Rishabh Pant  comeback: భారత క్రికెట్ జట్టు వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్(Rishabh Pant) గత ఏడాది డిసెంబర్‌లో రూర్కీ వెళ్తుండగా కారు ప్రమాదంలో గాయపడ్డాడు. ఈ యాక్సిడెంట్‌లో అతని కాలులోని లిగమెంట్‌ చిరిగిపోయింది. దీంతో పాటు చేయి, కాలు, వీపుకు కూడా గాయాలయ్యాయి. అతని ప్రాథమిక చికిత్స మొదట డెహ్రాడూన్‌లోని మాక్స్ ఆసుపత్రిలో జరిగింది. కొత్త ఏడాది రోజున ఇంట్లో వారికి సర్‌ప్రైజ్‌ ఇద్దామని ఢిల్లీ నుంచి ఒంటరిగా పంత్‌ బయల్దేరగా.. ఢిల్లీ-రూర్కీ హైవేపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గత ఏడాదిగా క్రికెట్‌కు దూరమైన పంత్‌ మళ్లీ వచ్చే ఐపీఎల్‌ సీజన్‌లో ఆడేందుకు తీవ్రంగా శ్రమించాడు. ఈ క్రమంలో పంత్‌కై చికిత్స చేసిన వైద్యులు సంచలన విషయాలు వెల్లడించారు. పంత్‌ ఓ అద్భుతమని... అతడు కోలుకుని క్రికెట్‌ ఆడడం ఓ అద్భుతమని చెప్పి పంత్‌ అంకితభావాన్ని మెచ్చుకున్నాడు.



డాక్టర్‌ ఏమన్నాడంటే..?
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ రిషభ్‌పంత్‌కు కోకిలాబెన్‌ ఆస్పత్రి వైద్యుడు డాక్టర్‌ దిన్షా పార్దీవాలా చికిత్స అందించారు. అతడికి చికిత్స చేసిన కిత్స సమయంలో జరిగిన పలు ఆసక్తికర పరిణామాలను పార్దీవాలా బీసీసీఐ టీవీతో పంచుకొన్నారు. సాధారణంగా మోకాలికి తీవ్ర గాయమైతే కోలుకోవడమే కష్టమని.... అలాంటిది క్రికెట్‌ ఆడటం అంటే ఓ అద్భుతమేనని... ఈ అద్భుతాన్ని పంత్‌ సాధించాడని పార్దీవాలా గుర్తు చేసుకున్నారు. అనుకొన్న సమయం కంటే మూడు నెలల ముందే పంత్‌ మైదానంలోకి అడుగుపెట్టడం సామాన్యమైన విషయం కాదని పార్దీవాలా అన్నారు. 


పంత్‌కు మూడు ఆపరేషన్లు
పంత్‌ ఆస్పత్రిలో చేరాక కుడి మోకాలికి ఏకంగా మూడు ఆపరేషన్లు చేశారని.... పాదం, మణికట్టు ఎముకలు విరిగాయని... దిన్షా పార్దీవాలా గుర్తు చేసుకున్నారు. నువ్వు క్రికెట్‌ ఆడేందుకు కనీసం 18 నెలలు పడుతుందని తాను పంత్‌తో చెప్పానని... కానీ తాను 12 నెలల్లో తిరిగి మైదానంలో అడుగు పెడతానని అన్నాడని.... డాక్టర్‌ తెలిపాడు. తీవ్రంగా శ్రమించిన పంత్‌ తాను అనుకున్న దానికంటే మూడు నెలల ముందే టీ 20 క్రికెట్ ఆడేందుకు సిద్ధమయ్యాడని దిన్షా పార్దీవాలా వెల్లడించారు. రిషబ్‌ కోలుకొని సాధారణ వ్యక్తిలా చేస్తామని తాము అతడి తల్లికి హామీ ఇచ్చామని... దాన్ని విజయవంతంగా నిలబెట్టుకున్నామని డాక్టర్‌ దిన్షా చెప్పారు.  మోకాలి చిప్ప పక్కకు జరగడం అనేదీ తీవ్రమైన గాయమని.. పంత్‌కు మోకాలి దగ్గర ఉన్న ప్రతీ భాగం తీవ్రంగా దెబ్బతిందని కూడా డాక్టర్ వెల్లడించారు. వాటిని సాధారణ స్థితికి తీసుకొచ్చి స్థిరత్వాన్ని కల్పించడం ప్రతీ సర్జన్‌కూ సవాలేనని అన్నాడు. ఆ సమయంలో పంత్‌కు తాము అండగా నిలిచామని వివరించారు. 14 నెలల తర్వాత రిషబ్‌ ఎట్టకేలకు ఫిట్‌నెస్‌ సాధించి.. ఐపీఎల్‌(ipl)తో పునరాగమనం చేయడం ఆనందంగా ఉందని కూడా డాక్టర్‌ తెలిపారు. రోడ్డు ప్రమాదం తర్వాత రిషబ్‌ పంత్‌ మళ్లీ క్రికెట్‌ ఆడటం దాదాపు అసాధ్యమని భావించామని కానీ పంత్‌ మాత్రం తన సంకల్ప బలంతో కోలుకుని త్వరలోనే పునరాగమనం చేయబోతున్నాడని వైద్యులు గుర్తు చేసుకున్నారు. 


Also Read: రంజీ ఛాంపియన్‌ ముంబై, విదర్భకు పోరాడిన తప్పని ఓటమి