IND vs WI 3rd ODI, Highlights: వెస్టిండీస్‌పై మూడు వన్డేల సిరీసును టీమ్‌ఇండియా క్లీన్‌స్వీప్‌ చేసింది. వరుసగా రెండోసారీ ఆ జట్టుపై 3-0తో సిరీస్‌ కైవసం చేసుకుంది. ఆఖరి వన్డేకు వరుణుడు అంతరాయం కలిగించినా గబ్బర్‌ సేన అదరగొట్టింది. డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో 35 ఓవర్లకు 257 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కరీబియన్లను భారత బౌలర్లు ఓ ఆటాడించారు. కేవలం 26 ఓవర్లకే 137కు కుప్పకూల్చారు. బ్రాండన్‌ కింగ్‌ (42), నికోలస్‌ పూరన్‌ (42) టాప్‌ స్కోరర్లు. యూజీ 4, శార్దూల్‌, సిరాజ్‌ తలో రెండు వికెట్లు పడగొట్టారు. అంతకు ముందు టీమ్‌ఇండియాలో శుభ్‌మన్‌ గిల్‌ (98 నాటౌట్‌; 98 బంతుల్లో 7x4, 2x6) శతకానికి చేరువయ్యాడు. శిఖర్‌ ధావన్‌ (58; 74 బంతుల్లో 7x4, 0x6), శ్రేయస్‌ అయ్యర్‌ (44; 34 బంతుల్లో 4x4, 1x6) అదరగొట్టారు.


భారత్ మొదట 24 ఓవర్లు బ్యాటింగ్ చేశాక వర్షం పడింది. అప్పుడు మ్యాచ్‌ను 40 ఓవర్లకు కుదించారు. అయితే 36 ఓవర్లు బ్యాటింగ్ చేశాక మళ్లీ వర్షం పడటంతో ఓవర్ల సంఖ్య 35కు తగ్గింది. దీంతో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. టీమిండియా 36 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది.


డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో వెస్టిండీస్ లక్ష్యాన్ని 35 ఓవర్లలో 257 పరుగులుగా నిర్ణయించారు. ఈ సిరీస్‌ను టీమిండియా ఇప్పటికే 2-0తో సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ కూడా గెలిస్తే సిరీస్ వైట్ వాష్ కానుంది. మూడో వన్టేలో రెండోసారి వర్షం కారణంగా ఆట ఆగే సమయానికి మొదట బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా 36 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది.


ఓపెనర్ శిఖర్ ధావన్ (58: 74 బంతుల్లో, ఏడు ఫోర్లు) అర్థ సెంచరీ చేశాడు. మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (98 నాటౌట్: 98 బంతుల్లో బంతుల్లో, ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లు) శతకానికి రెండు పరుగులు ఉందనగా వర్షం పడటంతో నిరాశ చెందాడు. గ్రౌండ్ నుంచి అందరి కంటే చివరిగా బయటకు వెళ్లింది శుభ్‌మన్ గిలే.


వర్షం కారణంగా మొదట ఆట ఆగినప్పుడు భారత్ 24 ఓవర్లలో వికెట్ నష్టానికి 115 పరుగులు చేసింది. ఓవర్లు కుదించాక ఆటలో వేగాన్ని పెంచి తర్వాత కేవలం 12 ఓవర్లలోనే 110 పరుగులను టీమిండియా బ్యాటర్లు సాధించారు. మిగిలిన బ్యాట్స్‌మెన్‌లో శ్రేయస్ అయ్యర్ (44: 34 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్) ఉన్నంత సేపు వేగంగా ఆడాడు. సూర్యకుమార్ యాదవ్ (8: 6 బంతుల్లో, ఒక ఫోర్) విఫలం అయ్యాడు. వెస్టిండీస్ బౌలర్లలో హేడెన్ వాల్ష్ రెండు వికెట్లు తీయగా, అకియల్ హొస్సేన్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.