Rishabh Pant disrupted South Africas rhythm during the T20 World Cup 2024 final | టీ20 ప్రపంచ కప్ 2024 ఫైనల్లో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ వ్యూహంతో దక్షిణాఫ్రికాపై భారత్ విజయం సాధించిందని కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ పంత్ బ్రిలియంట్ ఐడియా అని ప్రశంసించారు. కీలకమైన మ్యాచ్ లో శక్తితో పాటు యుక్తి కూడా ఉండాలని యువ సంచలనం పంత్ నిరూపించాడని భారత క్రికెట్ ప్రేమికులు కితాబిచ్చారు. అయితే ఫైనల్లో ఆ సమయంలో పంత్ గాయపడ్డట్లుగా చేసి కొంత టైం బ్రేక్ వచ్చేలా చేయడంతో, దక్షిణాఫ్రికా దూకుడు కళ్లెం వేశామని రోహిత్ తెలిపాడు. తద్వారా భారత్ 17 ఏళ్ల తరువాత టీ20 వరల్డ్ కప్ కైవసం చేసుకుందని ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 


‘దక్షిణాఫ్రికా విజయానికి 30 బంతుల్లో 30 పరుగులు అవసరం కాగా, టీ20లో ఇది చాలా తేలిక. కానీ మ్యాచ్ లో సఫారీల దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు రిషభ్ పంత్ వ్యూహం ఫలించింది. తాను ఫీల్డింగ్ సెట్ చేస్తుండగా అకస్మాత్తుగా మోకాలికి గాయంతో రిషబ్ పంత్ కింద పడిపోయాడు. వెంటనే ఫిజియో మైదానంలోకి వచ్చాడు. పంత్ కు టేప్ వేసి ఫిజియో వెళ్లిపోయాడు. ఈ క్రమంలో మ్యాచ్ కాస్త నెమ్మదించి, సఫారీలు లయ కోల్పోవడంతో భారత బౌలర్ల పని తేలికైంది. దీనికంతటికి పంత్ బ్రిలియంట్ మైండ్ సెట్ కారణమని’ రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గాయం కాకున్నా పంత్ అలా చేశాడని, అదే భారత్ విజయానికి దారితీసిందని సోషల్ మీడియాలో కామెంట్స్ వచ్చాయి. రోహిత్ శర్మ కామెంట్స్ పై కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ తొలిసారి స్పందించాడు.


ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా రిషబ్ పంత్ మాట్లాడుతూ.. ‘కీలకమైన సమయంలో ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను. గతం రెండు, మూడు ఓవర్లో దక్షిణాఫ్రికా బ్యాటర్లు భారీగా పరుగులు చేశారు. ప్రపంచ కప్ ఫైనల్ లాంటి టైమ్ మళ్లీ వస్తుందా? ఏం చేయాలా అని ఆలోచించి మైదానంలో పడిపోయాను. కొంత టైమ్ ఇక్కడ వెచ్చించండి. టేప్ వేస్తున్నట్లు ఏదో ఒకటి చేస్తూ కాస్త టైమ్ వేస్ట్ చేయాలని  ఫిజియోకి చెప్పానని’ టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో ఫిజియోతో జరిగిన సంభాషణను వెల్లడించాడు.






కొన్నిసార్లు మ్యాచ్ నెగ్గాలంటే చిన్న టెక్నిక్ ఉపయోగించాలి. టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో తాను అదే చేశానన్నాడు పంత్. మోకాలికి మీద తొడ బాగంలో టేపు వేయడానికి టైం పడుతుందని ఫిజియో నాతో చెప్పగా, మాకు కావాల్సింది అదే టైమ్ తీసుకోమని తాను చెప్పినట్లు పంత్ వెల్లడించాడు. అప్పుడు ఫిజియో నాతో మస్త్ యాక్టింగ్ చేస్తున్నావ్ భాయ్ అన్నాడని ఆరోజు జరిగిన ఘటనపై రిషబ్ పంత్ తాను ఏం చేశాడో షేర్ చేసుకున్నాడు. కీలక సమయంలో అవసరమైతే ఏదైనా చేయాలని, కొంత సమయం తాను యాక్టింగ్ చేశాడని పంత్ చెప్పడంతో అంతా నవ్వారు. పంత్ యాక్టింగ్ సూపర్ అని, ఆస్కార్ కు ఆస్కారం ఉందని నెటిజన్లు ఓ రేంజ్‌లో కామెంట్ చేస్తున్నారు.