Former India player wonders why Ruturaj Gaikwad, Rinku Singh were dropped: టీమిండియా ఎంపికపై మరోసారి విమర్శలు చెలరేగుతున్నాయి. గతంలో ఎప్పుడూ లేనివిధంగా అద్భుతంగా రాణించిన ఆటగాళ్లను శ్రీలంక టూర్‌కు ఎంపిక చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీమిండియా జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. భారత క్రికెట్‌ జట్టుకు ఎంపికవ్వాలంటే ఆ లక్షణాలు ఉండాలన్న మాజీ క్రికెటర్‌ బద్రీనాథ్‌ వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్‌ వర్గాలు చర్చనీయాంశమయ్యాయి. 




 

ఇంతకీ బద్రీ ఏమన్నాడంటే..?

బ్యాడ్‌ బాయ్‌ ఇమేజ్‌, ఒంటి నిండా టాటూలు, మంచి మేనేజర్, బాలీవుడ్ హీరోయిన్లతో ఎఫైర్స్ ఉంటేనే భారత జట్టులోకి ఎంపిక చేస్తారేమోనని భారత జట్టు మాజీ బ్యాటర్ సుబ్రమణ్యం బద్రీనాథ్ తీవ్రంగా విమర్శించాడు, మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న టీమిండియా ఎంపికపై బద్రీనాథ్‌ తీవ్ర విమర్శలు చేశాడు. వన్డే జట్టులోకి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తిరిగి రావడం... టీ 20 జట్టు  కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్‌ నియామకం... గిల్‌ను వైస్‌ కెప్టెన్‌గా నియమించడం ఈ అంశాలన్నింటిపై బద్రీనాథ్‌ స్పందించాడు.  జింబాబ్వేతో జరిగిన సిరీస్‌లో రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ ఆకట్టుకున్నా వారిని లంక టూర్‌కు ఎంపిక చేయకపోవడంపై బద్రీనాథ్‌ మండిపడ్డాడు. టీ 20 జట్టులో వారిద్దరికీ చోటు దక్కకపోవడం తనను షాక్‌కు గురిచేసిందని బద్రీనాథ్‌ అన్నారు. చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌ను టీ 20, వన్డేలకు ఎంపిక చేయకపోవడంపై సుబ్రమణ్యం బద్రీనాథ్ నిరాశను వ్యక్తం చేశాడు. 

 

రాణించినా ఎందుకు వేటు..?

జింబాబ్వేపై గైక్వాడ్ మూడు ఇన్నింగ్స్‌ల్లో 7, 77, 49 పరుగులతో రాణించాడు. అయినా రుతురాజ్‌కు శ్రీలంక టూర్‌లో చోటు దక్కలేదు. అభిషేక్‌ అయితే సెంచరీ చేశాడు. రింకూ సింగ్‌కు టీ 20 జట్టులో చోటు దక్కినా వన్డేలో దక్కలేదు. ఈ  జట్టుల నుంచి రుతురాజ్‌ గైక్వాడ్, రింకూసింగ్‌లను తప్పించాడాన్ని బద్రీనాథ్‌ ప్రశ్నించాడు. రింకూ సింగ్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్‌ వంటి ఆటగాళ్లు జట్టులోకి ఎంపిక కాకపోవడానికి కారణాలను బద్రీనాథ్‌ విశ్లేషించాడు. వీరు ఎంపిక కాకపోవడానికి బ్యాడ్‌ బాయ్‌ ఇమేజ్‌ లేకపోవడమే కారణమని రుతురాజ్‌ అన్నాడు. వీరికి బాలీవుడ్ నటీమణులతో ఎఫైర్‌ ఉంటేనే... టాటూలు వేసుకుంటేనో... మంచి మీడియా... మేనేజర్ ఉంటేనే జట్టులోకి ఎంపిక చేస్తారేమోనని బద్రీనాథ్‌ మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఇప్పుడు నెట్టింట ఈ వైరల్‌ మాములుగా వైరల్‌ కాలేదు.

జట్టులోకి సెలెక్ట్‌ కావాలంటే ఇప్పుడు ఇలానే ఉండాలనేలా బద్రీనాథ్‌ మాటలు ఉన్నాయి. ఇప్పటికే శ్రీలంక టూర్‌ జట్టు ఎంపిక తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో బద్రీనాథ్‌ వ్యాఖ్యలు మరింత సంచలనంగా మారాయి. తనను 2019 ప్రపంచకప్‌ సెమీస్‌కు ఎంపిక చేయకపోవడంపై స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ సంచలన వ్యాఖ్యలు చేసిన మరొసటి రోజే బద్రీనాథ్‌ వ్యాఖ్యలు బహిర్గతం కావడం కలకలం రేపుతోంది.