 వేల టికెట్లను విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించి అభిమానులకు అదిరిపోయే వార్త చెప్పింది. ఇవాళ( అక్టోబర్‌ 8‌) మధ్యాహ్నం 12 గంటల నుంచి అక్టోబర్ 14న అహ్మదాబాద్ వేదికగా జరిగే భారత్‌-పాక్‌ మ్యాచ్ టికెట్ల విక్రయం ప్రారంభమవుతుందని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. 

 

ఇలా బుక్‌ చేసుకోవాలి..

https://tickets.cricketworldcup.com వెబ్‌సైట్‌లో టికెట్‌ను బుక్‌ చేసుకోవవచ్చని బీసీసీఐ అధికారికంగా వెల్లడించింది.  మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ వెబ్‌సైట్‌లో టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ ప్రపంచకప్‌కే హైలెట్‌గా నిలిచే ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించాలని అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. అక్టోబర్‌ 14 వ తేదీన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరగనుంది. భారత్‌-పాక్ మ్యాచ్‌ కోసం ఆగస్టు చివరిలో టికెట్లు విడుదల చేయగా అవి గంటలోనే అమ్ముడుపోయాయి. టికెట్లు గంటలోనే అయిపోవడంపై క్రికెట్‌ ప్రేమికులు అక్కసు వెళ్లగక్కారు. టికెట్ల అమ్మకం పెద్ద స్కామ్‌లా ఉందంటూ బీసీసీఐపై మండిపడ్డారు. ఈ క్రమంలోనే బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది.14 వేల టికెట్లు అందుబాటులోకి తేస్తున్నట్లు ప్రకటించింది. అహ్మదాబాద్‌ నరేంద్రమోదీ స్టేడియంలో లక్షా 32 వేల మంది ప్రేక్షకులు కూర్చొనే వీలుంది. ఇప్పటికే భారత్‌-పాక్ మ్యాచ్‌ కోసం దాదాపు స్టేడియం అంతా నిండిపోయింది. టికెట్ల కోసం అభిమానులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. 

 

దాయాదుల పోరే వేరు

అహ్మదాబాద్‌ వేదికగా ఈ ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌-ఇంగ్లాండ్‌ మధ్య జరిగిన ఆరంభ మ్యాచ్‌పై అభిమానులు అంతగా ఆసక్తి చూపలేదు. దాదాపు సగం స్టేడియం ఖాళీగానే ఉంది. కానీ భారత్‌-పాక్‌ మ్యాచ్‌ అనగానే అభిమానులు ఎంత ఖర్చైనా పెట్టి ప్రత్యక్షంగా చూసేందుకు సిద్ధపడుతున్నారు. ఇప్పటికే దాయాదుల పోరు జరిగే అహ్మదాబాద్‌లో విమాన ధరలు, హోటల్ ధరలు ఆకాశన్నంటుతున్నాయి. ఈ మ్యాచ్‌ కోసం భారత రైల్వే ప్రత్యేకంగా వందే భారత్ రైళ్లు కూడా నడుపుతోంది.

 

అహ్మదాబాద్‌ వేదికగానే వరల్డ్‌కప్ ఓపెనింగ్ గేమ్ జరిగింది. న్యూజిల్యాండ్, ఇంగ్లండ్ తలపడిన ఈ మ్యాచులో డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర శతకాలతో చెలరేగడంతో కివీస్ ఘనవిజయం సాధించింది. నవంబరు 19న ప్రపంచకప్‌ ఫైనల్ కూడా ఇదే స్టేడియంలో జరగనుంది. ఇవాళ ప్రపంచకప్‌ వేట ప్రారంభించనున్న టీమిండియా-ఆస్ట్రేలియాతో తలపడనుంది. రెండో మ్యాచ్‌ భారత్, అఫ్గానిస్థాన్ మధ్య అక్టోబర్ 11న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనుంది. తర్వాత అక్టోబర్ 14న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత పాకిస్థాన్‌తో తలపడనుంది. ఆ తర్వాత ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్, నెదర్లాండ్‌లతో భారత్ ఆడుతుంది.