IND Vs NZ 1st Test: బౌలర్లను చీల్చి చెండాడే హిట్ మ్యాన్ రోహిత్ శర్మ, కఠోర పరిస్థితుల్లో కూడా క్రీజులో నిలబడే కింగ్ కోహ్లీ, దేశవాళీ క్రికెట్‌లో చిచ్చర పిడుగు సర్ఫరాజ్ ఖాన్, భయం లేని పంత్, రికార్డులు కొట్టే రాహుల్, ఎదురే లేని యశస్వి, తిరుగు లేని జడేజా, తెలివైన అశ్విన్... పేపర్ మీద పేర్లు బలంగా ఉంటే ఏం ప్రయోజనం? క్రీజులో ఒక్కరు కూడా పట్టుమని పది నిమిషాలు నిలబడలేకపోతే. న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కోలేక భారత టెస్టు చరిత్రలో అత్యంత దారుణంగా 46 పరుగులకే ఆలౌట్ అయ్యారు. భారతదేశంలోని మైదానాల్లో కేవలం భారత్‌కే కాదు... ఏ అంతర్జాతీయ టెస్టు మ్యాచ్‌లో అయినా ఇదే అత్యల్ప స్కోరు.


2021లో న్యూజిలాండ్‌ను భారత్ ముంబైలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో 62 పరుగులకే కుప్పకూల్చింది. ఇప్పుడు చిన్నస్వామి మైదానంలో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్‌ను మొదటి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే ఆలౌట్ చేసి న్యూజిలాండ్ రివెంజ్ గట్టిగా తీర్చుకుంది. భారత బ్యాటర్లలో రిషబ్ పంత్ (20: 49 బంతుల్లో, రెండు ఫోర్లు), యశస్వి జైస్వాల్ (13: 63 బంతుల్లో, ఒక ఫోర్) మాత్రమే రెండంకెల స్కోరు దాటారు. ఏకంగా ఐదుగురు బ్యాటర్లు డకౌట్ అయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో మాట్ హెన్రీ ఐదు వికెట్లు తీయగా, విలియం ఓరౌర్క్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. టిమ్ సౌతీకి ఒక వికెట్ దక్కింది.


న్యూజిలాండ్ పేసర్లను ఎదుర్కోలేక...
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ సీమర్లకు అనుకూలించడం వల్ల చాలా మందకొడిగా ఇన్నింగ్స్ ప్రారంభం అయింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సర్ఫరాజ్ ఖాన్ ముగ్గురూ ఒక్క పరుగు తేడాతో అవుటయ్యారు. దీంతో భారత్ 10 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.


ఆ తర్వాత యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్ కలిసి ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టే ప్రయత్నం చేశారు. వీరు నాలుగో వికెట్‌కు 21 పరుగులు జోడించారు. భారత ఇన్నింగ్స్‌లో ఇదే అత్యధిక భాగస్వామ్యం. ఈ పార్ట్‌నర్ షిప్ బ్రేక్ అయ్యాక మరోసారి భారత్ ఒక్క పరుగు వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయింది. కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ ముగ్గురూ డకౌట్ అయ్యారు. ఆ తర్వాత వచ్చిన వారు ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేదు. దీంతో భారత్ 46 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ కేవలం పేసర్లతోనే బౌలింగ్ చేయించింది.


భారత్ తుదిజట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్


న్యూజిలాండ్ తుదిజట్టు
టామ్ లాథమ్ (కెప్టెన్), డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మాట్ హెన్రీ, టిమ్ సౌతీ, అజాజ్ పటేల్, విలియం ఓరౌర్క్



Also Read: టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో రిషబ్ పంత్ యాక్టింగ్ చేశాడా! రోహిత్ కామెంట్లపై స్పందించిన కీపర్