India beat Pakistan, secure World Group I berth:  ఆరు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత పాకిస్థాన్‌(Pakistan)లో అడుగుపెట్టిన భారత టెన్నీస్ జట్టు అద్భుత ఆటతీరుతో అదరగొట్టింది. స్ఫూర్తిదాయక ప్రదర్శనతో ప్రత్యర్థిని 4-0తో చిత్తు చేసి డేవిస్‌కప్‌ ప్రపంచ గ్రూప్‌-1లోకి ప్రవేశించింది. ప్లేఆఫ్స్‌లో శనివారం 2-0 ఆధిక్యంలో నిలిచిన భారత్‌.. ఆదివారం, రెండోరోజు డబుల్స్‌, రివర్స్‌ సింగిల్స్‌ను చేజిక్కించుకుని ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. డబుల్స్‌లో సాకేత్‌ మైనేని-యుకి బాంబ్రి(Yuki Bhambri- Saketh Myneni) జంట 6-2, 7-6 (7-5)తో ముజామిల్‌ మొర్తజా-అకీల్‌ఖాన్‌ జోడీని ఓడించి భారత్‌కు విజయాన్ని ఖాయం చేసింది. తొలి సెట్లో దూకుడుగా ఆడిన భారత జంట.. ప్రత్యర్థిపై ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. రెండో సెట్లో యుకీ జోడీ కూడా పట్టు వదలకపోవడంతో సెట్‌ టైబ్రేకర్‌కు మళ్లింది. టైబ్రేకర్‌లో సర్వీసుల్లో ఇబ్బంది పడిన భారత జంట 2-4తో వెనుకబడింది. అయితే తర్వాత పుంజుకుని స్కోరు సమం చేసింది. ఆపై సెట్‌తో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. అకీల్‌ డబుల్‌ఫాల్ట్‌ చేయడంతో భారత్‌ విజయాన్ని అందుకుంది. నామమాత్రమైన రివర్స్‌ సింగిల్స్‌ మ్యాచ్‌లో అరంగేట్ర ఆటగాడు నికీ పూంచా 6-3, 6-4తో మహ్మద్‌ షోయబ్‌పై గెలిచాడు. రెండో రివర్స్‌ సింగిల్స్‌ ఆడలేదు. పాక్‌పై భారత్‌కు ఇది ఎనిమిదో విజయం. 1964 తర్వాత పాక్‌ గడ్డపై భారత టెన్నిస్‌ జట్టుకు ఇదే తొలి గెలుపు. 




 

భారీ భద్రత

పాకిస్థాన్‌ చేరుకున్న అయిదుగురు సభ్యుల భారత జట్టుకు అధ్యక్ష తరహా భద్రతను కల్పించారు. ప్లేయర్ల భద్రతపై ఆందోళన వ్యక్తమవడంతో.. ఎక్కడా రాజీపడకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్టు పాకిస్థాన్‌ టెన్నిస్‌ సమాఖ్య(Pakistan Tennis Federation) తెలిపింది. భారత బృందం చుట్టూ నాలుగు లేదా ఐదంచెల భద్రతా వలయం ఉంటుందని చెప్పింది. 1964లో చివరిసారి భారత డేవిస్‌కప్‌ జట్టు పాక్‌లో పర్యటించింది. 1973, 2019లో తటస్థ వేదికలపై పాక్‌తో తలపడింది. అయితే, ఈసారి వేదికను మార్చాలని అఖిల భారత టెన్నిస్‌ సమాఖ్య తీవ్రంగా ప్రయత్నించినా సాధ్యపడలేదు. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ డబుల్స్‌ టైటిల్‌ నెగ్గిన సీనియర్‌ ఆటగాడు రోహన్‌ బోపన్న పాకిస్తాన్‌కు వెళ్లలేదు.

డేవిస్‌ కప్‌ జట్టు: జీషన్‌ అలీ( కెప్టెన్‌‌) యుకీ బ్రాంబీ, రామ్‌కుమార్‌ రామనాథన్‌, ఎన్‌.శ్రీరాం బాలాజీ, సాకేత్‌ మైనేని, నికీ కలియండా పూనచ, దిగ్విజరు ఎస్డీ ప్రజ్వల్‌ దేవ్‌(రిజర్వ్‌).

బొప్పన్న చరిత్ర

భారత టెన్నిస్‌ స్టార్‌ రోహన్ బోపన్న చరిత్ర సృష్టించాడు. మాథ్యూ ఎబ్డెన్‌తో కలిసి ఆస్ట్రేలియా ఓపెన్‌ టెన్నిస్‌ మెన్స్‌ డబుల్స్‌ను టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ఫైనల్లో ఆస్ట్రేలియన్‌ ప్లేయర్ ఎబ్డెన్‌తో కలిసి ఆడిన బోపన్న 7-6,7-5 తేడాతో ఇటలీ జోడి సిమోన్‌- వావాసోరి జోడీపై జయభేరి మోగించారు. తద్వారా తొలిసారి పురుషుల డబుల్స్‌ గ్రాండస్లామ్‌ టైటిల్‌ నెగ్గిన ఆటగాడిగా భారత వెటరన్ ఆటగాడు రోహన్ బోపన్న నిలిచాడు. అతిపెద్ద వయసులో ఆస్ట్రేలియా గ్రాండ్ స్లామ్ నెగ్గిన ఆటగాడిగానూ 43 ఏళ్ల రోహన్ బోపన్న రికార్డులు తిరగరాశాడు. ఇటీవల అతిపెద్ద వయసులో డబుల్స్ లో నెంబర్ వన్ ర్యాంక్ చేరుకున్న రోహన్ బోపన్న తాజాగా గ్రాండ్ స్లామ్ డబుల్స్ విజేతగా అవతరించాడు.