Team India captaincy Race : టీమిండియా హెడ్‌ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించాడో లేదో గౌతం గంభీర్‌(Gautam Gambhir) తన పనిని మొదలు పెట్టేశాడు. ఇప్పటి వరకూ టీమిండియా టీ 20 కెప్టెన్‌గా హార్దిక్‌ పాండ్యా(Hardik Pandya) పేరు చాలా బలంగా వినిపించింది. టీ 20 క్రికెట్ ప్రపంచకప్‌లో సత్తా చాటడంతో ఇక హార్దిక్‌ పొట్టి క్రికెట్‌లో భారత జట్టును నడిపించడం ఖాయమని కూడా అందరూ భావించారు. రోహిత్‌(Rohit) టీ 20 క్రికెట్‌కు వీడ్కోలు పలకడం... ఇప్పటికే సారథిగా అనుభవం ఉండడంతో హార్దిక్‌ ఇక కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరిస్తాడనే అనుకున్నారు. ఇక్కడే గంభీర్‌ తన మార్క్‌ చూపించాడు. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా టి 20 సిరీసుల్లో భారత్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన సూర్యకుమార్‌ యాదవ్‌(Surya Kumar Yadav)కు సారథ్య బాధ్యతలు అప్పగించాలని చూస్తున్నారు. క్రికెట్‌ వర్గాలను ఈ నిర్ణయం ఒక్కసారిగా షాక్‌గు గురిచేసింది. ఇప్పటివరకూ అందరూ పాండ్యా వైపే చూస్తుండగా తాజాగా ఇప్పుడు స్కై పేరే బలంగా వినిపిస్తోంది.

 

టీమిండియాలో కెప్టెన్ పోరు

మూడు టీ 20లు, వన్డే మ్యాచ్‌ల సిరీస్‌ ఆడేందుకు భారత క్రికెట్ జట్టు ఈ నెల చివర్లో శ్రీలంకకు వెళ్లనుంది. అయితే శ్రీలంక సిరీస్ కోసం భారత జట్టు ప్రకటనపై ఎక్కడ లేని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు క్రికెట్‌ అభిమానులు. టీ 20 కెప్టెన్సీ కోసం సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా పోటీ పడుతుండగా... వన్డే సారథ్య బాధ్యతల కోసం కేఎల్ రాహుల్(Kl Rahul), శుభ్‌మన్ గిల్(Gill) మధ్య పోరు నడుస్తోంది. శ్రీలంక సిరీస్‌కు టీ20 కెప్టెన్సీ బాధ్యతలు హార్దిక్ పాండ్యాకు ఇస్తారని ఇప్పటివరకూ అంతా భావించారు. అయితే ఇప్పుడు స్కై పేరు వినిపిస్తోంది. ముంబై ఇండియన్స్ సారథి పాండ్యా, కీలక ఆటగాడు సూర్య మధ్య పోరు నడుస్తోంది. కొత్త ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ 2026 టీ 20 ప్రపంచ కప్‌ కోసం జట్టును తయారు చేసే పని ప్రారంభించాడని ఆ క్రమంలోనే జట్టులో మార్పులకు శ్రీకారం చుట్టాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. T20 ప్రపంచ కప్ కోసం పటిష్ట టీమ్‌ను రూపొందించడం కోసం సారథి ఎంపికపై దృష్టి సారించాడు. అందుకే లంక సిరీస్‌ కోసం జట్టు ప్రకటనకు సమయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. శ్రీలంక T20I సిరీస్‌కు ఇంకో 10 రోజులు మిగిలి ఉన్న నేపథ్యంలో సెలక్టర్లు ఈరోజు జట్టను ఖరారు చేసే అవకాశం ఉందని  బీసీసీఐ వర్గాలు నివేదించాయి. 


పంత్‌ ఉండడా..?

రోడ్డు ప్రమాదం నుంచి కోలుకుని వరుసగా మ్యాచ్‌లు ఆడుతున్న రిషబ్ పంత్‌కు లంకతో సిరీస్‌లో విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. పంత్‌ నాన్‌స్టాప్‌గా ఆడుతున్నాడని.. ఆ విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటే పంత్‌కు రెస్ట్‌ ఇచ్చే అవకాశం ఉంది. సెప్టెంబర్ 19న ప్రారంభం కానున్న బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్‌కు తాజాగా ఉంచేందుకు పంత్‌కు రెస్ట్ ఇచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. లంకతో టీ 20 సిరీస్‌కు సంజు శాంసన్, వన్డేలకు KL రాహుల్, సంజు శాంసన్‌లు కీపర్‌లుగా ఉండవచ్చు.