Sri Lanka player Angelo Mathews apologises to entire nation : టీ 20 ప్రపంచకప్‌ (T20 World Cup)లో లీగ్‌ దశలోనే వెనుదిరిగిన శ్రీలంక(Sri lanka) జట్టుపై ఇప్పుడు విమర్శల వర్షం కురుస్తోంది. కొన్నేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక వెలుగు వెలిగిన లంక.. ఇప్పుడు నానాటికి తీసికట్టుగా తయారైపోయింది. జయసూర్య, జయవర్దనే, సంగక్కర, దిల్షాన్‌, చమిందా వాస్‌, మురళీధరన్‌, మలింగ వంటి దిగ్గజ ఆటగాళ్లను క్రికెట్‌కు అందించిన లంక క్రికెట్‌ బోర్డు ఇప్పుడు మ్యాచు విన్నర్లు లేక వెలవెలబోతోంది. ఉన్న స్టార్‌ ఆటగాళ్లు కూడా ఎప్పుడోసారి తప్ప మెరవడం లేదు. దీంతో శ్రీలంక పసికూన కంటే దిగవుకు పడిపోయింది. ఈ టీ 20 ప్రపంచకప్‌లోనూ అదే కొనసాగింది.

ఏ ఆశలు లేకుండా బరిలోకి దిగిన లంక అనుకున్నట్లుగానే ఎలాంటి అద్భుతాలు లేకుండానే టీ 20 ప్రపంచకప్‌ నుంచి లీగ్‌ దశలోనే వెనుదిరిగింది. అభిమానుల ఆశలను నెరవేర్చలేక లంక క్రికెటర్లు రిక్తహస్తాలతో మళ్లీ స్వదేశానికి పయనమయ్యారు. ఈ ప్రదర్శన అభిమానుల గుండెలను గాయపరిచింది. ఇదేం ప్రదర్శనంటూ క్రికెట్‌ ప్రపంచం కూడా ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విమర్శల నేపథ్యంలో లంక క్రికెటర్లు స్పందించారు. క్షమించండి అంటూ ప్రకటన విడుదల చేశారు..




 

టీ 20 ప్రపంచకప్‌లో ఇలా...

టీ 20 ప్రపంచకప్‌లో శ్రీలంక ఇప్పటి వరకూ మూడు మ్యాచులు ఆడింది. ఇందులో ఒక మ్యాచ్‌ వర్షం వల్ల రద్దైంది. మిగిలిన రెండు మ్యాచులు లంక ఓడిపోయింది. తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా(SA) చేతిలో... రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ (BANGlADESH)చేతిలో లంక కుదేలైంది. ఇక నేపాల్‌తో జరగాల్సిన మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైంది. దీంతో మూడు మ్యాచుల్లో ఒకే పాయింట్‌ లభించడంతో శ్రీలంక ఈ మెగా టోర్నీ నుంచి నిష్క్రమించింది.

దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో లంక కేవలం 77 పరుగులకే కుప్పకూలడం ఆ దేశ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. ఆ మ్యాచ్‌లో ఏ శ్రీలంక బ్యాటర్‌ కనీసం 20 పరుగుల మార్క్‌ను అయినా దాటలేక పోయారు. 9 మంది బ్యాటర్లు సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఇక బంగ్లాతో జరిగిన మ్యాచ్‌లోనూ 124 పరుగులే చేసిన లంక కాస్త పోరాడింది. కానీ బంగ్లా పోరాటం ముందు అది సరిపోలేదు. మరో ఓవర్‌ మిగిలి ఉండగానే బంగ్లా విజయాన్ని సాధించి లంకకు షాక్‌ ఇచ్చింది. బద్ద శత్రువుగా భావించే బంగ్లా చేతిలో లంక ఓటమిని ఆ దేశ అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. ఇక నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌ మాత్రం రద్దైంది.

 

క్షమించండి

మాజీ ఛాంపియన్‌లు అయిన శ్రీలంక ఈ T20 ప్రపంచ కప్‌లో మొదటి రౌండ్‌లో వెనుదిరిగడంపై ఆ జట్టు దేశ అభిమానులకు క్షమాపణ చెప్పింది. తాము దేశ మొత్తాన్ని నిరాశపరిచామని శ్రీలంక స్టార్ ఆల్‌రౌండర్‌ ఏంజెలో మాథ్యూస్(Angelo Mathews) అంగీకరించాడు. 2014లో ఛాంపియన్‌గా నిలిచిన తాము ఈ టీ 20 ప్రపంచకప్‌లో లీగ్‌ దశ దాటకపోవడం తమను తీవ్రంగా నిరాశపరిచిందని తెలిపాడు. దేశ ప్రజలందరూ తమను క్షమించాలని కూడా మాథ్యూస్ కోరాడు. ఈ ప్రదర్శనను తాము ఊహించలేదని... తాము చాలా సవాళ్లను ఎదుర్కొన్నామని... ఎన్ని ఎదుర్కొన్నా రెండో రౌండ్‌కు చేరుకోకపోవడం మాత్రం దురదృష్టకరమని మ్యాథ్యూస్‌ అన్నాడు. ఈ మెగా టోర్నమెంట్‌లో తమకు మరో మ్యాచ్‌ మాత్రమే మిగిలి ఉందని అందులో గెలిచి ఈ ప్రపంచకప్‌నకు వీడ్కోలు పలుకుతామని అన్నాడు.