Rishabh Pant News: ఐపీఎల్ ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్ తమ నూతన సారథిని సోమవారం ప్రకటించనుంది. కెప్టెన్ ప్రకటనతో పాటు జట్టు నూతన జెర్సీని కూడా విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తామని టీమ్ మేనేజ్మెంట్ తెలిపింది. భారత వికెట్ కీపర్ రిషభ్ పంత్‌ను కెప్టెన్‌గా ప్రకటించనున్నారని తెలుస్తోంది. ఐపీఎల్ మెగా వేలంలో గతేడాది రూ.27 కోట్ల భారీ ధరకు పంత్‌ను లక్నో కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో లీగ్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా పంత్ రికార్డులకెక్కాడు. వేలంలో తొలుత సన్ రైజర్స్ హైదరాబాద్‌తో పోటీ పడిన లక్నో.. రైట్ టూ మ్యాచ్ కార్డును ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి ఎదుర్కొని మరీ పంత్‌ను కైవసం చేసుకుంది. ఈ కార్డును దీటుగా ఎదుర్కునేందుకు రూ.27 కోట్ల మొత్తాన్ని లక్నో ఆఫర్ చేసింది. దీంతో పంత్ లక్నో వశమయ్యాడు. 






రెండోజట్టుకు కెప్టెన్ గా పంత్..
ఐపీఎల్ చరిత్రలో పంత్ రెండో జట్టుకు నాయకత్వ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. 2016లో తొలిసారి ఢిల్లీ జట్టుకు ఎంపికైన పంత్.. గతేడాది వరకు ఆ టీమ్‌తోనే పనిచేశాడు. 2021 నుంచి 23 వరకు కెప్టెన్‌గా పని చేశాడు. అయితే డిసెంబర్ 2022లో గాయం కారణంగా 23 ఎడిషన్‌లో పగ్గాలు చేపట్టలేదు. గతేడాది కూడా ఢిల్లీకి నాయకత్వం వహించాడు. అయితే తన వర్తు తెలుసుకునేందుకు మెగా వేలంలోకి వెళ్లాలని పంత్ నిర్ణయించుకున్నాడు. అయితే అతడిని ఆపాలని ఢిల్లీ జట్టు కూడా మనస్ఫూర్తిగా ప్రయత్నించలేదని తెలుస్తోంది. దీంతో వేలంలోని వచ్చి, కళ్లు చెదిరే ధరను పంత్ దక్కించుకున్నాడు. ఈ కాంట్రాక్టు మూడేళ్ల పాటు అమల్లో ఉండనుంది. 


రెండుసార్లు ఫ్లే ఆఫ్స్‌కు..
మూడేళ్ల టోర్నీ చరిత్రలో లక్నో సూపర్ జెయింట్స్‌కు మంచి రికార్డే ఉంది. రెండుసార్లు ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టింది. అయితే ఫైనల్‌కు చేరుకోలేకపోయింది. మూడేళ్ల పాటు భారత క్రికెటర్ కేఎల్ రాహుల్ నాయకత్వం వహించాడు. అయితే గతేడాది మెగా వేలంలోకి వెళ్లడంతో నూతన కెప్టెన్ అన్వేషణలో పడింది. మెగావేలంలో అతడిని ఢిల్లీ కొనుగోలు చేయడం విశేషం. అంతకుముందు నికోలస్ పూరన్, మోసిన్ ఖాన్, రవి బిష్నోయ్, మయాంక్ యాదవ్, ఆయూష్ బదోనిలను రిటైన్ చేసుకుంది. వేలంలో పంత్‌తో పాటు డేవిడ్ మిల్లర్, మిషెల్ మార్ష్, ఐడెన్ మార్క్రమ్‌లను తీసుకుంది. తొలుత వీళ్లనే జట్టు సారథుల పోటీలో నిలబడతారని భావించినా, పంత్ వైపు యాజమాన్యం మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఇక ఈ జట్టుకు మెంటార్‌గా దిగ్గజ పేసర్ జహీర్ ఖాన్, ఆస్ట్రేలియాకు చెందిన జస్టిన్ లాంగర్ హెడ్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. 


Also Read: Kho-Kho World Cup: అమ్మాయిలు అదరగొట్టారు - ఖోఖో విశ్వవిజేతగా భారత్, ఫైనల్‌లో నేపాల్ చిత్తు