Viral Video:  రాజస్థాన్ కు చెందిన ముమల్ మెహర్ అనే యువతి క్రికెట్ ఆడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమె ఆడుతున్న షాట్లు చూస్తే టీమిండియా సంచలనం సూర్యకుమార్ యాదవ్ గుర్తొస్తున్నాడు. అచ్చం సూర్య లాగే ఆమె ధనాధన్ షాట్లు ఆడుతోంది. క్రికెట్ కిట్ ఏం లేకుండా కేవలం ఇసుకలో ఆమె క్రికెట్ ఆడుతున్న వీడియోను చాలామంది లైక్ చేసున్నారు. ఈ వీడియోపై భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా స్పందించారు. 


ఆ యువతి ఆడుతున్న క్రికెట్ షాట్లపై సచిన్ టెండూల్కర్ ఈ విధంగా స్పందించారు. 'కల్ హీ తో ఆక్షన్ హువా.. ఔర్ ఆజ్ మ్యాచ్ భీ షురూ? క్యా బాత్ హై. రియల్లీ ఎంజాయ్ డ్ యువర్ బ్యాటింగ్ (నిన్న వేలం జరిగింది. ఈరోజు మ్యాచ్ కూడా ప్రారంభమైంది. నిజంగా మీ బ్యాటింగ్ ను ఆస్వాదించాను. )' అని సచిన్ కామెంట్ చేశారు. 


నిన్న వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) వేలం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని టెండూల్కర్ ఆ విధంగా కామెంట్ చేశారు. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. 'ఆమె స్కై మహిళా వెర్షన్ లాగా ఉంది' అని ఒకరు కామెంట్ చేయగా.. 'సూర్య ఎవరు' అని మరొకరు అడిగారు. దిల్లీ మహిళా కమిషన్ ఛైర్ పర్సర్ స్వాతి మలివాల్ కూడా ఆ యువతి క్రికెట్ ఆడుతున్న వీడియోపా స్పందించారు. ఆమెకు సరైన వేదికను అందించాలని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాత్ ను కోరారు. 






డబ్ల్యూపీఎల్ వేలం


నిన్న (సోమవారం) వుమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలం జరిగింది. మొత్తం 5 ఫ్రాంచైజీలు క్రీడాకారులను కొనుగోలు చేశాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబయి ఇండియన్స్, దిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్స్ జట్లు డబ్ల్యూపీఎల్ లో పాల్గొంటున్నాయి. ఈ లీగ్ మార్చి 4 నుంచి 26 వరకు జరగనుంది. ఈ వేలంలో ప్రపంచంలో ఉన్న అన్ని క్రికెట్ జట్ల నుంచి 448 మంది ప్లేయర్లు పాల్గొన్నారు. ఒక్కో జట్టుకు రూ.12 కోట్ల బడ్జెట్‌ను ఇచ్చారు. అన్‌క్యాప్ట్ క్రికెటర్ల బేస్ ప్రైస్ రూ.10 లక్షలు, రూ.20 లక్షలుగా ఉంది. ఇక క్యాప్డ్ క్రికెటర్లకు మాత్రం రూ.30 లక్షలు, రూ.40 లక్షలు, రూ.50 లక్షల బేస్ ప్రైజ్‌ను నిర్ణయించారు. మహిళల ప్రీమియర్ లీగ్ వేలంలో ఆటగాళ్లపై భారీ డబ్బుల వర్షం కురిసింది. స్మృతి మంథాన, యాష్లే గార్డ్‌నర్, నటాలీ స్కీవర్, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ వంటి ప్లేయర్ల కోసం జట్లు చాలా డబ్బు ఖర్చు చేశాయి.