Umpire Marias Erasmus Admits Massive Error in 2019 ODI World Cup Final - 1975 నుంచి ఇప్పటివరకు 13 వన్డే ప్రపంచ కప్ ఫైనల్స్ జరిగాయి. 1983 కపిల్ డెవిల్స్ విరోచిత పోరాటం చూశాం. 2011లో ఎంఎస్ ధోనీ సిక్స్ చూశాం. కానీ అత్యంత వివాదాస్పద ఫైనల్ అంటే కచ్చితంగా... ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య జరిగిన 2019 ఫైనలే. ముందు నిర్ణీత 50 ఓవర్లు ముగిసి మ్యాచ్ టై అవడం, ఆ తర్వాత జరిగిన సూపర్ ఓవర్ కూడా టై అవడం, బౌండరీల కౌంట్ ద్వారా విజేతను నిర్ణయించడం... ఇదంతా పెద్ద కాంట్రవర్సీకి దారితీశాయి. అయితే ఇంగ్లండ్ ఛేజింగ్ ఆఖరి ఓవర్ లో... ఆన్ ఫీల్డ్ అంపైర్లు మారియస్ ఎరాస్మస్, కుమార్ ధర్మసేన పెద్ద తప్పు చేశారంట. ఆ విషయాన్ని లేట్ గా రియలైజ్ అయ్యామని, ఇప్పుడు స్వయంగా అంపైర్ ఎరాస్మసే ఒప్పుకున్నాడు. 




Photo Credit: espncricinfo
ఛేజింగ్‌లో చివరి ఓవర్లో జరిగిన ఘోర తప్పిదం ఇదే
ఛేజింగ్‌లో ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్. ఇంగ్లండ్ కు మూడు బాల్స్ లో 9 పరుగులు కావాలి. ట్రెంట్ బౌల్ట్ వేసిన ఫుల్ టాస్ ను... బెన్ స్టోక్స్ మిడ్ వికెట్ వైపు స్లాగ్ చేశాడు. బ్యాటర్లు రెండు రన్స్ కు ప్రయత్నించారు. గప్టిల్ బాల్ అందుకుని త్రో చేశాడు. ఆ త్రో... డైవ్ చేస్తున్న ఇంగ్లాండ్ బ్యాటర్ స్టోక్స్ బ్యాట్ కు తగిలి డీవియేట్ అయి ఫోర్ కు వెళ్లిపోయింది. స్టోక్స్ తన తప్పేమీ లేదన్నట్టు వెంటనే చేతులు గాల్లోకి లేపాడు. కానీ రూల్స్ ప్రకారం... అవి ఓవర్ త్రోసే. 2 ప్లస్ 4 అంపైర్లు మొత్తం ఆరు రన్స్ ఇచ్చారు. ఈ విషయంలోనే ఆన్ ఫీల్డ్ అంపైర్లు ఇద్దరూ పెద్ద తప్పు చేశారు. ఓ జట్టుకు వన్డే ప్రపంచ కప్‌ను దూరం చేశారని చెప్పవచ్చు.


రూల్స్ ప్రకారం జరగాల్సింది ఇదీ..
ఎంసీసీ రూల్ బుక్ లోని 19.8 లా ప్రకారం.... ఓవర్ త్రో విషయంలో ఎలా వ్యవహరించాలో క్లియర్ గా రాసి ఉంది. ఫీల్డర్ బాల్ త్రో చేసే సమయానికి బ్యాటర్లు ఇద్దరూ ఒకర్నొకరు క్రాస్ చేసి ఉండాలి. అలా అయితేనే ఆ రన్ ను కౌంట్ చేయాలన్నమాట. కానీ ఈ ఇన్సిడెంట్ లో ఏం జరిగిందంటే..... గప్తిల్ బాల్ విసిరే సమయానికి స్టోక్స్, రషీద్ ఒకర్నొకరు క్రాస్ అవలేదు. కానీ అంపైర్లు దాన్ని సరిగ్గా గమనించలేదు. క్రాస్ అయ్యారనుకుని 2 ప్లస్ 4 ఆరు రన్స్ ఇచ్చారు. కానీ క్రాస్ అవలేదు కాబట్టి ఇవ్వాల్సింది 1 ప్లస్ 4 ఐదు రన్స్ మాత్రమే. ఈ ఒక్క రన్నే ఇవ్వకుండా ఉండుంటే అసలు మ్యాచ్ సూపర్ ఓవర్ దాకా వచ్చేది కాదేమో. కప్ న్యూజిలాండ్ గెలిచి ఉండేదేమో. 



ఇప్పుడు ఓ ఇంగ్లీష్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన 2019 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ అంపైర్ మేరియస్ ఎరాస్మస్.... తర్వాతి రోజు హోటల్ లో కుమార ర్మసేన, తాను ఎదురుపడ్డామని, చాలా పెద్ద తప్పు చేశామని గుర్తించావా అని కుమార ధర్మసేన తనను అడిగాడని ఎరాస్మస్ చెప్పుకొచ్చాడు. ఆ సమయంలో సిక్స్ రన్స్ ఇచ్చామని, కానీ వారిద్దరూ క్రాస్ కాలేదన్న విషయం తాము గుర్తించలేదని ఎరాస్మస్ చెప్పాడు. చూడటానికి చిన్న విషయంగానే కనిపించినా, ఇంతపెద్ద భారీ తప్పిదమే న్యూజిలాండ్ కు ప్రపంచకప్ ను దూరం చేసింది. మరోవైపు ఇంగ్లాండ్ జట్టు తొలిసారి వన్డే వరల్డ్ కప్‌ కైవసం చేసుకుంది.