T20 World Cup Final At Brodgetown Between Teamindia And South Africa: దక్షిణాఫ్రికా(South Africa)తో జరుగుతున్న టీ 20 ప్రపంచకప్‌(T20 World Cup) ఫైనల్లో.. టీమిండియా(Teamindia) ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఈ మెగా టోర్నమెంట్‌లో ఇప్పటివరకూ ఒక్క మ్యాచ్‌ కూడా ఓడిపోని రోహిత్‌ సేన... ఆ సంప్రదాయాన్ని ఫైనల్లోనూ కొనసాగించి ఈసారి కప్పును ఒడిసిపట్టాలని గట్టి పట్టుదలతో ఉంది. బలమైన బ్యాటింగ్‌ లైనప్‌... ప్రత్యర్థులను కుప్పకూలుస్తున్న బౌలింగ్‌ దళం.. మైదానంలో చిరుతల్లా కదులుతున్న ఫీల్డర్లతో టీమిండియా అన్ని విభాగాల్లోనూ చాలా పటిష్టంగా కనిపిస్తోంది. బలమైన జట్టుకు రోహిత్‌ శర్మ సారథ్యం కూడా తోడు కావడంతో భారత జట్టు ఇప్పటివరకూ అద్భుతాలు సృష్టిస్తూనే ఉంది. ఆ అద్భుతం ఫైనల్లో కూడా కొనసాగితే భారత్‌ ఖాతాలో మరో ప్రపంచ కప్‌ చేరడం ఖాయంగా కనిపిస్తోంది.


 

ఫేవరెట్ టీమిండియా

ప్రస్తుతం ఐసీసీ టీ 20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా అగ్రస్థానంలో ఉంది. ఆ స్థాయికి తగ్గట్లే ప్రదర్శన చేసి టీ 20 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌కి..... దూసుకొచ్చింది. అమెరికా-వెస్టిండీస్‌ ఆతిథ్యం ఇచ్చిన ఈ టోర్నమెంట్‌లో 20 జట్లు పాల్గొనగా... ఆ జట్లను దాటి టీమిండియా ఫైనల్‌ పోరుకు సిద్ధమైంది. టీమిండియా బ్యాటింగ్ లైనప్‌ చాలా పటిష్టంగా కనిపిస్తోంది. విరాట్ కోహ్లీ మినహా మిగిలిన బ్యాటర్లందరూ ఈ వరల్డ్‌కప్‌లో తమ పాత్రను సమర్థంగా నిర్వహించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో మంచి ఫామ్‌తో సత్తా చాటిన ఆటగాళ్లు ఇప్పుడు అదే ఫామ్‌ కొనసాగిస్తున్నారు. ఐపీఎల్‌లో విఫలమై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న హార్దిక్‌ పాండ్యా అయితే ఇప్పుడు జట్టులో కీలక ఆటగాడిగా మారిపోయాడు. పాండ్యా ఆడుతున్న కీలక ఇన్నింగ్స్‌లో భారత్‌కు కలిసివస్తున్నాయి. అయితే ఐపీఎల్‌లో 150 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో 38 సిక్సర్లు కొట్టిన కోహ్లీ ఈ టీ 20 ప్రపంచకప్‌లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచ టీ 20 ర్యాంకింగ్స్‌లో అగ్ర స్థానంలో ఉన్న సూర్యకుమార్ యాదవ్ ఇన్ ఫామ్‌లో ఉన్నాడు. సూర్య కుమార్‌ ఈ ప్రపంచకప్‌లో ఇప్పటికే కొన్ని కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. తనదైన రోజున సూర్య ఎంతటి విధ్వంసం సృష్టిస్తాడో అందరికీ తెలుసు. రిషభ్‌ పంత్‌ కూడా సెమీస్‌లో విఫలమైనా ఈ పొట్టి ప్రపంచకప్‌లో వన్‌డౌన్‌లో కొన్ని మంచి ఇన్నింగ్స్‌లు ఆడాడు. మరోసారి ఫైనల్లోనూ ఇలాంటి ఇన్నింగ్సే ఆడాలని పంత్‌ గట్టి పట్టుదలతో ఉన్నాడు. రోహిత్‌, కోహ్లీ, పంత్‌, సూర్యకుమార్‌యాదవ్‌, హార్దిక్ పాండ్యా, శివమ్‌దూబే, అక్షర్‌ పటేల్‌, రవీంద్ర జడేడాలతో టీమిండియా బ్యాటింగ్‌ చాలా డెప్త్‌గా ఉంది. ఒకరు త్వరగా అవుటైనా మరొకరు చివరి దాకా నిలబడి మంచి స్కోరు అందిస్తున్నారు. 

 

భయపెట్టేలా బౌలింగ్

టీమిండియా బౌలింగ్‌ చాలా పటిష్టంగా ఉంది. అర్ష్‌దీప్‌ స్వింగ్‌తో అల్లాడిస్తుంటే బుమ్రా కచ్చితమైన లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో ప్రత్యర్థులను కుప్పకూలుస్తున్నాడు. పూర్తిగా బౌలింగ్‌కు అనుకూలంగా ఉన్న విండీస్‌ పిచ్‌లపై బుమ్రా-అర్ష్‌దీప్‌ పేస్‌తో ఆకట్టుకుంటుంది. ఇప్పటివరకూ జరిగిన అన్ని టీ 20 ప్రపంచకప్‌లతో పోలిస్తే ఈ మెగా టోర్నీలోనే అత్యధిక వికెట్లు తీశారు. టీ 20 వరల్డ్‌కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఇండియా బౌలర్‌గా అర్ష్‌దీప్ ఇప్పటికే రికార్డు సృష్టించాడు. ఆ తర్వాత బుమ్రా ఉన్నాడు. వీరిద్దరూ మరోసారి స్వింగ్‌తో చెలరేగితే సఫారీలకు కష్టాలు తప్పవు. ఇక స్పిన్నర్లయితే బంతితో మాయాజాలం చేస్తున్నారు. కుల్‌దీప్‌, అక్షర్‌ పటేల్ తమ స్పిన్‌ వలలో ప్రత్యర్థి బ్యాటర్లు చిక్కుకునేలా చేస్తున్నారు. ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీస్‌లో వీరిద్దరి ధాటికి బ్రిటీష్‌ జట్టు వణికిపోయింది. మరోసారి విండీస్‌ పిచ్‌పై వీరిద్దరూ చెలరేగితే టీమిండియా విజయం సునాయాసమే.