t20 world cup records | టీ 20 ప్రపంచ కప్ జూన్ రెండు నుంచి ప్రారంభం కానుంది. అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తోన్న ఈ మెగా టోర్నీలో 20 జట్లు పాల్గొనన్నాయి.  ఈ నేపథ్యంలో ఇప్పటి వరకూ జరిగిన టీ 20 ప్రపంచ కప్ మ్యాచుల్లో 2 ఇన్నింగ్సుల్లో కలిపి  నమోదైన  అత్యధిక టోటల్స్ ఏవి?  అవి ఏ సీజన్లో ఏ ఏ టీముల మధ్య జరిగిన మ్యాచ్ లో నమోదయ్యాయి? వాటిలోని వ్యక్తి గత స్కోర్ల వివరాలేంటి? వాటి ఫలితాల సంగతేంటో ఇప్పుడు చూద్దాం. 


ఇప్పటి వరకు ఎనిమిది ఎడిషన్ల పాటు జరిగిన ఈ టీ 20 వరల్డ్ కప్ లో ఒకే మ్యాచ్ లో అత్యధిక  రన్స్ నమోదైన సందర్భాలు..  చాలానే ఉన్నాయి. ఒకే మ్యాచ్‌లో ఇరుజట్ల స్కోర్లు కలిపి నాలుగొందలకు పైగా రన్స్ నమోదైన సందర్భాలు మూడు ఉండగా,  350 కి పైగా రన్స్ నమోదైన సందర్భాలు 20 ఉన్నాయి. 75 సార్లు 300 కి పైగా స్కోర్లు నమోదయ్యాయి. 


ఇంగ్లాండ్- సౌతాఫ్రికా.. నెయిల్ బైటర్ -459 (టోటల్ స్కోర్)


2016 టీ 20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ చరిత్ర సృష్టించింది. 200కి పైగా స్కోర్లు ఇరు జట్లూ సాధించడం,  దాదాపు అసాధ్యమనుకున్న లక్ష్యాన్ని ఇంకో రెండు బంతులు మిగిలి ఉండగానే సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్టు ఛేదించడం అప్పట్లో ఓ సెన్సేషన్. ముంబై లోని వాంఖడే స్టేడియం వేదికగా ఆ ఎడిషన్ సూపర్ 10 లో భాగంగా జరిగిన ఈ నెయిల్ బైటర్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నాలుగు వికెట్లకు 229 పరుగులు చేసి ఇంగ్లండ్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. హషీమ్ ఆమ్లా, క్వింటన్ డికాక్,  జీన్ పౌల్ డుమినీలు హాఫ్ సెంచరీలతో కదం తొక్కారు. కాగా 230 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు.. తొలుత కొంత తడబడినా.. జో రూట్ 83(44బంతుల్లో) ఊచకోతతో 19.4 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా రూట్ నిలిచాడు. మొత్తమ్మీద రెండు జట్లూ కలిపి 39.4 ఓవర్లలో 459 పరుగులు సాధించాయి. 


యువరాజ్ విశ్వరూపం గుర్తుందా..? 418 (టోటల్ స్కోర్)


ఇక ఈ లిస్టులో రెండోది మొట్ట మొదటి ఎడిషన్ లోనిదే. అంటే 2007 టీ 20 ప్రపంచకప్ లో భాగంగా ఇండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్.  భారత క్రికెట్ అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మ్యాచ్ ఇది. స్టువర్ట్ బ్రాడ్- యువరాజ్ సింగ్.. గుర్తొచ్చిందా..? యెస్ ఓవర్ లోని ఆరు బంతులను ఆరు సిక్సులుగా మలచి క్రీడాభిమానులను యువరాజ్ ఉర్రూతలూగించిన మ్యాచే ఇదే. సౌతాఫ్రికాలోని డర్బన్ వెదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా 4 వికెట్లకు 218 పరుగులు చేసి బారీ లక్ష్యాన్ని ఇంగ్లండ్ ముందు ఉంచింది.  తొలుత గంభీర్, సెహ్వాగ్ లు శుభారంభాన్నివ్వడంతో భారత్ 180, 190 పరుగులు చేసేలా కనిపించింది. అప్పుడే ఇంగ్లండ్ బౌలర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ యువరాజ్ ను రెచ్చగొట్టాడు ఇంకేముందీ యువీ ఆ తరువాత ఓవర్ వేసిన స్టువర్డ్ బ్రాడ్ కు చుక్కలు చూపించాడు.  రెచ్చిపోయి.. ఆరు బంతులను ఆరు సిక్సులుగా మలిచి బ్యాట్ తో సమాధానమిచ్చాడు. 16 బంతుల్లోనే 7 సిక్సర్లతో  58 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. 219 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ సైతం ధాటిగానే ఆడింది. విక్రమ్ సోలంకి, కెవిన్ పీటర్సన్ వంటి వారు విజయతీరాలకు చేర్చేందుకు ప్రయత్నించినా.. ఎక్కువ సేపు క్రీజులు నిలవలేకపోవడంతో 200 పరుగులకే ఆ టీమ్ పరిమితమైంది. 18 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. యువరాజే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్.  ఈ మ్యాచ్ లో మొత్తమ్మీద 418 పరుగులు నమోదయ్యాయి.  


 సిక్సర్ల దేవుడు ప్రపంచానికి పరిచయమైన రోజు.. 


టీ20 ప్రపంచకప్ తొలి సీజన్ అయిన 2007లోని మొదటి మ్యాచ్ అది. వెస్టిండీస్, సౌతాఫ్రికా జట్ల బ్యాటింగ్ విశ్వరూపం చూసి క్రికెట్ ప్రపంచమే ఔరా అన్న సందర్భమది.  క్రిస్ గేల్ అనే సిక్సర్ల దేవుడు ప్రపంచానికి పరిచయమైన రోజది. 57 బంతుల్లో పది సిక్సర్లతో 117 పరుగులు.. ఓ రకంగా చెప్పాలంటే బంతులను ఊచకోత కోశాడు. టీ 20 ఫార్మాట్‌లో ఎంత మజా ఉంటుందో ప్రపంచానికి చూపించాడు. క్రిస్ గేల్.. ఈ పేరు ప్రపంచమంతా మారుమోగింది. కానీ మ్యాచ్ ఫలితం వెస్టిండీస్ కి అనుకూలంగా రాలేదు. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ గేల్ విధ్వంసంతో ఆరు వికెట్లకు 205 పరుగులు చేసింది. 206 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ కి దిగిన సౌతాఫ్రికా కేవలం రెండు వికెట్లు కోల్పోయి 17.4 ఓవర్లలోనూ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది.  గిబ్స్ 90(55బంతుల్లో) చెలరేగి ఆడటంతో సౌతాఫ్రికా సునాయాసంగా విజయతీరాలకు చేరింది. కానీ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ తో పాటు క్రికెట్ అభిమానుల గుండెలు కూడా గెలుచుకుంది మాత్రం ది గ్రేట్ గేలే.   ఈ మ్యాచ్ లో మొత్తం 413 పరుగులు నమోదయ్యాయి.