ఐసీసీ(ICC) తాజాగా ప్రకటించిన టీ 20 ర్యాంకింగ్స్‌( T20I Ranking)లో భారత ఆటగాళ్లు అదరగొట్టారు. నిలకడగా రాణిస్తున్న టీమ్‌ఇండియా(Team India) యువ ఆటగాళ్లు అక్షర్‌ పటేల్‌, యశస్వి జైస్వాల్‌ తొలిసారి ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌ టాప్‌-10లో చోటు దక్కించుకున్నారు. తాజాగా ఐసీసీ ప్రక‌టించిన టీ20 ర్యాంకింగ్స్‌లో ఓపెన‌ర్ య‌శ‌స్వి జైస్వాల్ ఏడు స్థానాలు మెరుగుప‌ర‌చుకోగా, అక్షర్ ప‌టేల్ 12, శివ‌మ్ దూబె ఏకంగా 207 స్థానాలు పైకి ఎగ‌బాకాడు.
 
బౌలింగ్‌లో అక్షర్‌ పటేల్‌ కెరీర్‌లో అత్యుత్తమంగా ఐదో ర్యాంక్ దక్కించుకోగా.. బ్యాటింగ్‌లో ఓపెనర్‌ జైస్వాల్‌ ఆరో స్థానంలో  నిలిచాడు. శివ‌మ్ దూబె 265వ స్థానం నుంచి 58వ స్థానానికి చేరుకున్నాడు. గాయం కార‌ణంగా అఫ్గాన్ సిరీస్‌కు దూర‌మైన‌ప్పటికీ టీమ్ఇండియా స్టార్ బ్యాట‌ర్ సూర్య‌కుమార్ యాద‌వ్ త‌న అగ్రస్థానాన్ని కాపాడుకున్నాడు. ఇంగ్లాండ్‌కు చెందిన ఫిల్ సాల్ట్ రెండ‌వ స్థానంలో కొన‌సాగుతున్నాడు. 
 
టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌
1 సూర్యకుమార్ యాదవ్- 869 రేటింగ్ పాయింట్లు
2. ఫిల్ సాల్ట్ (ఇంగ్లాండ్‌) – 802
3. మ‌హ్మద్‌ రిజ్వాన్ (పాకిస్తాన్‌) – 775
4. బాబర్ ఆజం (పాకిస్తాన్‌) – 763
5. ఐడెన్ మార్క్రామ్ (ద‌క్షిణాప్రికా) – 755
6. యశస్వి జైస్వాల్ (భార‌త్‌)- 739
7. రిలే రాస్ (ద‌క్షిణాఫ్రికా) – 689
8. జోస్‌ బట్లర్ (ఇంగ్లాండ్‌) – 680
9. రుతురాజ్ గైక్వాడ్ (భార‌త్‌) – 661
10. రిజా హెండ్రిక్స్ (ద‌క్షిణాఫ్రికా) – 660
 
బౌలింగ్‌లో అక్షర్‌ పటేల్‌ 667 రేటింగ్‌ పాయింట్లతో అయిదో స్థానంలో నిలవగా.. మరో స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌ 666 రేటింగ్‌ పాయింట్లతో ఆరో ర్యాంక్‌ దక్కించుకున్నాడు.  తొలి స్థానంలో ఇంగ్లాండ్‌ స్పిన్నర్‌ అదిల్‌ రషీద్‌ ఉండగా.. తర్వాతి స్థానంలో వెస్టిండీస్‌ స్పిన్నర్‌ అకేల్‌ హోసిన్‌ ఉన్నాడు. 
టీ20ల్లో టాప్ 10 బౌలింగ్ ర్యాంకింగ్స్..
1. ఆదిల్ రషీద్ (ఇంగ్లండ్‌) – 726
2. అకేల్ హోసిన్ (వెస్టిండీస్‌)- 683
3. వనిందు హసరంగా (శ్రీలంక‌)- 680
3. మహేశ్ తీక్షణ (శ్రీలంక‌)- 680
5. అక్షర్ పటేల్ (భార‌త్‌)- 667
6. రవి బిష్ణోయ్ (భార‌త్‌)- 666
7. రషీద్ ఖాన్ (అఫ్గానిస్తాన్‌)- 658
8. తబ్రైజ్ షమ్సీ (ద‌క్షిణాప్రికా)- 654
9. ఫజల్హక్ ఫరూకీ (అఫ్గానిస్తాన్‌)- 645
10. రీస్ టాప్లీ (ఇంగ్లాండ్‌) – 643
 
భారత జట్టు కొత్త చరిత్ర 
టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు కొత్త చరిత్ర సృష్టించింది. బెంగళూరు వేదికగా జరిగిన మూడో టీ20లో అఫ్గాన్‌ను మట్టికరిపించి... టీ20 చరిత్రలో అత్యధిక వైట్‌వాష్‌లు చేసిన జట్టుగా భారత్‌ అవతరించింది. ఇప్పటివరకూ టీ20 చరిత్రలో ద్వైపాక్షిక సిరీస్‌ల్లో ఎనిమిది సార్లు వైట్‌వాష్‌లు చేసిన జట్లుగా భారత్‌, పాకిస్థాన్‌ సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి. కానీ అఫ్గాన్‌తో మూడో టీ20లో సూపర్‌ ఓవర్‌లో విజయం సాధించిన టీమిండియా.. 9 క్లీన్‌స్వీప్‌లతో ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా టీమ్‌ఇండియా అవతరించింది.