Yashasvi Jaiswal : వైజాగ్‌ (Visakhapatnam)వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో యశస్వి జైస్వాల్‌ (Yashasvi Jaiswal)అద్భుత ఆటతీరుతో అపద్భాందువుడి పాత్ర పోషించాడు. అవతలి బ్యాటర్లు అర్థ శతకం చేసేందుకే కష్టాలు పడుతున్న వేళ... అజేయ శతకంతో టీమిండియా(Team India)ను భారీ స్కోరు దిశగా తీసుకెళ్లాడు. యశస్వి జైస్వాల్‌ భారీ శతకంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా ఆరు వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్‌ ఒంటరి పోరాటం చేశాడు. 257 బంతులు ఎదుర్కొన్న జైస్వాల్... 17 ఫోర్లు, 5 సిక్సులతో 179 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. జైస్వాల్‌కు తోడుగా అశ్విన్‌ అయిదు పరుగులతో క్రీజులో ఉన్నాడు. యశస్వి మినహా మరే భారత బ్యాటర్‌ పెద్దగా రాణించలేదు. మిగిలిన భారత బ్యాటర్లలో ఏ ఒక్కరూ కనీసం అర్ధ శతకం కూడా సాధించలేక పోయారు. ఈ మ్యాచ్‌లో సిక్సర్‌తో సెంచరీ మార్క్‌ అందుకున్న జైస్వాల్‌ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
 
యశస్వి పేరిట అరుదైన రికార్డు
ఈ మ్యాచ్‌లో సిక్సర్‌ కొట్టి సెంచరీ పూర్తి చేసిన జైస్వాల్‌.. భారత్‌ తరఫున టెస్ట్‌ల్లో సిక్సర్‌తో సెంచరీ మార్కును అందుకున్న 16వ ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. సిక్సర్‌తో సెంచరీ మార్కును తొలుత పాలీ ఉమ్రిగర్‌ అందుకోగా.. అత్యధిక సార్లు ఈ ఘనతను సాధించిన బ్యాటర్‌గా క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ టెండూల్కర్‌ (Sachin)ఉన్నాడు. సచిన్‌ ఏకంగా ఆరు సార్లు సిక్సర్‌తో సెంచరీ మార్కును అందుకున్నాడు. సచిన్‌ తర్వాత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మూడు సార్లు ఇలా సెంచరీ మార్కును తాకాడు. మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌, కేఎల్‌ రాహుల్‌, రిషబ్‌ పంత్‌ తలో రెండు సార్లు సిక్సర్‌ కొట్టి సెంచరీ పూర్తి చేశారు. హర్భజన్‌ సింగ్‌, అశ్విన్‌ కూడా సిక్సర్‌తో సెంచరీ పూర్తి చేశారు. వీరిద్దరూ తలో సారి ఇలా సెంచరీ మార్కును అందుకున్నారు. కపిల్‌ దేవ్‌, మొహమ్మద్‌ అజారుద్దీన్‌, రాహల్‌ ద్రవిడ్‌, వీరేంద్ర సెహ్వాగ్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌, ఎంఎస్‌ ధోని, పుజారా ఉన్నారు. సిక్సర్‌తో సెంచరీ మార్కును ఓసారి తాకిన సెహ్వాగ్‌.. డబుల్‌ సెంచరీ, ట్రిపుల్‌ సెంచరీ మార్కును కూడా సిక్సర్‌తో చేరుకుని చరిత్రపుటల్లోకెక్కాడు.
 
తొలిరోజు ఆటంతా జైస్వాల్‌దే...
టీమిండియా యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ అరుదైన ఘనత సాధించాడు. అద్భుతమైన ఆట తీరుతో దిగ్గజ ఆటగాళ్ల సరసన నిలిచాడు. ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో సెంచరీతో స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. 149 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న జైస్వాల్‌... సొంతగడ్డపై తొలి శతకం నమోదు చేశాడు. ఈ క్రమంలో అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. 22 ఏళ్ల లెయశస్వి జైస్వాల్‌ అరుదైన జాబితాలో చోటు సంపాదించాడు. 23 ఏళ్ల వయసు కంటే ముందే విదేశీ, స్వదేశీ గడ్డపై టెస్టు సెంచరీ సాధించిన భారత నాలుగో క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. యశస్వి కంటే ముందు రవిశాస్త్రి, సచిన్‌ టెండుల్కర్‌, వినోద్‌ కాంబ్లి ఈ ఘనత సాధించారు. యశస్వితో సహా వీళ్లంతా రంజీ ట్రోఫీలో ముంబై జట్టుకే ఆడటం విశేషం. గమనార్హం. టీమిండియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా ఆరు వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది.  257 బంతులు ఎదుర్కొన్న జైస్వాల్... 17 ఫోర్లు, 5 సిక్సులతో 179 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. ఇంగ్లాండ్‌ బౌలర్లలో బషీర్‌ 2, అహ్మద్‌ 2, అండర్సన్‌ 1, హార్ట్‌లీ ఒక్క వికెట్‌ తీశారు.