టీ20 ప్రపంచకప్‌ సూపర్-12 దశలో గ్రూప్-1 అత్యంత ఆసక్తికరంగా మారింది. శుక్రవారం జరగాల్సిన రెండు మ్యాచ్‌లూ వర్షం కారణంగా రద్దయ్యాయి. దీంతో గ్రూప్-1లో ఇప్పటికీ ఆరు జట్లకూ సెమీస్ అవకావం ఉంది. ఆతిథ్య జట్టు అయిన ఆస్ట్రేలియా కూడా కష్టాల్లో పడింది. ఎందుకంటే వారి నెట్ రన్‌రేట్ ఎంతో తక్కువగా ఉంది.


ప్రస్తుతానికి ఈ గ్రూపులో ఆస్ట్రేలియా ఆఖరి స్థానంలో ఉంది. మొదటి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై వారు భారీ తేడాతో ఓడిపోవడం నెట్ రన్‌రేట్‌ను దెబ్బతీసింది. ప్రస్తుతానికి ఆస్ట్రేలియా మూడు మ్యాచ్‌ల్లో ఒక గెలుపు, ఒక ఓటమి ఉన్నాయి. ఇంకో మ్యాచ్‌లో ఫలితం రాలేదు.


ఇప్పటికి చూసుకుంటే ఈ గ్రూపులో న్యూజిలాండ్, ఇంగ్లండ్‌లు ఫేవరెట్‌గా ఉన్నాయి. ఎందుకంటే న్యూజిలాండ్ నెట్ రన్‌రేట్ +4.45 గానూ, ఇంగ్లండ్ నెట్ రన్‌రేట్ +0.239 గానూ ఉంది. అయితే పాయింట్లలో మాత్రం ఎక్కువ తేడా లేదు. న్యూజిలాండ్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, ఐర్లాండ్‌లు మూడు పాయింట్లతోనూ, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ రెండేసి పాయింట్లతోనూ ఉన్నాయి.


ఎవరు క్వాలిఫై అవ్వడానికి అవకాశం ఉంది?
ఆస్ట్రేలియా మిగతా రెండు మ్యాచ్‌లూ గెలిచినప్పటికీ వారు సెమీస్‌కి వెళ్లే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. దానికి న్యూజిలాండ్ మిగతా అన్ని మ్యాచ్‌ల్లో గెలవాల్సి ఉంది. ముఖ్యంగా ఇంగ్లండ్‌పై కచ్చితంగా గెలవాలి. ఆ మ్యాచ్ కూడా న్యూజిలాండ్ భారీగా గెలవాల్సి ఉంది.


ఇక ఇంగ్లండ్ విషయానికి వస్తే... వారు తమ మిగతా రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తే సరిపోతుంది. శ్రీలంక నెట్‌రన్‌రేట్ ఇంగ్లండ్ కంటే బెటర్‌గా ఉంది. తనకు మిగిలిన మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తే ఇంగ్లండ్‌ను వెనక్కి నెట్టి సెమీస్‌కు చేరచ్చు. ఐర్లాండ్, ఆఫ్ఘనిస్తాన్ సెమీస్‌కు చేరడం కూడా కష్టమే కానీ అసాధ్యం మాత్రం కాదు.