ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెటర్లందరికీ ఐపీఎల్‌ అంటే ఎనలేని ఆసక్తి. ప్రపంచంలోనే అత్యంత విలువైన క్రికెట్‌ లీగ్‌గా ఐపీఎల్‌కు పేరుంది. ఇప్పుడు ఈ IPLపై సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ కన్నుపడింది. ఈ లీగ్‌లో ఎలాగైనా ఫ్రాంచైజీని కొనుగోలు చేయాలన్న పట్టుదలతో ఉన్న యువరాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు బ్లూమ్‌బర్గ్‌ ఒక సంచలన కథనం ప్రచురించింది. ఈ కథనం క్రికెట్‌ అభిమానులను నివ్వెలపరిచింది. గత సెప్టెంబర్లో భారత్‌లో పర్యటించిన సౌదీ యువరాజు ఈ విషయమై భారత ప్రభుత్వంతో చర్చలు కూడా జరిపినట్లు తెలుస్తోంది. ఐపీఎల్‌లో భారీగా వాటాలు కొనుగోలు చేసేందుకు కూడా సౌదీ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. సౌదీ అరేబియా ఇటీవల క్రీడల్లో భారీగా పెట్టుబడులు పెడుతోంది. 
 ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్‌ సహా ప్రొఫెషనల్‌ క్రీడల్లో సౌదీ అరేబియా పెట్టుబడులు కుమ్మరిస్తోంది. ఇప్పుడు సౌదీఅరేబియా దృష్టి ప్రపంచ క్రికెట్‌లో అత్యంత ధనిక లీగ్‌ అయిన ఐపీఎల్‌పై పడడం సంచలనం సృష్టిస్తోంది. ఐపీఎల్‌ను దాదాపు 2.5 లక్షల కోట్ల విలువైన హోల్డింగ్‌ కంపెనీగా మార్చడంపై భారత ప్రభుత్వ అధికారులతో సౌదీ యువరాజు మహ్మద్‌ బిన్‌ సల్తాన్‌ సలహాదారులు సంప్రదింపులు జరిపినట్టు ‘బ్లూమ్‌బెర్గ్‌’ కథనం ప్రచురించింది. గత సెప్టెంబరులో మహ్మద్‌ బిన్‌ సుల్తాన్‌ భారత్‌ సందర్శించిన సమయంలో ఈ చర్చలు జరిగినట్టు పేర్కొంది. ఐపీఎల్‌లో దాదాపు 42 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్న సౌదీ అరేబియా..తద్వారా లీగ్‌ను ఇతర దేశాలకు విస్తరించాలని చూస్తున్నట్లు సమాచారం. అయితే సౌదీ అరేబియా ప్రతిపాదనపై బీసీసీఐ నుంచి ఇప్పటివరకూ  ఎలాంటి స్పందన రాలేదు. ఐపీఎల్‌లో పెట్టుబడులపై సౌదీ అరేబియా తొందరపడుతున్నా.. తుది నిర్ణయం మాత్రం వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల తర్వాతే వెలువడే అవకాశం ఉన్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్, యూరోపియన్ ఛాంపియన్స్ లీగ్ మాదిరిగానే ఐపీఎల్‌ను ఇతర దేశాలకు విస్తరించాలని సౌదీ ప్రణాళికలు రచిస్తోంది.
 ఐపీఎల్ 2024 కోసం సన్నాహాలు ప్రారంభం అయ్యాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లను బీసీసీఐ ఇప్పటికే ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2024కి ముందు నిర్వహించే వేలానికి సంబంధించి భారత క్రికెట్ బోర్డు మార్పులు చేస్తూ ఉంది. ఈసారి వేలం భారత్‌లో కాకుండా దుబాయ్‌లో జరిగే అవకాశం ఉంది. ఇది కాకుండా ఫ్రాంచైజీల పర్స్ విలువలో కూడా పెరుగుదల ఉంటుంది. ఐపీఎల్ 2024 సీజన్ కోసం వేలం దుబాయ్‌లో జరగనుంది. ఇంతకు ముందు దుబాయ్‌లో చాలా ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగాయి. డిసెంబర్ 19వ తేదీన వేలం జరగనున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2023 వేలం కొచ్చిలో జరిగింది. టర్కీలోని ఇస్తాంబుల్‌లో ఈ వేలం నిర్వహించనున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈసారి ఆటగాళ్లను కొనుగోలు చేయడానికి ఫ్రాంచైజీల పర్స్‌లో ఎక్కువ డబ్బు ఉంటుందని చెబుతున్నారు. గతసారి అన్ని ఫ్రాంచైజీల పర్స్ విలువ రూ.95 కోట్లుగా ఉంది. కానీ ఈసారి రూ.5 కోట్ల మేర పెంచనున్నారు. అంటే ఈసారి పర్స్ విలువ రూ.100 కోట్లుగా ఉండవచ్చు. అటువంటి పరిస్థితిలో జట్లు తాము కోరుకున్న ఆటగాళ్ల కోసం ఎక్కువగా పోటీ పడవచ్చు. ఈసారి ఐపీఎల్ వేలంలో పలువురు విదేశీ ఆటగాళ్లు కూడా పాల్గొంటున్నారు. ఇందులో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ పాట్ కమిన్స్ కూడా చేరనున్నారు. దీంతో పాటు ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ ట్రావిస్ హెడ్, ఇంగ్లండ్ ఆల్ రౌండర్ క్రిస్ వోక్స్, ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ అలెక్స్ హేల్స్, దక్షిణాఫ్రికా యువ ఫాస్ట్ బౌలర్ గెరాల్డ్ కోయెట్జీ, ఇంగ్లిష్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ శామ్ బిల్లింగ్స్ కూడా ఉన్నారు.