Sunil Gavaskar Made Huge Claims On Team India Triumph: రాంచీ(Ranchi) వేదికగా జరిగిన నాలుగో టెస్ట్‌లో విజయంతో ఇంగ్లాండ్‌(England)తో ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్‌ 3-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ గెలుపుతో రోహిత్‌ సేన మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ కైవసం చేసుకుంది. యువ క్రికెటర్లు తమకొచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం ఆనందంగా ఉందని టీమిండియా సారధి రోహిత్‌ శర్మ అన్నాడు. సీనియర్లు మళ్లీ జట్టులోకి వచ్చినా ఒత్తిడికి గురికాకుండా నిర్ణయం తీసుకుంటామని హిట్‌ మ్యాన్‌ స్పష్టం చేశాడు. ఇప్పుడు ఇదే విషయాన్ని టీమిండియా దిగ్గజం సునీల్‌ గవాస్కర్‌ కూడా అన్నాడు. బజ్‌బాల్‌తో టెస్ట్‌ క్రికెట్‌ను శాసిస్తున్న ఇంగ్లాండ్‌పై టెస్ట్‌ సిరీస్‌ విజయం తప్పకుండా కొందరికి హెచ్చరిక అని గవాస్కర్‌ పేర్కొన్నాడు. తాము లేకపోతే భారత్ గెలవలేదని అనుకొనే వారికి ఇదొక బలమైన సందేశమని వ్యాఖ్యానించాడు. మ్యాచ్‌లు గెలిచేందుకు కేవలం పెద్ద స్టార్లు అవసరం లేదని కూడా అన్నాడు. ఇకనుంచి ఎవరైనా ‘స్టార్లు’ తాము లేకపోతే భారత్‌ గెలవడం కష్టమని భావించే వారికి ఈ సిరీస్‌ విజయం ఓ హెచ్చరిక అని గవాస్కర్‌ తెలిపాడు. క్రికెట్ అనేది జట్టుగా పోరాడేదని... కేవలం ఒకరిద్దరి మీదనే ఆధారపడి ఉండదని తేల్చి చెప్పాడు. 


రోహిత్‌ది అదే దారి
యువ ఆటగాళ్లు ఇంగ్లాండ్‌తో టెస్ట్‌ సిరీస్‌లో అద్భుతంగా ఆడారని... కఠిన పరిస్థితులను ఎదుర్కొని రాణించారని రోహిత్‌ అన్నాడు. టెస్టు సిరీస్‌లో అద్భుత పోరాటంతో యువ ఆటగాళ్లు సత్తా చాటారాన్న రోహిత్‌... మరో మ్యాచ్‌ మిగిలిఉండగానే టెస్టు సిరీస్‌ను గెలుచుకోవడం ఆనందంగా ఉందన్నాడు. మైదానంలో మేం ఎలా ఆడాలని భావించామో.. అదే తీరులో ఆధిపత్యం ప్రదర్శించామని తెలిపాడు. దేశవాళీ క్రికెట్‌ ఆడి నేరుగా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ప్లేయర్లూ సత్తా చాటారని హిట్‌మ్యాన్‌ కొనియాడాడు. యువ క్రికెటర్లకు స్వేచ్ఛ ఇచ్చి ఆడేలా చేయగలగడంలో తాను, కోచ్‌ ద్రావిడ్‌ విజయవంతం అయ్యామని రోహిత్‌ తెలిపాడు. రెండో టెస్టు ఆడుతున్న ధ్రువ్ జురెల్ ఏ ఒత్తిడికి గురికాకుండా గొప్ప పరిణితి ప్రదర్శించాడని హిట్‌ మ్యాన్‌ ప్రశంసలు కురిపించాడు. విరాట్ కోహ్లీతో సహా సీనియర్లు వచ్చినప్పుడు జట్టులో మార్పుల గురించి తమపై ఎలాంటి ఒత్తిడి లేదని రోహిత్‌ స్పష్టం చేశాడు. చివరి మ్యాచ్‌లోనూ ఉత్సాహంగా బరిలోకి దిగుతామని రోహిత్ వెల్లడించాడు.



కల సాకారమైందన్న జురెల్‌
రాంచీ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్‌లో రెండు ఇన్నింగ్సుల్లోనూ అద్భుతంగా బ్యాటింగ్‌ చేసిన ధ్రువ్‌ జురెల్‌..తన ప్రదర్శనపై స్పందించాడు. మ్యాచ్‌ సమయంలో తనకు ఇలానే ఆడాలని ఎవరూ ప్రత్యేకంగా చెప్పలేదని ధ్రువ్‌ చెప్పాడు. తన సహజసిద్ధమైన ఆటతీరునే ఆడానని... బంతిని నిశితంగా గమనించి ఎదుర్కొన్నానని తెలిపాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ మిస్‌ కావడంపై బాధేమీ లేదన్న ధ్రువ్‌.. తన మొదటి సిరీస్‌ ట్రోఫీని ఎత్తుకొనేందుకు తహతహలాడుతున్నానని తెలిపాడు. టెస్టుల్లో భారత్‌ తరఫున ఆడాలనేది చిన్నప్పటినుంచి కల అని. ఇప్పుడు నెరవేరడం సంతోషంగా అనిపిస్తోందన్నాడు. క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గవాస్కర్‌ తనను మరో ధోనీ అంటూ పొగడడం ఆనందంగా ఉందని ధ్రువ్‌ తెలిపాడు.