IND Vs NZ 2nd Test 3rd Day Highlights: భారత్‌కు ఘోర పరాభవం ఎదురైంది. న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో భారత్ 113 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. దీంతో మూడు టెస్టుల సిరీస్‌ను 2-0తో న్యూజిలాండ్‌ గెలుచుకుంది. 2012లో ఇంగ్లండ్ చేతిలో 2-1 తేడాతో ఓటమి పాలయ్యాక టీమిండియా స్వదేశంలో టెస్టు సిరీస్ కోల్పోవడం ఇదే మొదటి సారి. రెండో ఇన్నింగ్స్‌లో 359 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 245 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో 113 పరుగులతో పరాజయం పాలైంది. భారత బ్యాటర్లలో యశస్వి జైస్వాల్ (77: 65 బంతుల్లో, తొమ్మిది ఫోర్లు, మూడు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. న్యూజిలాండ్ బౌలర్లలో మిషెల్ శాంట్నర్ ఆరు వికెట్లు తీసుకున్నాడు. భారత్‌లో న్యూజిలాండ్ టెస్టు సిరీస్ నెగ్గడం ఇదే మొదటిసారి.


క్రీజులో నిలబడలేక...
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా బ్యాటర్లు ప్రారంభంలో చాలా వేగంగా పరుగులు చేశారు. లంచ్ బ్రేక్ సమయానికి కేవలం 12 ఓవర్లలోనే వికెట్ నష్టానికి 81 పరుగులు చేశారు. ఈ సెషన్‌లో భారత్ దాదాపు ఏడు రన్‌రేట్‌తో పరుగులు చేసింది. ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ (8: 16 బంతుల్లో, ఒక ఫోర్) రెండో ఇన్నింగ్స్‌లో కూడా మంచి స్కోరు సాధించడంలో విఫలం అయ్యాడు. యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ రెండో వికెట్‌కు 62 పరుగులు జోడించారు.


ఈ భాగస్వామ్యం బలపడుతున్న సమయంలో మిషెల్ శాంట్నర్ టీమిండియాను భారీ దెబ్బ తీశాడు. ఆరు ఓవర్ల వ్యవధిలోనే వీరిద్దరినీ అవుట్ చేశాడు. తర్వాత వచ్చిన వారిలో ఎవరూ క్రీజులో నిలబడలేకపోయారు. విరాట్ కోహ్లీతో సమన్వయ లోపం కారణంగా ఫామ్‌లో ఉన్న పంత్ రనౌట్ అయ్యాడు. చివర్లో రవీంద్ర జడేజా పోరాడినా ఫలితం లేకపోయింది. మొదటి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు తీసిన మిషెల్ శాంట్నర్ రెండో ఇన్నింగ్స్‌లో కూడా ఆరు వికెట్లు తీసుకున్నాడు. అజాజ్ పటేల్ రెండు వికెట్లు పడగొట్టగా... గ్లెన్ ఫిలిప్స్‌కు ఒక వికెట్ దక్కింది.



24 పరుగుల తేడాలో ఐదు వికెట్లు...
అంతకు ముందు 198/5 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభించిన న్యూజిలాండ్ ఇన్నింగ్స్ మొదలయ్యాక కాసేపు బాగానే సాగింది. ఓవర్ నైట్ బ్యాటర్లు టామ్ బ్లండెల్, గ్లెన్ ఫిలిప్స్ 49 పరుగుల భాగస్వామ్యంతో ఇన్నింగ్స్‌ను నిలబెట్టడానికి కాస్త ప్రయత్నించారు. కానీ ఒక్కసారి టామ్ బ్లండెల్‌ను రవీంద్ర జడేజా క్లీన్ బౌల్డ్ చేశాక న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ఒక్కసారిగా కుప్పకూలింది. 231/5 స్థాయిలో ఉన్న దగ్గర నుంచి ఒక్కసారిగా 255కు న్యూజిలాండ్ ఆలౌట్ అయింది. అంటే దాదాపు 24 పరుగుల వ్యవధిలోనే న్యూజిలాండ్ చివరి ఐదు వికెట్లను టీమిండియా పడగొట్టిందన్న మాట. టీమిండియా బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ నాలుగు వికెట్లు పడగొట్టగా, రవిచంద్రన్ అశ్విన్ మూడు, రవీంద్ర జడేజా రెండు వికెట్లు తీసుకున్నారు.


భారత్ తుది జట్టు
యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, ఆకాష్ దీప్, జస్‌ప్రీత్ బుమ్రా


న్యూజిలాండ్ తుది జట్టు
టామ్ లాథమ్ (కెప్టెన్), డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌతీ, అజాజ్ పటేల్, విలియం ఓరౌర్కీ