Rohit Sharma to captain India at T20 World Cup 2024:   అమెరికా- వెస్టిండీస్‌ వేదికగా జరిగే పొట్టి ప్రపంచకప్‌(T20 World Cup)లో టీమిండియా(Team India)ను ఎవరు  నడిపిస్తారనే ఊహాగానాలకు తెరపడింది. భారత్‌ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో టీమిండియాను అద్భుతంగా నడిపించిన సారధి రోహిత్‌ శర్మ(Rohit Sharma)నే.... టీ 20 ప్రపంచకప్‌లోనూ సారధ్య బాధ్యతలు చేపడతాడని బీసీసీఐ స్పష్టం చేసింది. రాబోయే టీ20 ప్రపంచకప్‌లో రోహిత్‌ శర్మనే టీమ్‌ఇండియాకు నాయకత్వం వహిస్తాడని బీసీసీఐ కార్యదర్శి జై షా తేల్చి చెప్పారు. వరుసగా పది మ్యాచ్‌ల్లో నెగ్గిన తర్వాత.. మనం 2023 వన్డే ప్రపంచకప్‌ గెలవలేకపోయినా, మనసులు గెలిచామని గుర్తు చేసిన జై షా.... 2024 టీ20 ప్రపంచకప్‌లోనూ  రోహిత్‌ సారథ్యంలో త్రివర్ణ పతాకం ఎగరేస్తామని ప్రకటించారు.  రోహిత్ శర్మనే భారత జట్టును ఈ మెగా టోర్నీలో ముందుకు నడిపిస్తాడని  షా  పేర్కొన్నారు.  ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడని జై షా క్లారిటీ ఇచ్చారు. జూన్ 4 నుంచి టి20 వరల్డ్ కప్ టోర్నీ ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ ఐసీసీ ఈవెంట్ కు వెస్టిండీస్-అమెరికా సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. 



ఎప్పటి నుంచంటే..?
క్రికెట్‌ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తోన్న టీ20 ప్రపంచకప్‌ 2024 (T 20 World Cup 2024)షెడ్యూల్‌ వచ్చేసింది. జూన్‌ 1 నుంచి పొట్టి ప్రపంచకప్‌ ప్రారంభం కానుండగా తొలి మ్యాచ్‌లో ఆతిథ్య అమెరికా(USA)తో కెనడా(Canada) తలపడబోతోంది. జూన్‌ 1న ప్రారంభంకానున్న టీ 20 ప్రపంచకప్‌ జూన్‌ 29న ముగుస్తుంది. ఈ టోర్నీలో మొత్తం 20 జట్లు నాలుగు గ్రూపుల్లో పోటీ పడతాయి. తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నాకౌట్‌కు చేరుకుంటాయి. ఈ మెగా టోర్నీలో గ్రూప్‌ ఏ లో భారత్‌(Bharat), పాకిస్థాన్‌(Pakistan) జట్లు ఉన్నాయి. అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూసే దాయాదుల సమరం న్యూయార్క్‌ వేదికగా జూన్‌ 9న జరగనుంది. టీమిండియా గ్రూప్ దశలో జూన్‌ అయిదున ఐర్లాండ్‌తో 12న అమెరికాతో 15న కెనడాతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్లను ఐసీసీ నాలుగు నెలలు ఉండగానే అందుబాటులోకి తెచ్చి షాక్‌ ఇచ్చింది. 



బరిలో 20 జట్లు
2022 జరిగిన పొట్టి ప్రపంచకప్‌లో 16 జ‌ట్లు పోటీ ప‌డ‌గా ఈ సారి మాత్రం 20 జ‌ట్లు త‌ల‌ప‌డనున్నాయి. ఐసీసీ 12 జ‌ట్లకు నేరుగా అర్హత క‌ల్పించింది. 2022 టీ20 ప్రపంచ‌క‌ప్‌లో టాప్‌-8 స్థానాల్లో నిలిచిన ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, భార‌త్‌, పాకిస్తాన్, న్యూజిలాండ్‌, శ్రీలంక, ద‌క్షిణాఫ్రికా, నెద‌ర్లాండ్స్ జ‌ట్లల‌తో పాటు అతిథ్య హోదాలో అమెరికా, వెస్టిండీస్ ల‌తో క‌లిపి మొత్తం 10 జ‌ట్లు నేరుగా అర్హత పొందాయి. టీ20 ర్యాంకింగ్స్‌లో తొమ్మిది, ప‌ది స్థానాల్లో నిలిచిన అఫ్గానిస్థాన్ , బంగ్లాదేశ్‌లు కూడా నేరుగా అర్హత సాధించాయి. మిగిలిన 8 స్థానాల కోసం రీజియ‌న్ల వారీగా క్వాలిఫ‌యింగ్ పోటీల‌ను నిర్వహించి విజేతలను టీ 10 ప్రపంచకప్‌నకు అర్హత కల్పించారు. వచ్చే ఏడాది జరిగే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, భార‌త్‌, పాకిస్తాన్, న్యూజిలాండ్‌, శ్రీలంక, ద‌క్షిణాఫ్రికా, నెద‌ర్లాండ్స్, యూఎస్‌, వెస్టిండీస్, అఫ్గానిస్థాన్ , బంగ్లాదేశ్‌, కెన‌డా, నేపాల్‌, ఒమ‌న్‌, ప‌పువా న్యూ గినియా, ఐర్లాండ్‌, స్కాంట్లాండ్‌, ఉగాండ‌, న‌బీబియా పాల్గొననున్నాయి. వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో ఓటమిని.. టీ 20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకుని మరిపించాలని టీమిండియా కోరుకుంటోంది.