Suryakumar Yadav:  సూర్యకుమార్ యాదవ్ తన బ్యాటింగ్ తోనే కాదు తన వ్యక్తిత్వంతోనూ అభిమానులను ఆకట్టుకుంటుంటాడు. ఎప్పుడూ ఫ్యాన్స్ కు అందుబాటులో ఉంటాడు. ఆదివారం భారత్- శ్రీలంక మధ్య జరిగిన మూడో వన్డేలో సూర్య చేసిన పని ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. 


ఆదివారం భారత్- శ్రీలంక మధ్య మూడో వన్డే జరిగింది. ఇందులో భారత్ రికార్డ్ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ లో విరాట్ కోహ్లీ, శుభ్ మన్ గిల్ లు సెంచరీలతో చెలరేగటంతో టీమిండియా 391 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం శ్రీలంక 73 పరుగులకే ఆలౌటయ్యింది. దీంతో భారత్ 317 పరుగుల తేడాతో గెలుపొందింది. 


సంజూ నా హార్ట్ లో ఉన్నాడు


ఈ మ్యాచ్ లో శ్రీలంక బ్యాటింగ్ చేస్తున్నప్పుడు సూర్యకుమార్ యాదవ్ బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్నాడు. అప్పుడు అతనికి ఫ్యాన్స్ నుంచి ఊహించని ప్రశ్న ఎదురైంది. స్టేడియంలో ఉన్న అభిమానులు సూర్యను సంజూ శాంసన్ గురించి ప్రశ్నించారు. సంజూ ఎక్కడ? అంటూ సూర్యను అడిగారు. దానికి సూర్య... సంజూ నా మనసులో ఉన్నాడు అనే అర్ధం వచ్చేలా చేతులతో లవ్ సింబల్ చూపించాడు. ఈ జవాబుకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. మ్యాచ్ సందర్భంగా కొందరు అభిమానులు సంజూ, సంజూ అంటూ అరిచారు. 


ఇలాంటి అనుభవం సూర్యకు ఇదే తొలిసారి కాదు. గతేడాది సెప్టెంబరులో కేరళలో టీమిండియా దక్షిణాఫ్రికాతో తలపడినప్పుడు సూర్యకు అభిమానుల నుంచి సంజూ గురించిన ప్రశ్న ఎదురైంది. అప్పుడు సూర్య తన ఫోన్ లో ఉన్న సంజూ ఫొటోను ఫ్యాన్స్ కు చూపించాడు. శ్రీలంకతో జరిగిన 3 మ్యాచ్ ల టీ20 సిరీస్ కు సంజూ శాంసన్ ఎంపికయ్యాడు. అయితే వాంఖడేలో జరిగిన తొలి మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తుండగా సంజూ గాయపడ్డాడు. అతనికి విశ్రాంతి అవసరమని బీసీసీఐ వైద్యులు తెలిపారు. అందుకే వచ్చే న్యూజిలాండ్ సిరీస్ కు సెలక్టర్లు సంజూ శాంసన్ ను ఎంపిక చేయలేదు. 


కేరళ సంజూ శాంసన్ స్వస్థలం. అతనికి అక్కడ చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు.