Ravindra Jadeja:  ఫిబ్రవరిలో టీమిండియా, ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడనుంది. ఈ సిరీస్ కు బీసీసీఐ భారత స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాను ఎంపికచేసింది. దాదాపు 5 నెలల తర్వాత జడేజా టీమిండియాకు సెలక్ట్ అయ్యాడు. జడ్డూ రాకతో భారత జట్టు బలం పెరిగినట్లే.


టీమిండియా అగ్రశ్రేణి ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా మళ్లీ మైదానంలోకి దిగేందుకు సిద్ధమయ్యాడు. ఆసీస్ తో జరిగే బోర్డర్- గావస్కర్ ట్రోఫీకి ఎంపికయ్యాడు. దీనికంటే ముందు జనవరి 24న ప్రారంభమయ్యే రంజీ ట్రోఫీ చివరి రౌండ్ లో జడ్డూ ఆడనున్నాడు. ఈ మ్యాచ్ సౌరాష్ట్ర, చెన్నై మధ్య జరగనుంది. ఆసీస్ తో సిరీస్ కు రంజీ మ్యాచ్ లను జడేజా ప్రాక్టీస్ కోసం ఉపయోగించుకోనున్నాడు. ఈ మ్యాచ్ కు సంబంధించి జరిగిన ప్రాక్టీస్ సెషన్ వీడియోను జడ్డూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. 


ఫిట్ నెస్ నిరూపించుకున్న జడ్డూ


గతేడాది సెప్టెంబర్ లో జరిగిన ఆసియా కప్ సందర్భంగా జడేజా గాయపడ్డాడు. మోకాలి గాయం కారణంగా టీ20 ప్రపంచకప్ నకు దూరమయ్యాడు. తన కుడి మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్న జడ్డూ ఎన్ సీసీలో పునరావాసం పొందాడు. తాజాగా బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ నుంచి ఫిట్ నెస్ సర్టిఫికెట్ పొందాడు. దీంతో సెలక్టర్లు జడేజాను బోర్డర్- గావస్కర్ ట్రోఫీకోసం సెలక్ట్ చేశారు. మొదటి రెండు టెస్టుల కోసం ఎంపికచేసిన 17 మంది స్క్వాడ్ లో జడ్డూకు స్థానం లభించింది. 


అయితే పోటీ క్రికెట్ ఆడడానికి ముందు బీసీసీఐ నిర్వహించే ఫిట్ నెస్ పరీక్షల్లో తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాలి. జడేజా ఈ వారంలోనే బౌలింగ్, బ్యాటింగ్ ప్రారంభించాడు. అందుకే సెలక్టర్లు, ఎన్ సీఏ, జట్టు మేనేజ్ మెంట్.. ఆసీస్ తో సిరీస్ కు ముందు రంజీలు ఆడాల్సిందిగా జడేజాను కోరారు. ఈ మేరకు జనవరి 24న ప్రారంభమయ్యే రంజీ మ్యాచ్ లో సౌరాష్ట్ర తరఫున జడ్డూ ఆడనున్నాడు. ఇప్పటికే దీనికోసం శిక్షణ ప్రారంభించాడు. 


ఆస్ట్రేలియాతో తొలి 2 టెస్టులకు భారత జట్టు


రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, మొహమ్మద్ షమీ, మొహమ్మద. సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, సూర్యకుమార్ యాదవ్.