జింబాబ్వేతో జరిగిన మూడో వన్డేలోనూ విజయం సాధించి 3-0 తో సిరీస్ క్లీన్ స్వీప్ చేసింది టీమిండియా. చివరివరకు ఉత్కంఠ రేపిన ఆఖరి వన్డేలో భారత్ 13 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ శతకం చేయగా, వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ ఇషాన్ కిషన్ అర్ధశతకంతో రాణించాడు. ఈ వన్డేలో విజయం ద్వారా భారత్ అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకుంది. ఓ ప్రత్యర్థి జట్టుపై భారత్ అత్యధిక విజయాలు సాధించింది. నేటి వన్డే విజయం జింబాబ్వేపై వరుసగా 15వ గెలుపు.  


చివరగా 2010లో భారత్ ఓటమి..
జింబాబ్వేపై జరిగిన వరుస 15వ వన్డే విజయాన్ని భారత్ ఆస్వాదిస్తోంది. రెండో వన్డేలో గెలుపుతో ఆ జట్టుపై భారత్ వరుస విజయాల సంఖ్య 14కు చేరగా.. నేడు చివరిదైన మూడో వన్డేలోనూ టీమిండియా అదరగొట్టింది. భారత్ చివరగా 10 జూన్ 2010లో జింబాబ్వే చేతిలో ఓటమిపాలైంది. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా 23 వన్డేలాడిన భారత్ 18 మ్యాచ్‌లలో విజయకేతనం ఎగురవేసింది. ఈ వేదికగా అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా భారత్ నిలిచింది. 






జింబాబ్వే తరువాత బంగ్లాదేశ్..
భారత క్రికెట్ జట్టు అత్యధిక వరుస విజయాలు సాధించిన ప్రత్యర్థి జట్టు జింబాబ్వే. ఈ జట్టుపై గతంలో 12 వరుస వన్డేలలో విజయం సాధించగా.. తాజాగా జరిగిన సిరీస్‌లో 3 వన్డేల్లోనూ గెలిచి సిరీస్ క్లీన్ స్వీప్ చేసింది. ఆ తరువాత భారత్ వరుస వన్డే విజయాలు నమోదు చేసిన ప్రత్యర్థి బంగ్లాదేశ్. ఆ జట్టుపై 12 వరుస వన్డేలలో భారత్ జోరు కొనసాగించింది. 1988 నుంచి 2004 మధ్య కాలంలో పన్నెండు వన్డేలలో బంగ్లాదేశ్ జట్టుపై పలువురు కెప్టెన్ల హయాంలో భారత్ జోరు ప్రదర్శించింది. 1983 నుంచి 1993 మధ్య కాలంలో 9 వరుస వన్డే మ్యాచ్‌లలో జింబాబ్వేపై టీమిండియా విజయం సాధించింది. 


వన్డేల్లో టీమిండియా వరుస విజయాలు..
ప్రత్యర్థి  -  వరుస విజయాలు  - కాలం
జింబాబ్వే 15  2010 నుంచి నేటి వరకు
బంగ్లాదేశ్ 12  1988 నుంచి 2004 వరకు
న్యూజిలాండ్  11  1986 నుంచి 1988 వరకు
జింబాబ్వే      10  2002 నుంచి 2005 వరకు
జింబాబ్వే       9  1983 నుంచి 1993 వరకు


13 పరుగుల తేడాతో భారత్ విజయం..  
భారత్ మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసింది. ఇన్నింగ్స్ ను ఓపెనర్లు కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్ ప్రారంభించారు. వీరిద్దరూ తొలి వికెట్ కు 63 పరుగులు జోడించారు. 15వ ఓవర్లో బ్రాడ్ ఇవాన్స్ బౌలింగ్ లో రాహుల్ క్లీన్ బౌల్డయ్యాడు. ఆ తర్వాత శిఖర్ కు గిల్ జతకలిశాడు. ఇన్నింగ్స్ 21వ ఓవర్లో 84 పరుగుల వద్ద ధావన్ ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్ తో కలిసి గిల్ స్కోరు బోర్డును నడిపించాడు. 35వ ఓవర్లో గిల్ తన అర్ధశతకాన్నిపూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత వీరిద్దరూ శతక భాగస్వామ్యం నమోదు చేశారు. మరోవైపు కిషన్ 42వ ఓవర్లో సింగిల్ తో హాఫ్ సెంచరీని అందుకున్నాడు. వెంటనే రనౌట్ గా వెనుదిరిగాడు. గిల్ సమయోచితంగా ఆడుతూ 44వ ఓవర్లో తన తొలి వన్డే సెంచరీని సాధించాడు. దీంతో తొలి ఇన్నింగ్స్ ముగిసేసరికి  భారత్ 8 వికెట్ల నష్టానికి 289 పరుగులు సాధించింది. 290 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే సికిందర్ రజా శతకంతో పోరాడినా ఓటమి తప్పలేదు. చివరి వరకు ఉత్కంఠభరితంగా జరిగిన మూడో వన్డేలో జింబాబ్వే 49.3 ఓవర్లలో 276 పరుగులకు ఆలౌటైంది. గిల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కాయి.