Rohit Captaincy Record: కెప్టెన్ గా రోహిత్ అరుదైన క్లబ్ లోకి ఎంట్రీ.. ఇప్పటివరకు కేవలం ముగ్గురికి మాత్రమే సాధ్యమైన ఘనత
లిస్టులో ఇప్పటికీ కేవలం ముగ్గురు మాత్రమే ఉండగా, తాజాగా రోహిత్ చేరికతో ఈ సంఖ్య 4కు చేరింది. దాదాపు 29 ఏళ్ల తర్వాత పాకిస్థాన్ ఆతిథ్యమిచ్చిన ఈ మెగాటోర్నీలో భారత్ దూకుడైన ఆటతీరు ప్రదర్శించింది.

ICC Champions Trophy 2025 Updates: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీని గెలిపించిన సారథి రోహిత్ శర్మ తాజాగా అరుదైన ఘనత సాధించాడు. భారత్ మూడో చాంపియన్స్ ట్రోఫీ టైటిల్ సాధించడంలో కీలక పాత్ర పోషించిన హిట్ మ్యాన్.. ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. దీంతో ఒక ఐసీసీ వన్డే టోర్నీలో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును నెగ్గిన నాలుగో కెప్టెన్ గా నిలిచాడు. ఈ లిస్టులో ఇప్పటికీ కేవలం ముగ్గురు మాత్రమే ఉండగా, తాజాగా రోహిత్ చేరికతో ఈ సంఖ్య నాలుగుకు చేరింది.
దాదాపు 29 ఏళ్ల తర్వాత పాకిస్థాన్ ఆతిథ్యమిచ్చిన ఈ మెగాటోర్నీలో భారత్ దూకుడైన ఆటతీరు ప్రదర్శించింది. ఆడిన ఐదు మ్యాచ్ ల్లోనూ విజయం సాధించి, అన్ బీటెన్ గా ఈ టైటిల్ ను కైవసం చేసుకుంది. గతేడాది రోహిత్ సారథ్యంలోనే టీ20 ప్రపంచకప్ ను కూడా భారత్ ఇలాగే అన్ బీటెన్ గా ఉంటూ సాధించడం విశేషం. అయితే తాజా టోర్నీలో రోహిత్ నమోదు చేసిన ఘనతను చూసి, భారత అభిమానులు ముచ్చట పడుతున్నారు.
రెండో భారత కెప్టెన్..
ఇక ఐసీసీ వన్డే టోర్నీలో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచిన క్రికెటర్లను పరిశీలిస్తే.. క్లైవ్ లాయిడ్ (1975 వన్డే ప్రపంచప్, వెస్టిండీస్), రికీ పాంటింగ్ (2003, వన్డే ప్రపంచకప్, ఆస్ట్రేలియా), ఎంఎస్ ధోనీ (2011 వన్డే ప్రపంచకప్, భారత్) మాత్రమే గతంలో ఈ ఘనత సాధించారు. తాజాగా రోహిత్ కూడా వీరితో చేరాడు. అయితే పై ముగ్గురు వన్డే ప్రపంచకప్ లో ఈ ఘనత సాధిస్తే, రోహిత్ మాత్రం.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఈ ఫీట్ రిపీట్ చేశాడు. ఇక ఈ మ్యాచ్ లో ఇరుజట్ల భిన్నంగా నిలిచినది ఏదైనా ఉందంటే, రోహిత్ ఆటతీరే అనడంలో ఎలాంటి సందేహం లేదు. సెకండ్ బ్యాటింగ్ కు కష్టసాధ్యమైన పిచ్ పై తను 76 పరుగులతో రాణించి, జట్టును విజయం వైపు నడిపించాడు.
అలాగే ఆడాలి..
ఇక ఫైనల్లో తను భిన్నంగా ఏమీ ఆడలేదని రోహిత్, మ్యాచ్ ముగిశాక చెప్పుకొచ్చాడు. దుబాయ్ లో పరిస్థితుల రిత్యా, గత నాలుగు మ్యాచ్ ల్లో ఎలాగైతే ఆడానో, ఈ మ్యాచ్ లోనూ అలాగే ఆడినట్లు పేర్కొన్నాడు. పవర్ ప్లేలో దూకుడుగా ఆడి, వీలైనంతగా పరుగులు సాధిస్తే, ఛేజింగ్ సాఫీగా సాగుతుందని భావించినట్లు తెలిపాడు. పవర్ ప్లే ముగిశాక, ఫీల్డ్ స్ప్రెడ్ అయ్యాక, దానికి తగినట్లుగా గేమ్ ప్లాన్ రూపొందించుకున్నట్లు పేర్కొన్నాడు. ఇక రోహిత్ ఇన్నింగ్స్ తో భారత్ ముచ్చటగా మూడోసారి మెగాటోర్నీని కైవసం చేసుకుంది. 2002, 2013తోపాటు తాజాగా 2025లోనూ ఈ టోర్నీని తన ఖాతాలో వేసుకుంది. దీంతో భారత్ కు రెండో ఐసీసీ టైటిల్ అందించిన కెప్టెన్ గా రోహిత్ గుర్తింపు పొందాడు. అందరికంటే మిన్నగా ధోనీ మూడు ఐసీసీ టైటిల్స్ (2007 టీ20, 2011 వన్డే ప్రపంచకప్, 2013 చాంపియన్స్ ట్రోఫీ)లను ధోనీ.. జట్టుకు అందించాడు. తను మాత్రమే అత్యంత విజయవంతమైన భారత కెప్టెన్ గా నిలిచాడు.