వాండరర్స్‌ టెస్టులో టీమ్‌ఇండియా రెండో ఇన్నింగ్స్‌ ముగిసింది. 266 పరుగులకు ఆలౌటైంది. సఫారీ జట్టుకు 240 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించింది. సీనియర్లు చెతేశ్వర్‌ పుజారా (53; 86 బంతుల్లో 10x4), అజింక్య రహానె (58; 78 బంతుల్లో 8x4, 1x6) అర్ధశతకాలతో ఆదుకున్నారు. హనుమ విహారి (40*; 84 బంతుల్లో 6x4) అజేయంగా నిలిచాడు. శార్దూల్‌ ఠాకూర్‌ (28; 24 బంతుల్లో 5x4, 1x6) దూకుడుగా ఆడాడు. కాగిసో రబాడా, లుంగి ఎంగిడి, మార్కో జన్‌సన్‌ తలో 3 వికెట్లు పడగొట్టారు.






ఆదుకున్న రహానె, పుజారా


ఓవర్‌నైట్‌ స్కోరు 85/2తో మూడో రోజు, బుధవారం టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ ఆరంభించింది. భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో త్వరగా ఓపెనర్ల వికెట్లు చేజార్చుకోవడంతో చెతేశ్వర్‌ పుజారా (35 ఓవర్‌నైట్‌ స్కోర్‌), అజింక్య రహానె (11 ఓవర్‌నైట్‌ స్కోరు) ఆచితూచి ఆడారు. బౌలర్లకు అనుకూలిస్తున్న పరిస్థితుల్లోనూ చక్కని స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేశారు. గత మూడు ఇన్నింగ్సుల్లో విఫలమైన నయావాల్‌ 62 బంతుల్లోనే అర్ధశతకం అందుకున్నాడు. ఆ తర్వాత జింక్స్‌ 67 బంతుల్లో హాఫ్‌ సెంచరీ అందుకోవడంలో 33.3 ఓవర్లలో టీమ్‌ఇండియా స్కోరు 150కి చేరుకుంది. మూడో వికెట్‌కు 144 బంతుల్లో 111 పరుగుల భాగస్వామ్యం అందించిన ఈ జోడీని జట్టు స్కోరు 155 వద్ద రహానెను ఔట్‌ చేయడం ద్వారా రబాడా విడదీశాడు. మరికాసేపటికే రహానెనూ అతడే పెవిలియన్‌ పంపించాడు. రిషభ్ పంత్‌ (0)నూ వదల్లేదు.






ఆఖరి వరకు విహారి పోరాటం


కాస్త పోరాడేందుకు ప్రయత్నించిన రవిచంద్రన్‌ అశ్విన్‌ (16)ను ఎంగిడి ఔట్‌ చేశాడు. ఈ క్రమంలో హనుమ విహారితో అండతో శార్దూల్ ఠాకూర్‌ దూకుడుగా ఆడాడు. చక్కని బంతులను వదిలేస్తూ అందివచ్చిన బంతుల్ని బౌండరీలకు పంపించాడు. అతడి దూకుడు వల్లే జట్టు స్కోరు 200 దాటింది. ఓ భారీ షాట్‌ ఆడుతూ జట్టు స్కోరు 225వద్ద జన్‌సెన్‌ బౌలింగ్‌లో అతడు ఔటయ్యాడు. ఆ తర్వాత టెయిలెండర్లతో కలిసి విహారి జట్టు స్కోరును 266కు చేర్చాడు. ఆధిక్యాన్ని 239కి తీసుకెళ్లాడు.