ఐపీఎల్ ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్.. కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై 27 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో మూడు వికెట్లు 192 పరుగులు చేసింది. 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా ఓపెనర్లు రాణించడంతో ఒక దశలో సులభంగా విజయం సాధించేలా కనిపించినా.. వరుసగా వికెట్లు కోల్పోయి 20 ఓవర్లలో 165 పరుగులకే పరిమితం అయింది. దీంతో చెన్నై నాలుగోసారి ఐపీఎల్ గెలిచింది. 2012 ఫైనల్స్‌లో కోల్‌కతా చేతిలో ఎదురైన పరాజయానికి ప్రతీకారం కూడా తీర్చుకుంది.


అందరూ అద్భుతంగా..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నైకి అదిరిపోయే ఆరంభం లభించింది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (32: 27 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్), ఫాఫ్ డుఫ్లెసిస్ (86: 59 బంతుల్లో, ఏడు ఫోర్లు, మూడు సిక్సర్లు) మొదటి బంతి నుంచి వేగంగా ఆడటంతో.. పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి చెన్నై వికెట్ నష్టపోకుండా 50 పరుగులు చేసింది. మొదటి వికెట్‌కు 61 పరుగులు జోడించిన అనంతరం ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్లో  రుతురాజ్ గైక్వాడ్ అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన రాబిన్ ఊతప్ప (31: 15 బంతుల్లో, మూడు సిక్సర్లు) మొదటి బంతి నుంచి చెలరేగి ఆడాడు. దీంతో స్కోరు వేగం ఏమాత్రం తగ్గలేదు. పది ఓవర్లు ముగిసేసరికి చెన్నై వికెట్ నష్టానికి 80 పరుగులు చేసింది.


ఇన్నింగ్స్ 11వ ఓవర్లో ఫాప్ డుఫ్లెసిస్ తన అర్థసెంచరీని 35 బంతుల్లో పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత ఊతప్ప, డుఫ్లెసిస్ ఇద్దరూ మరింత చెలరేగి ఆడారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 63 పరుగులు జోడించారు. వేగాన్ని మరింత పెంచే క్రమంలో ఊతప్ప కూడా అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన మొయిన్ అలీ (37 నాటౌట్: 20 బంతుల్లో, రెండు ఫోర్లు, మూడు సిక్సర్లు) కూడా వేగంగా ఆడాడు. మొయిన్ అలీ, డుఫ్లెసిస్ కలిసి మూడో వికెట్‌కు 68 పరుగులు జోడించారు. ఇన్నింగ్స్ ఆఖరి బంతికి డుఫ్లెసిస్ అవుటయ్యాడు. దీంతో చెన్నై 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. కోల్‌కతా బౌలర్లలో నరైన్ రెండు వికెట్లు తీయగా.. శివం మావి ఒక వికెట్ తీశాడు.


ఒక్కసారిగా కుప్పకూలిన కోల్‌కతా
ఇక కోల్‌కతాకు చెన్నైకి మించిన ఆరంభం లభించింది. ఫాంలో ఉన్న ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ (51: 43 బంతుల్లో, ఆరు ఫోర్లు), వెంకటేష్ అయ్యర్ (50: 32 బంతుల్లో, ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లు) అద్భుతంగా ఆడారు. వెంకటేష్ అయ్యర్ ఒక్క పరుగు కూడా చేయకముందే తన క్యాచ్‌ను ధోని వదిలేయడంతో ఆ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకున్నాడు. సిక్సర్లు, ఫోర్లు కొడుతూ స్కోరును పరుగులు పెట్టించారు. ఇన్నింగ్స్ పదో ఓవర్లో వెంకటేష్ అయ్యర్ అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో పది ఓవర్లకు కోల్‌కతా వికెట్ కోల్పోకుండా 88 పరుగులు చేసింది.


ఆ తర్వాత మ్యాచ్ ఒక్కసారిగా మలుపు చెన్నై బౌలర్లు ఒక్కసారిగా మాస్ కంబ్యాక్ ఇచ్చారు. ఇన్నింగ్స్ 11వ ఓవర్లో శార్దూల్ ఠాకూర్.. వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా (0: 1 బంతి)లను అవుట్ చేసి కోల్‌కతాను ఒత్తిడిలోకి నెట్టాడు. ఆ తర్వాత ఇన్నింగ్స్ 12వ ఓవర్లో సునీల్ నరైన్ (2: 2 బంతుల్లో), 14వ ఓవర్లో శుభ్‌మన్ గిల్ అవుటయ్యారు. జడేజా వేసిన ఇన్నింగ్స్ 15వ ఓవర్లో వరుస బంతుల్లో దినేష్ కార్తీక్ (9: 7 బంతుల్లో, ఒక సిక్సర్), షకీబ్ అల్ హసన్  (0: 1 బంతి) అవుటయ్యారు. ఆ తర్వాత కూడా వికెట్ల పతనం ఆగలేదు. 16వ ఓవర్లో రాహుల్ త్రిపాఠి (2: 3 బంతుల్లో), 17వ ఓవర్లో ఇయాన్ మోర్గాన్ (4: 8 బంతుల్లో) కూడా అవుటయ్యారు. ఆ తర్వాత శివం మావి (20: 13 బంతుల్లో, ఒక ఫోర్, రెండు సిక్సర్లు), లోకి ఫెర్గూసన్ (18 నాటౌట్: 11 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) కాసిన్ని మెరుపులు మెరిపించినా.. అప్పటికే చాలా ఆలస్యం అయింది. దీంతో 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టానికి 165 పరుగులు మాత్రమే చేసింది. చెన్నై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ మూడు వికెట్లు తీయగా, జోష్ హజిల్‌వుడ్, రవీంద్ర జడేజా రెండేసి వికెట్లు తీశారు. చాహర్, బ్రేవోలకు చెరో వికెట్ దక్కింది.


కోల్‌కతా గత మ్యాచ్‌లో చేసిన తప్పునే మళ్లీ పునరావృతం చేసింది. ఢిల్లీతో సులభంగా గెలవాల్సిన మ్యాచ్‌ను వరుసగా వికెట్లు కోల్పోయి కోల్‌కతా పీకల మీదకు తెచ్చుకుంది. చివర్లో త్రిపాఠి సిక్సర్ కొట్టడంతో చచ్చీ చెడీ మ్యాచ్‌లో విజయం సాధించింది. అయితే ఈసారి కొట్టాల్సిన స్కోరు ఎక్కువగా ఉండటంతో ఆ ఫీట్ ఇక్కడ రిపీట్ కాలేదు.