భారత్, బంగ్లాదేశ్ల మధ్య జరుగుతున్న ప్రపంచకప్ మ్యాచ్ను వర్షం అడ్డుకున్న సంగతి తెలిసిందే. దీంతో బంగ్లాదేశ్ లక్ష్యాన్ని సవరించారు. దీని ప్రకారం బంగ్లాదేశ్ విజయానికి 16 ఓవర్లలో 151 పరుగులు అవసరం. ఆట ఆగే సమయానికి బంగ్లాదేశ్ 7 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 66 పరుగులు చేసింది.
ఓపెనర్లు లిటన్ దాస్ (59 నాటౌట్: 26 బంతుల్లో, ఏడు ఫోర్లు, మూడు సిక్సర్లు), నజ్ముల్ హుస్సేన్ శాంటో (7: 16 బంతుల్లో) క్రీజులో ఉన్నారు. ఓపెనర్ లిటన్ దాస్ మొదటి బంతి నుంచే భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 21 బంతుల్లోనే తన అర్థ సెంచరీ పూర్తయింది. పవర్ప్లే ఆరు ఓవర్లలోనే బంగ్లాదేశ్ 60 పరుగులు చేసింది.
అంతకు ముందు టాస్ ఓడిన భారత్ మొదట బ్యాటింగ్కు దిగింది. ఓపెనర్లలో రోహిత్ శర్మ (2) త్వరగా ఔటైనా ఈసారి కేఎల్ రాహుల్ చెలరేగాడు. తన క్లాస్ చూపించాడు. తస్కిన్ అహ్మద్ మంచి లైన్ అండ్ లెంగ్తుతో విరుచుకుపడ్డా రాహుల్ మాత్రం చూడచక్కని బౌండరీలు, సిక్సర్లు బాది స్కోరు వేగం పెంచాడు. 31 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్నాడు.
షకిబ్ వేసిన 9.2వ బంతిని ఫైన్లెగ్లో గాల్లోకి ఆడి రాహుల్ ఔటయ్యాడు. ఆ తర్వాత సూర్యకుమార్ దూకుడుగా, కోహ్లీ ఆచితూచి ఆడారు. దాంతో 11.5 ఓవర్లకే భారత స్కోరు 100 దాటేసింది. ఈ క్రమంలో సూర్యను షకిబే బౌల్డ్ చేశాడు. 37 బంతుల్లో అర్ధశతకం బాదేసిన కోహ్లీకి తోడుగా ఆఖరి ఓవర్లో అశ్విన్ (13*; 6 బంతుల్లో 1x4, 1x6) మెరవడంతో స్కోరు 185కు చేరింది. కింగ్ కొట్టిన షాట్లు ఫ్యాన్స్ను అలరించాయి.