ఆస్ట్రేలియాతో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డేలో భారత్ లక్ష్యం వైపుగా సాగుతుంది. 270 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 25 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్లు కోల్పోయి 123 పరుగులు సాధించింది. వన్ డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (37 నాటౌట్: 44 బంతుల్లో, ఒక ఫోర్లు, ఒక సిక్సర్), కేఎల్ రాహుల్ (17 నాటౌట్: 41 బంతుల్లో) ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. ఆస్ట్రేలియా బౌలర్లలో సీన్ అబాట్, ఆడం జంపా చెరో వికెట్ తీసుకున్నారు. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49 ఓవర్లలో 269 పరుగులకు ఆలౌట్ అయింది.


ఓ మోస్తరు లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు శుభారంభం లభించింది. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ (37: 49 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్), రోహిత్ శర్మ (30: 17 బంతుల్లో, రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు) మొదటి వికెట్‌కు 9.1 ఓవర్లలోనే 65 పరుగులు జోడించారు. రోహిత్ అయితే బౌండరీలు, సిక్సర్లతో చెలరేగాడు. రోహిత్ శర్మను అవుట్ చేసి సీన్ అబాట్ ఆస్ట్రేలియాకు మొదటి బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత కాసేపటికే శుభ్‌మన్ గిల్ కూడా ఆడం జంపా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుటయ్యాడు. దీంతో భారత్ 77 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది.


అనంతరం విరాట్ కోహ్లీ (37 నాటౌట్: 44 బంతుల్లో, ఒక ఫోర్లు, ఒక సిక్సర్), కేఎల్ రాహుల్ (17 నాటౌట్: 41 బంతుల్లో) కలిసి ఇన్నింగ్స్‌ను కుదుట పరిచారు. బౌండరీల కోసం ప్రయత్నించకుండా సింగిల్స్‌తో స్కోరును ముందుకు నడిపించారు. ఇప్పటికి వీరు మూడో వికెట్‌కు అజేయంగా 46 పరుగులు జోడించారు.


అదరగొట్టిన ఆస్ట్రేలియా బ్యాటర్లు


ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (33: 31 బంతుల్లో, నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు), మిషెల్ మార్ష్ (47: 47 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్) ఆస్ట్రేలియాకు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. వీరు మొదటి వికెట్‌కు కేవలం 10.5 ఓవర్లలోనే 68 పరుగులు జోడించారు. ఈ దశలో ఆస్ట్రేలియాను భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా దెబ్బ తీశాడు. ట్రావిస్ హెడ్ వికెట్‌ను తీసి భారత్‌కు మొదటి బ్రేక్ ఇచ్చాడు. అనంతరం తన వరుస ఓవర్లలో మరో ఓపెనర్ మిషెల్ మార్ష్, వన్ డౌన్ బ్యాటర్, కెప్టెన్ అయిన స్టీవ్ స్మిత్‌లను (0: 3 బంతుల్లో) కూడా వెనక్కి పంపాడు. దీంతో ఆస్ట్రేలియా  14.3 ఓవర్లలోనే 85 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది.


ఆ తర్వాత డేవిడ్ వార్నర్, మార్నస్ లబుషేన్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. వీరు నాలుగో వికెట్‌కు 40 పరుగులు జోడించారు. క్రమంగా ఇద్దరూ క్రీజులో కుదురుకుంటున్న దశలో ఈసారి కుల్‌దీప్ యాదవ్ ఆస్ట్రేలియాకు షాక్ ఇచ్చాడు. డీప్ మిడ్ వికెట్ వైపు లాఫ్టెడ్ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన డేవిడ్ వార్నర్ లాంగాఫ్‌లో హార్దిక్ పాండ్యా చేతికి చిక్కాడు. దీంతో ఆస్ట్రేలియా 25 ఓవర్లు ముగిసేసరికి నాలుగు వికెట్లు నష్టపోయి 126 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో మార్నస్ లబుషేన్ (20 నాటౌట్: 35 బంతుల్లో, ఒక సిక్సర్), అలెక్స్ కారీ (1 నాటౌట్: 3 బంతుల్లో) ఉన్నారు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యాకు మూడు, కుల్దీప్ యాదవ్‌కు ఒక వికెట్ దక్కాయి.