లార్డ్స్‌లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో తొలి రోజు భారత్‌ పైచేయి సాధించింది. ఓపెనర్స్‌ ఇచ్చిన శుభారంభంతో భారీ స్కోరు దిశగా దూసుకెళ్తోంది. 


తొలిరోజు 90ఓవర్లు ఆడిన టీమిండియా మూడు వికెట్లు కోల్పోయి 276పరుగులు సాధించింది. ప్రస్తుతం రాహుల్‌ 127పరుగులతో, రహానే ఒక్క పరుగుతో క్రీజ్‌లో ఉన్నారు. ఓపెన్ రోహిత్ శర్మ 83పరుగుల చేశాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ 42పరుగులకు ఔటయ్యాడు. రెండో టెస్టులోనూ విఫలమైన పుజారా కేవలం 9పరుగులే చేసి ఔట్‌ అయ్యాడు.


మొదట టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు మంచి కిక్‌స్టార్ట్ లభించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, రాహుల్ ఆట నెమ్మదిగా స్టార్ట్ చేసి తర్వాత జోరు పెంచారు. మొదట వరుణుడు పదే పదే ఆటకు అంతరాయం కలిగించాడు. ఒకానొక దశలో ఆట ఆగిపోతుందేమో అన్న అనుమానం కూడా కలిగింది. లంచ్‌ వరకు ఇదే పరిస్థితి కొనసాగింది. లంచ్‌ తర్వాత వర్షం ఆగిపోవడం... భారత్‌ బ్యాట్స్‌మెన్ దూకుడు స్టార్ట్ చేశారు. వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు సాధిస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. స్పీడ్‌గా ఆడుతున్న రోహిత్ శర్మ సెంచరీ చేస్తాడేమో అన్న ఆనందం అందరిలో కలిగింది అయితే 83పరుగుల వ్యక్తిగ స్కోరు వద్ద అండర్సన్ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు.


ఆ తర్వాత వచ్చిన పుజారా కేవలం 9పరుగులే చేసి అండర్సన్ బౌలింగ్‌లో స్లిప్‌లో క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. పుజారా ఔటైన తర్వాత వచ్చిన కోహ్లీ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడాడు. రెండు వికెట్ల నష్టానికి 157పరుగులతో రెండో సెషన్ పూర్తి చేసింది భారత్. 


తర్వాత సెషన్‌లో కోహ్లీ, రాహుల్ ధాటిగా ఆడారు.. ఇద్దరూ మరో సెంచరీ పార్టనర్‌షిప్‌ నమోదు చేశారు. కోహ్లీ అండతో రాహుల్ టెస్టుల్లో తన ఐదో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. విరాట్‌ కూడా అర్థ సెంచరీ చేస్తాడనుకున్న టైంలో రాబిన్‌సన్‌ బౌలింగ్‌లో రూట్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు కోహ్లీ. చివరకి రహానే వచ్చి జాగ్రత్తగా ఆడి మరో వికెట్ పడకుండా చూసుకున్నాడు. 


లార్డ్స్‌లో వంద పరుగులకుపైగా భాగస్వామ్యం నెలకొల్పిన రెండో జోడీగా రికార్డు సృష్టించింది రోహిత్, రాహుల్ జంట. ఈ ఓపెనింగ్ జోడీ 69ఏళ్ల రికార్డు బ్రేక్ చేసింది. వంద పరుగులపైగా  పార్టనర్‌షిప్‌ నెలకొల్పిన జోడీగా చరిత్ర తిరగరాసింది. 1952లో జరిగిన మ్యాచ్‌లో అప్పటి ఓపెనింగ్ జోడీ వినోద్‌ మన్కడ్‌-పంకజ్‌ రాయ్‌ కలిసి లార్డ్స్‌ గ్రౌండ్‌లో నెలకొల్పిన 106పరుగులే ఇప్పటికి అత్యధిక ఓపెనింగ్ పార్టనర్‌ షిప్‌. ఇప్పుడు దాన్ని రాహుల్, రోహిత్‌ జంట బ్రేక్ చేసింది.  126 పరుగుల భాగస్వామ్యంతో సరికొత్త చరిత్ర సృష్టించిందీ ద్వయం. ఈ మ్యాచ్‌లో ధాటిగా ఆడిన రోహిత్‌ శర్మ 83పరుగులు చేసి ఔటయ్యారు. 145 బంతుల్లో 11ఫోర్లు, 1 సిక్స్‌ కొట్టాడు. ఆండర్సన్ బౌలింగ్‌లో వికెట్ సమర్పించుకున్నాడు.