లెజెండ్‌ క్రికెట్‌ లీగ్‌లో మాజీ క్రికెటర్లు గౌతమ్‌ గంభీర్‌- శ్రీశాంత్‌ల మధ్య జరిగిన గొడవ చిలికిచిలికి గాలివానగా మారుతోంది. గంభీర్‌ తనను ఫిక్సర్‌ అంటూ పదే పదే పిలిచాడంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో శ్రీశాంత్‌ షేర్‌ చేసిన వీడియో కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలోనే శ్రీశాంత్‌కు లెజెండ్‌ లీగ్ క్రికెట్  నిర్వాహకులు లీగల్‌ నోటీలుసు జారీ చేశారు. గంభీర్‌ను విమర్శిస్తూ సోషల్ మీడియాలో వీడియోలు పెట్టి నిబంధనలు ఉల్లంఘించినందుకు శ్రీశాంత్‌కు నిర్వాహకులు నోటీసులు జారీ చేశారు.


శ్రీశాంత్ వ్యవహారంపై లెజెండ్‌ లీగ్ క్రికెట్  నిర్వాహకులు అసహనం వ్యక్తం చేశారు. టీ 20 టోర్నమెంట్‌లో ఆడే కాంట్రాక్ట్‌ను ఉల్లంఘించినందుకు శ్రీశాంత్‌కు నోటీసులు ఇచ్చినట్లు పేర్కొంది. సోషల్‌ మీడియాలో పెట్టిన వీడియోలను తొలగిస్తేనే.. అతడితో మాట్లాడతామని లెజెండ్‌ క్రికెట్‌ లీగ్‌ నిర్వాహకులు స్పష్టం చేశారు. ఈ వివాదానికి సంబంధించి ఫీల్డ్‌ అంపైర్‌ నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని పేర్కొంది. తాజాగా శ్రీశాంత్‌ చేసిన మరో పోస్ట్‌ కూడా వైరల్‌గా మారింది. రెండో క్వాలిఫయర్‌ మ్యాచ్‌ సందర్భంగా ఇండియా క్యాపిటల్స్‌ కెప్టెన్ గౌతమ్ గంభీర్‌ను మణిపాల్ టైగర్స్‌ ఆటగాడు అమితోజ్‌ సింగ్‌ రనౌట్‌ చేశాడు. దీంతో అమితోజ్‌ను ప్రశంసిస్తూ శ్రీశాంత్ ‘‘అద్భుతమైన త్రో చేశావు. వెల్‌డన్‌ అమితోజ్‌ అంటూ ఇన్‌స్టా స్టోరీ పెట్టాడు.


టీమిండియా మాజీ క్రికెటర్లు గౌత‌మ్ గంభీర్, శ్రీశాంత్ లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో ఆడుతున్నారు. గౌత‌మ్ గంభీర్ ఇండియా క్యాపిట‌ల్స్‌కు, శ్రీశాంత్‌ గుజ‌రాత్ జెయింట్స్‌కు ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. అయితే ఈ లీగ్‌లో ఈ ఇద్దరి ఆటగాళ్ల మధ్య జరిగిన గొడవ మళ్లీ కలకలం రేపింది. బుధవారం ఇండియా క్యాపిట‌ల్స్, గుజ‌రాత్ జెయింట్స్ జ‌ట్ల మ‌ధ్య ఎలిమినేటర్‌ మ్యాచ్‌ జ‌రిగింది. ఈ మ్యాచ్ జ‌రుగుతున్న స‌మ‌యంలో గౌత‌మ్ గంభీర్‌, శ్రీశాంత్‌ల మ‌ధ్య గొడ‌వ జ‌రిగింది. గంభీర్ త‌న‌ను ఫిక్సర్ అని ప‌దే ప‌దే పిలిచి అవమానించాడని, స‌హ‌చ‌ర ఆట‌గాళ్లతో పాటు సీనియ‌ర్ క్రికెట‌ర్లకు గంభీర్ మ‌ర్యాద ఇవ్వడ‌ని శ్రీశాంత్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశాడు. ప్రత్యక్ష ప్రసారమవుతున్న మ్యాచ్‌లో గంభీర్‌ తనను ఫిక్సర్‌ అంటూనే ఉన్నాడని... ఏమంటున్నావు అని తనని అడిగానని.. కానీ తను మాత్రం అలా అంటూనే ఉన్నాడని శ్రీశాంత్‌ ఆరోపించాడు. తాను ఒక్క చెడు మాట కూడా అనలేదని.. ఓవర్‌ అయిపోయిన తర్వాత అతనెందుకు అలా చేశాడో అర్థం కావట్లేదని... గంభీర్‌ ఎంతో మందితో ఇలాగే ప్రవర్తిస్తున్నాడని ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో శ్రీశాంత్‌ సంచలన ఆరోపణలు చేశాడు. 


 ప‌క్కన ఉన్న వాళ్లు అత‌డిని ఆపుతున్నా కూడా అత‌డు ఫిక్సర్ అని పిలుస్తూనే ఉన్నట్లు వీడియోలో శ్రీశాంత్ చెప్పుకొచ్చాడు. ఈ విష‌యంలో త‌న త‌ప్పేమీ లేద‌ని తెలిపాడు. కానీ గంభీర్‌ మద్దతుదారులు మాత్రం గంభీర్‌ అన్నది ఫిక్సర్ కాదని  సిక్సర్‌, సిక్సర్‌ అన్నాడని చెబుతున్నారని ఇది ఆమోదయోగ్యం కాదని శ్రీశాంత్‌ తెలిపాడు. అతని మద్దతుదారులు గంభీర్‌ను కాపాడాలని చూస్తున్నారని.. అదనపు జీతానికి ఆశపడే పీఆర్‌ల మాటలు నమ్మొద్దని కోరుతున్నానని ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో శ్రీశాంత్‌ పేర్కొన్నాడు. దీనిపై పరోక్షంగా స్పందించిన గంభీర్‌... టీమ్‌ఇండియా జెర్సీలో నవ్వుతూ ఉన్న తన ఫొటోను ఎక్స్‌లో పోస్టు చేసి.. ప్రపంచం మొత్తం దృష్టిని ఆకర్షించాలని చూసినప్పుడు నవ్వుతూ ఉండాలని పోస్ట్‌లో రాశాడు. శ్రీశాంత్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియోపై అత‌డి భార్య భువ‌నేశ్వరి స్పందించారు. శ్రీశాంత్‌తో క‌లిసి చాలా కాలం పాటు టీమ్ఇండియాకు ఆడిన ఓ ఆట‌గాడు ఇలా అన్నాడని తెలిసి షాక్‌కు గురైన‌ట్లు చెప్పారు. యాక్టివ్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ అయిన చాలా సంవ‌త్సరాల త‌రువాత కూడా మైదానంలో అత‌డు ఇలా మాట్లాడ‌డం అత‌డి 
ప్రవ‌ర్తన‌ను తెలియ‌జేస్తుందని తెలిపారు.