BCCI 10 Points Rule: ఆటగాళ్లను కట్టడి చేసేందుకు ఇటీవల పది పాయింట్ల మార్గదర్శకాలను బీసీసీఐ అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్ లో దీన్ని అమలు చేసింది. క్రికెటర్లందరికీ ప్రయాణంలో ఒకే బస్సును వినియోగించాలని క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) కు ఆదేశాలు జారీ చేసింది. దీంతోపాటు ప్లేయర్లెవరికీ ప్రత్యేక వాహనాలు సమకూర్చరాదని చెప్పింది. దీనిని క్యాబ్ ప్రెసిడెంట్ స్నేహశీశ్ గంగూలి ధ్రువీకరించాడు. ఆటగాళ్లందరికీ హోటల్ నుంచి గ్రౌండ్ కు వచ్చేందుకు గాను ఒకే బస్సును అరెంజ్ చేశామని తెలిపాడు. అలాగే ప్రాక్టీస్ సెషన్ అయ్యేంతవరకు జట్టు సభ్యులంతా ఒకే చోట ఉండాలని కూడా ఆదేశాలు జారీ చేసినట్లు వివరించాడు. మరోవైపు గ్రౌండ్ కు వచ్చిన భారత జట్టంతా ఒకే బస్సులో రావడం విశేషం. తొలుత హెడ్ కోచ్ గౌతం గంభీర్, సహాయక కోచ్ లు, ఆ తర్వాత కెప్టెన్ సూర్యకుమర్ యాదవ్ తోపాటు ఇతర ఆటగాళ్లు బస్సులో నుంచి బయటకు వచ్చారు. 


మేనేజర్ కు నో ఎంట్రీ..
భారత ప్రధాన కోచ్ గౌతం గంభీర్ మేనేజర్ గౌరవ్ కు టీమ్ బస్సుతోపాటు ప్రయాణించడానికి అవకాశమివ్వలేదని తెలుస్తోంది. అలాగే టీమ్ బస చేసిన చోట కాకుండా వేరే హోటల్లో అతనికి బస కల్పించినట్లు సమాచారం. గతేడాది నుంచి టెస్టుల్లో ఘోర ప్రదర్శన చేస్తున్న టీమిండియాను గాడిలో పెట్టేందుకు బీసీసీఐ కఠిన చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. పది పాయింట్ల గైడ్ లైన్లలో భాగంగా చాలా నిబంధనలు రూపొందించింది. ప్రస్తుత ఇంగ్లాండ్ తో టీ20 సిరీస్ లో భాగంగా ఒక్కొక్క నిబంధనను అమలు చేస్తూ వస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే అంతా కలిసి ఒకే బస్సులో ప్రయాణించడం, ప్రాక్టీస్ సెషన్ ముగిసేవరకు టీమంతా కలిసి ఉండటం వంటివి ఉదాహరణలుగా చెప్పవచ్చు. 


దశలవారిగా..
ఒక్కో నిబంధనను దశలవారిగా అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే డొమెస్టిక్ క్రికెట్లో ఆటగాళ్లు పాల్గొంటున్నారు. అలాగే విదేశాలకు టూర్లకు వెళ్లినప్పుడు తమ ఫ్యామిలీలతో గడిపే విషయంపై స్పష్టత వస్తుందని తెలుస్తోంది. ఇక పర్సనల్ అసిస్టెంట్లు, చెఫ్ లు, భద్రతా సిబ్బంది, మేనేజర్లు తదితర వారిని అనుమతించకుండా బీసీసీఐ ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇంగ్లాండ్ తో ఐదు టీ20ల సిరీస్ కోసం టీమిండియా సిద్ధమైంది. ఈనెల 22 నుంచి కోల్కతా లో ఈ సిరీస్ ప్రారంభమవుతుండగా, 25న చెన్నై, 28న రాజకోట్, 31న పుణే, ఫిబ్రవరి 2న ముంబైలో ఈ మ్యాచ్ లు జరుగుతాయి.



ఆ తర్వాత ఇదే జట్టుతో మూడు వన్డేల సిరీస్ ప్రారంభమవుతుంది. వచ్చేనెల 19 నుంచి ప్రారంభమయ్యే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి సన్నాహకంగా ఈ టోర్నీ ఉపయోగపడనుందని తెలుస్తోంది. దుబాయ్ భారత్ మ్యాచ్ల ను ఆడనుంది. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్, 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్, మార్చి 2న న్యూజిలాండ్ తో టీమిండియా తలపడనుంది. 


Also Read: Karun Nair Vs BCCI: అతడిని పక్కన పెట్టడం సబబే.. అప్పటి వరకు వేచి చూస్తే తనకు చాన్స్ వస్తుందని దిగ్గజ ప్లేయర్ సూచన