Harmanpreet Kaur:


ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌ ముందు టీమ్‌ఇండియాకు బిగ్‌షాక్‌! కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ అనారోగ్యానికి గురైంది సమాచారం. ఆమెతో పాటు పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ పూజా వస్త్రాకర్‌ దూరమవుతోందని తెలిసింది. వీరిద్దరూ లేకుంటే భీకరమైన ఆసీస్‌పై గెలవడం భారత్‌కు అంత సులభం కాదు.


భారత్‌, ఆస్ట్రేలియా గురువారం సెమీస్‌లో తలపడుతున్నాయి. సాయంత్రం 6:30 గంటలకు మ్యాచ్‌ మొదలవుతుంది. కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్‌ ఇందుకు వేదిక. ఈ ప్రతిష్ఠాత్మక పోరులో హర్మన్‌ ప్రీత్‌ ఆడటం లేదని సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. ఒకవేళ ఆమె అందుబాటులో లేకుండా వైస్‌ కెప్టెన్ స్మృతి మంధానపై నాయకత్వ భారం పడుతుంది. ఇక ఆల్‌రౌండర్‌ పూజా వస్త్రాకర్‌ శ్వాసనాళ ఇన్ఫెక్షన్‌తో ఇబ్బంది పడుతోంది. రాధా యాదవ్‌ సైతం గాయాలతో సతమతం అవుతోందని తెలిసింది. అందుకే ఆమె ఐర్లాండ్‌ మ్యాచ్‌కు దూరమైంది. 


గ్రూప్‌ దశలో భారత్‌ అదరగొట్టింది. కేవలం ఒకే ఒక్క మ్యాచ్‌ ఓడిపోయింది. పాకిస్థాన్‌, వెస్టిండీస్‌, ఐర్లాండ్‌ను చిత్తుగా ఓడించింది. అయితే ఇంగ్లాండ్‌ చేతిలో ఓటమి చవిచూసింది. 'పూజా వస్త్రాకర్‌ స్థానంలో స్నేహ్ రాణాను తీసుకొనేందుకు ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌ టెక్నికల్‌ కమిటీ అనుమతి ఇచ్చింది' అని ఐసీసీ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. 


భీకరమైన ఆసీస్‌


ప్రపంచ మహిళల క్రికెట్లోనే ఆస్ట్రేలియా బలమైన జట్టు. గత 6 ప్రపంచకప్పుల్లో 5 గెలుచుకుందంటే ఆసీస్ జట్టు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గత రికార్డులు, ప్రదర్శన, చరిత్ర ఏది చూసుకున్నా ఆస్ట్రేలియా జట్టు ఫేవరెట్ అనడంలో సందేహంలేదు. మరోవైపు ఈ మెగా టోర్నీలో భారత్ సెమీస్ గండాన్ని ఎదుర్కొంటోంది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్ ఐదో సారి సెమీఫైనల్ కు చేరుకుంది. అయితే 2020లో తప్ప ఒక్కసారి కూడా ఫైనల్ కు వెళ్లలేదు. 2020లోనూ ఇంగ్లాండ్ తో సెమీస్ వర్షం కారణంగా రద్దవటంతో గ్రూపులో అగ్రస్థానం కారణంగా తుదిపోరుకు అర్హత సాధించింది. ఈ వరల్డ్ కప్ లో గ్రూప్ దశలో అన్ని మ్యాచులు గెలిచిన ఆస్ట్రేలియా జట్టు అగ్రస్థానంతో నాకౌట్ కు చేరుకుంది. అయితే భారత్ మాత్రం తడబడుతూనే సెమీస్ కు వచ్చింది. గ్రూప్ దశలో ఇంగ్లండ్ తో ఓడిన భారత్.. మిగిలిన మ్యాచుల్లో విజయం సాధించి రెండో స్థానంలో నిలిచింది. సెమీస్‌ గెలవాటంటే హర్మన్‌ కచ్చితంగా ఆడాల్సిందే.


మ్యాచ్‌కు ముందు హర్మన్‌


'ఈ విజయం మాకు చాలా ముఖ్యం. సెమీస్ కు చేరుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మాకు అవకాశం వచ్చినప్పుడల్లా బాగా ఆడడానికి ప్రయత్నిస్తాం. సెమీ ఫైనల్స్ లో మేం మా బెస్ట్ ఇస్తాం. 100 శాతం కష్టపడతాం. ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్ లను మేం ఎప్పుడూ ఆస్వాదిస్తాం. ఇది డూ ఆర్ డై మ్యాచ్ లాంటింది. అందుకే మేం మంచి క్రికెట్ ఆడాలనుకుంటున్నాం' అని హర్మన్ చెప్పారు.