Kohli set to miss Rajkot and Ranchi Tests: గాయాలతో సతమతమవుతున్న టీమిండియా(Team India)కు పెద్ద షాక్‌ తగిలింది. మూడో టెస్ట్ నుంచి విరాట్‌ కోహ్లీ(Virat Kohli) జట్టులోకి వస్తాడనుకుంటున్న వేళ... విరాట్‌ అందుబాటులో ఉండడన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. ఇంగ్లండ్‌తో మిగిలిన మూడు టెస్టు మ్యాచ్‌లకు కోహ్లీ అందుబాటులో ఉండే అవకాశాలు కనిపించడం లేదు. వ్యక్తిగత కారణాలతో ఇప్పటికే తొలి రెండు టెస్టులకు దూరమైన కోహ్లీ ఈ నెల 15నుంచి రాజ్‌కోట్‌లో మొదలయ్యే మూడో టెస్టుతో పాటు రాంచీలో జరిగే నాలుగో టెస్టుకు జట్టులోకి వచ్చే అవకాశాలు లేనట్లు వార్తలు వస్తున్నాయి. భారత్, ఇంగ్లండ్‌ మధ్య మూడో టెస్టు ఈనెల 15 నుంచి 19 వరకు రాజ్‌కోట్‌లో, నాలుగో టెస్టు ఈనెల 23 నుంచి 27 వరకు రాంచీలో జరగనున్నాయి. ధర్మశాలలో మార్చి 7నుంచి మొదలయ్యే ఆఖరి టెస్టుకైనా కోహ్లీ అందుబాటులో ఉంటాడా అన్నది అనుమానంగా మారింది. జట్టుకు ఎప్పుడు అందుబాటులో ఉంటాననే విషయంపై కోహ్లి బీసీసీఐకి ఇంకా సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది. విరాట్‌ ప్రస్తుతం లండన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. 


అదే కారణమా..?
 టీమ్ఇండియా(Team India) స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) మరోసారి తండ్రి కాబోతున్నాడు. కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలనే ఇంగ్లాండ్‌తో తొలి రెండు టెస్టులకు కోహ్లీ దూరంగా ఉన్నాడట. ఈ విషయాన్ని కోహ్లీ ఫ్రెండ్, దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్‌ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. తాజాగా యూట్యూబ్ లైవ్‌లో ఏబీ డివిలియర్స్‌ అభిమానులతో ముచ్చటించాడు. విరాట్ కోహ్లీతో మాట్లాడారా? అతను బాగున్నారా? అని ఓ అభిమాని ఆయన్ని అడిగాడు. ‘‘ఇటీవల అతడితో చాటింగ్ చేశా. ఎలా ఉన్నావు అని అడిగా. క్షేమంగా ఉన్నానని చెప్పాడు. అతను తన కుటుంబంతో కొంత సమయం గడుపుతున్నాడు. అందుకే ఇంగ్లాండ్‌తో మొదటి రెండు టెస్ట్ మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడని అనుకుంటున్నా. కోహ్లీ రెండో బిడ్డ ఈ ప్రపంచంలోకి రాబోతున్న మాట వాస్తవమే. ఇప్పుడు అతడు తన కుటుంబంతో ఉండటం ముఖ్యం. విరాట్ తన ఫ్యామిలీకే ప్రాధాన్యత ఇస్తున్నాడని చాలా మంది భావిస్తుండొచ్చు. కానీ, అది తప్పు. కోహ్లీని మేం కూడా మిస్‌ అవుతున్నాం. అతడు కచ్చితంగా సరైన నిర్ణయం తీసుకున్నాడని డివిలియర్స్‌ అన్నాడు. 2017లో అనుష్క శర్మ-విరాట్ కోహ్లీ వివాహబంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. 2021లో వీరికి వామిక జన్మించింది. కోహ్లీ తల్లి అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఇంగ్లాండ్‌తో రెండు టెస్టులకు దూరంగా ఉన్నాడని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. వాటిని కోహ్లీ సోదరుడు వికాస్‌ కొట్టిపారేశాడు. తమ తల్లి ఆరోగ్యంగానే ఉందని ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించాడు. ఇక, ఇంగ్లాండ్‌తో చివరి మూడు టెస్టులకు త్వరలోనే భారత జట్టును ఎంపిక చేయనున్నారు. ఆ మ్యాచ్‌లకు కోహ్లీ అందుబాటులో ఉంటాడా? లేదా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు.


అనుమానమేనా....?
తొలి టెస్ట్‌ సందర్భంగా గాయపడిన  రవీంద్ర జడేజా మూడో టెస్ట్‌కు కూడా దూరం కానున్నాడని తెలుస్తోంది. జడ్డూ గాయం చాలా తీవ్రమైందని, దాని నుంచి పూర్తిగా కోలుకునేందుకు కనీసం నాలుగు నుంచి ఎనిమిది వారాల సమయం పడుతుందన్న వార్తలు వస్తున్నాయి. జడ్డూ ఒకవేళ రాంచీలో జరిగే నాలుగో టెస్ట్‌ సమయానికి కోలుకుంటే అది అద్భుతమే అని తెలుస్తోంది.