India vs Australia, 2nd ODI: భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఈ మ్యాచ్‌లో టీమిండియా మొదట బ్యాటింగ్ చేయనుంది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ స్టేడియంలో ఈ మ్యాచ్‌ను నిర్వహిస్తున్నారు. ఈ సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లో భారత్ విజయం సాధించి సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో ఉంది.


ఈ మ్యాచ్‌కు టీమిండియా రెండు మార్పులు చేసింది. ఇషాన్ కిషన్ స్థానంలో కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి జట్టులోకి వచ్చాడు. పేస్ ఆల్‌ రౌండర్ శార్దూల్ ఠాకూర్ స్థానంలో స్పిన్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్‌కు జట్టులో స్థానం దక్కింది. 


మరోవైపు ఆస్ట్రేలియా కూడా తమ జట్టుకు రెండు మార్పులు చేసింది. గ్లెన్ మ్యాక్స్‌వెల్ స్థానంలో నాథన్ ఎల్లిస్, జోస్ ఇంగ్లిస్ స్థానంలో అలెక్స్ కారీ జట్టులోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ పిచ్‌ను ఎంతో కాలం నుంచి కవర్స్‌తో కప్పి ఉంచారు. కాబట్టి బౌలింగ్ ఎంచుకున్నామని ఆస్ట్రేలియా కెప్టెన్ స్మిత్ తెలిపాడు.


భారత్ తుది జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ


ఆస్ట్రేలియా తుది జట్టు
ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్(కెప్టెన్), మార్నస్ లాబుస్చాగ్నే, అలెక్స్ కారీ(వికెట్ కీపర్), కామెరాన్ గ్రీన్, మార్కస్ స్టోయినిస్, సీన్ అబాట్, నాథన్ ఎల్లిస్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా


ఈ మ్యాచ్‌కు వరుణుడు ఆద్యంతం అంతరాయాలు కల్పించే అవకాశం ఉంది. ఆదివారం భారీ వర్షం కురిసేందుకు 31-51 శాతం వరకు అవకాశం ఉందని వాతావరణ శాఖ, వెబ్‌సైట్లు అంచనా వేస్తున్నాయి. సాయంత్రం 5 గంటలకు వర్షంతో మ్యాచ్‌ ఆగిపోవచ్చని అంటున్నారు.


ఆదివారం విశాఖలో 26 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండనుంది. రాత్రికి ఇది 23 డిగ్రీలకు తగ్గనుంది. శనివారం రాత్రి, ఆదివారం ఉదయం ఉరుములు, మెరుపులు కనిపిస్తాయని అంటున్నారు. ఉదయం 80 శాతం, రాత్రి 49 శాతం వర్షం కురిసేందుకు అవకాశం ఉంది.


ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో టీమ్‌ఇండియా సూపర్‌ డూపర్‌ విక్టరీ సాధించింది. వాంఖడేలో దుమ్మురేపింది. మూడు మ్యాచుల సిరీసులో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ప్రత్యర్థి నిర్దేశించిన 189 పరుగుల లక్ష్యాన్ని అత్యంత సాధికారికంగా ఛేదించింది. సీమ్‌, స్వింగ్‌తో ఆసీస్‌ పేసర్లు వణికించిన వేళ.. ఓడిపోతామేమోనని ఆందోళన చెందిన వేళ.. కేఎల్‌ రాహుల్‌ (75; 91 బంతుల్లో 7x4, 1x6) నిలబడ్డాడు. తనకిష్టమైన ముంబయిలో తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. రవీంద్ర జడేజా (45; 69 బంతుల్లో 5x4) అతడికి అండగా నిలిచాడు. అంతకు ముందు ఆసీస్‌లో మిచెల్‌ మార్ష్‌ (81: 65 బంతుల్లో 10x4, 5x6) ఒంటరి పోరాటం చేశాడు. మహ్మద్‌ షమి, సిరాజ్‌ చెరో 3 వికెట్లు పడగొట్టారు.


కేఎల్‌ రాహుల్‌, రవీంద్ర జడేజా ఈ మ్యాచ్‌లో తమ అసలైన ఆటతీరును బయటకు తీశారు. ఆఫ్‌సైడ్‌ స్వింగ్‌ అవుతున్న బంతుల్ని వదిలేశారు. చెత్త బంతుల్ని మాత్రమే వేటాడారు. సింగిల్స్‌, డబుల్స్‌ రొటేట్‌ చేశారు. జట్టు స్కోరు 100 దాటించారు. ఆపై 150ని అధిగమించారు. 73 బంతుల్లో హాఫ్‌ సెంచరీ అందుకున్నాక కేఎల్‌ కొన్ని బౌండరీలు బాదడంతో గెలుపు ఖాయమైంది. జడ్డూ సైతం బాగా ఆడటంతో ఈ జోడీ 123 బంతుల్లో 108 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పింది. 61 బంతులు మిగిలుండగానే 5 వికెట్ల తేడాతో గెలిపించింది.