Taskin missed team bus for sleep before India match : అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటివరకూ ఎవరూ కనివినీ ఎరుగని ఘటన టీ 20 ప్రపంచకప్‌ (T20 World Cup)లో జరిగింది. ఫిట్‌నెస్‌ లేకనో... గాయపడడం వల్లో... లేక ఫైనల్‌ 11లో సమతూకం లేకపోవడం వల్లో ఏ  ఆటగాడినైనా జట్టులోకి తీసుకోకపోవడం మనం విని ఉంటాం. కానీ ఇప్పుడు మనం చదివేది అలాంటి ఇలాంటి ఘటన కాదు. నిద్రపోవడం వల్ల ఓ ఆటగాడు మ్యాచ్‌కు దూరమయ్యాడంటే మీరు నమ్మగలరా... కానీ నమ్మి తీరాలి. మ్యాచ్‌ సమయం వరకూ నిద్రపోతూనే ఉండడం వల్ల ఓ క్రికెటర్‌ భారత్‌తో జరిగిన కీలక మ్యాచ్‌కు దూరమయ్యాడు. మరి అది అలాంటి ఇలాంటి మ్యాచ్‌ కాదు. ప్రపంచకప్‌లో కీలక మ్యాచ్‌లో బంగ్లాదేశీ క్రికెటర్‌ నిద్ర పోవడం వల్ల మ్యాచ్‌కు దూరమయ్యాడంటూ బంగ్లా క్రికెట్‌ బోర్డు అధికారి ఒకరు వెల్లడించడం ఇప్పుడు క్రికెట్‌ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది. 




కుంభకర్ణుడి బాబు
 టీ20 ప్రపంచకప్‌లో భారత్‌-బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తికర విషయం వెలుగు చూసింది. బంగ్లాదేశ్ జట్టుకు సంబంధించిన ఓ వింత ఘటన వెలుగులోకి రావడం ఇప్పుడు క్రికెట్‌ ప్రపంచాన్ని విస్మయపరుస్తోంది. టీ 20 ప్రపంచ కప్‌లో బంగ్లాదేశ్‌ జట్టు ప్రధాన ఫాస్ట్ బౌలర్లలో తస్కిన్ అహ్మద్( Taskin Ahmed ) ఒకడు. కానీ భారత్‌తో జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో తస్కిన్‌ అహ్మద్‌ ఆడలేదు. గాయం వల్లో... జట్టు సమతూకంలో భాగంగానే తస్కిన్ అహ్మద్‌ను పక్కన పెట్టారని అందరూ అనుకున్నారు.


కానీ ఇప్పుడు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధికారి ఒకరు సంచలన ప్రకటన చేశారు. భారత్‌తో జరిగిన మ్యాచ్‌  రోజు తస్కిన్ అహ్మద్ చాలా సేపు నిద్రపోయాడని... అందుకే అతను టీమ్ బస్‌ను సకాలంలో ఎక్కలేదని బంగ్లా క్రికెట్‌ బోర్డు అధికారి ఒకరు తెలిపారు. బస్‌ మిస్‌ అయిన తర్వాత నిద్ర లేచిన తస్కిన్‌ అహ్మద్‌ క్షమాపణలు చెప్పాడని కూడా వెల్లడించారు.


బంగ్లాదేశ్‌- భారత్‌ మ్యాచ్ జరగాల్సిన రోజు తస్కిన్ అహ్మద్ ఆలస్యంగా నిద్రపోయాడని... చాలా ఆలస్యంగా నిద్ర లేచాడని దీంతో టీమ్ బస్సు అతడు లేకుండానే బయలుదేరిందని ఆ అధికారి తెలిపారు. జట్టు సభ్యులు... బోర్డు అధికారులు ఫోన్‌ చేసినా తస్కిన్‌ అహ్మద్‌ ఫోన్‌ ఎత్తలేదని... దీంతో టీమ్ మేనేజ్ మెంట్ అధికారి హోటల్లోనే ఉండాల్సి వచ్చిందని వివరించారు. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ తంజిమ్ హసన్ షకీబ్, ముస్తాఫిజుర్ రెహమాన్‌లతో ఇద్దరు ఫాస్ట్ బౌలర్లతో మాత్రమే ఆడింది.


తస్కిన్ ఆలస్యంగా మైదానానికి చేరుకున్నప్పుటికీ అతనిని ప్లేయింగ్ లెవన్‌లోకి తీసుకోలేదు. తస్కిన్‌ అంటే కోచ్‌కు కోపం ఉందని అందుకే అతనిని జట్టులోకి తీసుకోలేదని ఆరోపణలు వచ్చాయి. అయితే దీనిని బంగ్లా అధికారులు ఖండించారు. కోచ్‌కి తస్కిన్‌పై కోపం ఉంటే అఫ్గాన్‌తో జరిగిన తదుపరి మ్యాచ్‌లో ప్లేయింగ్ లెవన్‌లో ఎందుకు ఉంటాడని ప్రశ్నించారు. తాను ఆలస్యంగా నిద్ర లేవడంపై తోటి ఆటగాళ్లకు, మేనేజ్‌మెంట్‌కు తస్కిన్‌ క్షమాపణలు కూడా చెప్పాడు.