టీమిండియా సారధి రోహిత్‌ శర్మ(Rohit Sharma) మరోసారి వార్తల్లో నిలిచాడు. టాస్‌కు వచ్చినప్పుడు తుది జట్టును ప్రకటించే సమయంలో తరచూ ఎవరో ఒకరి పేరును మర్చిపోయే హిట్ మ్యాన్‌ మరోసారి అదే పని చేశాడు. నిన్న అఫ్గానిస్థాన్‌(Afghanistan)తో జరిగిన మ్యాచ్‌లోనూ టాస్‌ సమయంలో రోహిత్‌ మరోసారి గజనీగా మారిపోయాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే.. టాస్ అనంత‌రం తుది జ‌ట్టులో ఎవ‌రెవ‌రు ఉన్నారు, ఎవ‌రికి చోటు ద‌క్కలేదో చెప్పాలని యాంకర్‌ ముర‌ళీ కార్తీక్... కెప్టెన్‌ రోహిత్ శ‌ర్మను కోరాడు. టీమ్ కాంబినేష‌న్‌లో భాగంగా సంజు శాంస‌న్‌, అవేశ్ ఖాన్‌.. గాయం కార‌ణంగా య‌శ‌స్వి జైస్వాల్‌కు స్థానం ద‌క్కలేద‌ని చెప్పాడు. ఈ క్రమంలో రోహిత్‌ కుల్దీప్ యాద‌వ్ పేరును మ‌ర్చిపోయాడు. చైనామన్‌ కుల్దీప్ పేరును గుర్తుతెచ్చుకునేందుకు రోహిత్ శ‌ర్మ ప్రయ‌త్నించాడు. ముర‌ళీ కార్తీక్ గుర్తు చేసిన త‌రువాత కుల్దీప్ పేరును రోహిత్ శర్మ చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.


తొలి టీ 20 మనదే
అఫ్గానిస్థాన్‌( Afghanistan)తో జరిగిన తొలి టీ 20లో భారత్‌(Bharat) ఘన విజయం సాధించింది. తొలుత అఫ్గాన్‌ను ఓ మోస్తరు స్కోరుకే పరిమితం చేసిన టీమిండియా... తర్వాత మరో 11 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన అఫ్గాన్‌... నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. అనంతరం 11 బంతులు మిగిలి ఉండగానే రోహిత్‌ సేన విజయం సాధించింది.


అఫ్గాన్‌ పోరాడే స్కోరు
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అఫ్గాన్‌... భారత బౌలర్లు రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. అక్షర్ పటేల్ తో పాటూ ముఖేష్ చెరో 2 వికెట్లు తీసి రాణించారు, టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆఫ్ఘానిస్తాన్‌ కు ఓపెనర్లు శుభారంభం అందించారు. తొలి వికెట్ కు 50 పరుగుల భాగస్వామ్యం అందించారు.. ఈ జోడీని అక్షర్ పటేల్ విడదీశాడు. అదే స్కోర్ వద్ద మరో ఓపెనర్ ను శివమ్‌ దూబే పెవిలియన్ కు పంపాడు. దీనితో 50 పరుగుల వద్ద ఒక్క వికెట్‌ కోల్పోకుండా పటిష్టంగా కనిపించిన అఫ్గాన్‌.. అదే స్కోరు వద్ద రెండు వికెట్లు కోల్పోయింది. టీం ఇండియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో అఫ్గాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది.


దూబే అర్ధ శతకం
159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా తొలి ఓవర్లోనే దిమ్మతిరిగే షాక్‌ తగిలింది. 14 నెలల తర్వాత టీ 20ల్లో బరిలోకి దిగిన సారధి రోహిత్‌ శర్మ.. ఒక్క పరుగు కూడా చేయకుండానే పెవిలియన్‌ చేరాడు. సమన్వయ లోపం కారణంగా రోహిత్‌ శర్మ రనౌట్‌గా వెనుదిరిగాడు. ఒక్క పరుగు చేయకుండానే.. స్కోరు బోర్డుపై ఒక్క పరుగు చేరకుండానే హిట్‌ మ్యాన్‌ పెవిలియన్‌ చేరాడు. కానీ శుభమన్‌ గిల్‌, తిలక్‌ వర్మ భారత్‌ను ఆదుకున్నారు. ఉన్నంత సేపు గిల్‌ ధాటిగా బ్యాటింగ్‌ చేశాడు. కేవలం 12 బంతుల్లో అయిదు ఫోర్లతో 23 పరుగులు చేసి అవుటయ్యాడు. తిలక్‌ వర్మ కూడా మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. 22 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్సుతో 26 పరుగులు చేశాడు. భారత్‌ విజయం దిశగా సాగుతున్న సమయంలో మరో రెండు వికెట్లు నేలకూలాయి. కానీ శివమ్‌ దూబే భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. కేవలం 40 బంతుల్లో అయిదు ఫోర్లు, రెండు సిక్సులతో దూబే 60 పరుగులు చేసి అజేయంగా నిలిచి టీమిండియాకు విజయాన్ని అందించాడు.