జార్ఖండ్‌లో భారత్‌కు భారీ షాక్. టీమిండియాపై న్యూజిలాండ్ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. అనంతరం భారత్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 155 పరుగులకు పరిమితం అయింది. దీంతో సిరీస్‌లో న్యూజిలాండ్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.


177 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు మొదట్లోనే షాక్ తగిలింది. లోకల్ బాయ్ ఇషాన్ కిషన్ (4), శుభ్‌మన్ గిల్ (7), రాహుల్ త్రిపాఠి (0) ముగ్గురూ ఘోరంగా విఫలం అయ్యారు. దీంతో భారత్ 15 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. అయితే నాలుగో వికెట్‌కు సూర్యకుమార్ యాదవ్ (47), హార్దిక్ పాండ్యా (21) 68 పరుగులు జోడించి ఆశలు రేకెత్తించారు.


అయితే వీరిద్దరూ కేవలం నాలుగు బంతుల వ్యవధిలోనే అవుటయ్యారు. అనంతరం వాషింగ్టన్ సుందర్ పోరాడినా తనకు మరో ఎండ్‌లో మద్దతు లభించలేదు. దీంతో భారత్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 155 పరుగులకు పరిమితం అయింది.


అంతకు ముందు న్యూజిలాండ్ ఓపెనర్లు ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే శుభారంభం ందించారు. ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్‌ 4.2 ఓవర్లలో 43 పరుగులు జోడించారు. ఫిన్ అలెన్ 23 బంతుల్లో 35 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. ఇక డ్వేన్ కాన్వే 35 బంతుల్లో 52 పరుగులు చేశాడు. ఈ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ అతని ఇన్నింగ్స్‌లో ఏడు ఫోర్లు, ఒక సిక్స్ కొట్టాడు. దీని తర్వాత చాలా మంది బ్యాట్స్‌మెన్ ఎక్కువగా రాణించలేక పెవిలియన్‌కు చేరుకున్నారు. అయితే చివర్లో డేరిల్ మిచెల్ 30 బంతుల్లో అజేయమైన 59 పరుగుల ఇన్నింగ్స్‌తో తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు.


భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ రెండు వికెట్లు అందుకున్నాడు. దీంతో పాటు అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, శివమ్ మావి తలో వికెట్ తీసుకున్నారు. న్యూజిలాండ్ బ్యాటర్లలో మైకేల్ బ్రేస్‌వెల్ రనౌట్ అయ్యాడు. అంతకుముందు న్యూజిలాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా 3-0తో విజయం సాధించింది. ఇప్పుడు టీ20 సిరీస్‌లో ఇరు జట్లు ముఖాముఖి తలపడుతున్నాయి. మొదటి టీ20లో న్యూజిలాండ్ విజయం సాధించింది కాబట్టి ఇప్పుడు ఒత్తిడిపై భారత జట్టుపై  పడనుంది.