World Test Championship points table: రాంచీ (ranchi)వేదికగా జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా(Team India) ఘన విజయం సాధించి... మరో మ్యాచ్ మిగిలి వుండగానే సిరీస్ కైవసం చేసుకుంది. లక్ష్య సాధనలో ఇంగ్లాండ్ స్పిన్నర్ బషీర్ కాస్త కంగారుపెట్టినా తొలి ఇన్నింగ్స్ హీరో జురెల్ గిల్ భారత్ ను విజయ తీరాలకు చేర్చారు. ఆరంభంలో సారధి రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ భారత్ కు బలమైన పునాది వేశారు. కానీ బషీర్ వరుసగా రెండు వికెట్లు తీయడంతో ఉత్కంఠ రేగింది.  కానీ గిల్... జురెల్ మిగితా పనిని ఎలాంటి ఒతిడి లేకుండా పూర్తి చేశారు. ఈ విజయంతో ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్‌ 3-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. నాలుగో టెస్టులో ఐదు వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌పై టీమ్‌ఇండియా విజయం సాధించింది. ఈ విజయంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ 2023-25లో భారత్‌ విజయాల శాతంలో పెరిగింది. ఈ గెలుపుతో భారత్‌ స్థానంలో ఎలాంటి మార్పు లేకపోయినా..  WTC  పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్‌కు టీమిండియా సమీపంగా వచ్చింది. ప్రస్తుతం భారత్‌ రెండో స్థానంలో 64.58 శాతంతో కొనసాగుతోంది. ఈ టెస్టుకు ముందు టీమ్‌ఇండియా విజయాల శాతం 59.52గా ఉండేది. పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్‌ 75 శాతంతో అగ్రస్థానంలో ఉంది. ఆస్ట్రేలియా (55), బంగ్లాదేశ్‌ (50), పాకిస్థాన్‌ (36.66) తొలి ఐదింట్లో నిలిచాయి. భారత్‌ చేతిలో సిరీస్‌ను కోల్పోయిన ఇంగ్లాండ్‌ స్థానం మరింత పతనమైంది. ఎనిమిదో స్థానానికి పడిపోయింది. 



కల సాకారమైందన్న జురెల్‌
 రాంచీ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్‌లో రెండు ఇన్నింగ్సుల్లోనూ అద్భుతంగా బ్యాటింగ్‌ చేసిన ధ్రువ్‌ జురెల్‌..తన ప్రదర్శనపై స్పందించాడు. మ్యాచ్‌ సమయంలో తనకు ఇలానే ఆడాలని ఎవరూ ప్రత్యేకంగా చెప్పలేదని ధ్రువ్‌ చెప్పాడు. తన సహజసిద్ధమైన ఆటతీరునే ఆడానని...  బంతిని నిశితంగా గమనించి ఎదుర్కొన్నానని తెలిపాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ మిస్‌ కావడంపై బాధేమీ లేదన్న ధ్రువ్‌.. తన మొదటి సిరీస్‌ ట్రోఫీని ఎత్తుకొనేందుకు తహతహలాడుతున్నానని తెలిపాడు. టెస్టుల్లో భారత్‌ తరఫున ఆడాలనేది చిన్నప్పటినుంచి కల అని. ఇప్పుడు నెరవేరడం సంతోషంగా అనిపిస్తోందన్నాడు. క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గవాస్కర్‌ తనను మరో ధోనీ అంటూ పొగడడం ఆనందంగా ఉందని ధ్రువ్‌ తెలిపాడు. నాలుగో టెస్ట్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 90, రెండో ఇన్నింగ్స్‌లో అజేయంగా 39 పరుగులు చేశాడు. దీంతో ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో ర‌వీంద్ర జ‌డేజా, స‌ర్ఫరాజ్ ఖాన్  త్వరగా ఔట్ అయినా శుభ్‌మ‌న్ గిల్‌, ధ్రువ్ జురెల్ లు ఇంగ్లాండ్ బౌల‌ర్ల‌కు ఎలాంటి అవ‌కాశం ఇవ్వలేదు. వీరిద్దరు అభేధ్య‌మైన ఆరో వికెట్‌కు 72 ప‌రుగులు జోడించి భార‌త్‌కు విజ‌యాన్ని అందించారు. 



జురెల్‌పై ప్రశంసల జల్లు
టీమ్‌ఇండియా మెరుగైన స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించిన జురెల్‌పై మాజీ క్రికెటర్‌ సునీల్‌ గవాస్కర్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. జురెల్‌ను చూస్తుంటే మరో ధోనీలా కనిపిస్తున్నాడని కొనియాడాడు. ఇదే ఆటతీరును కొనసాగిస్తే మెరుగైన భవిష్యత్తు ఉంటుందని జోస్యం చెప్పాడు. ధ్రువ్‌ జురెల్‌ ఏకాగ్రతలో మరో ధోనీని తలపిస్తున్నాడని గవాస్కర్‌ అన్నాడు. శతకం చేజారినాఉం ఇదే ఏకాగ్రతతో ఆడితే అతడు చాలా సెంచరీలు చేస్తాడని గవాస్కర్‌ అన్నాడు.