ప్రపంచకప్ 2023 కోసం భారత జట్టులో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఆల్ రౌండర్ అక్షర్‌ పటేల్ స్థానంలో స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ జట్టులోకి వచ్చాడు. అక్షర్ పటేల్ గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ప్రపంచ కప్‌కు ముందు ఆస్ట్రేలియాతో ఆడిన వన్డే సిరీస్‌కు అశ్విన్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఈ టోర్నీలో అశ్విన్ అద్భుతంగా రాణించాడు. సెలెక్టర్లను ఆకట్టుకున్నాడు. దీంతో వేరే ఆలోచన లేకుండా గాయం కారణంగా జట్టుకు దూరమైన అక్షర్ స్థానంలో అశ్విన్‌కు అవకాశం ఇచ్చారు. 


ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో రెండు మ్యాచ్‌ల్లో అశ్విన్ 22 సగటుతో 4 వికెట్లు పడగొట్టాడు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ద్వారా చాలా కాలం తర్వాత అశ్విన్ వన్డేల్లో పునరాగమనం చేశాడు. 21 జనవరి 2022న అశ్విన్ భారత్ తరఫున చివరి వన్డే ఆడాడు. చాలా కాలం తర్వాత జట్టులోకి వచ్చి ఆస్ట్రేలియాపై అద్భుత ప్రదర్శన చేసిన అశ్విన్‌ ఇప్పుడు మెగా ఈవెంట్  ఆడే భారత క్రికెట్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇప్పటి వరకు భారత్ తరఫున 115 వన్డేలు ఆడాడు.


ఆసియా కప్ లో గాయపడ్డ అక్షర్


ఆసియా కప్ 2023లో బంగ్లాదేశ్‌తో జరిగిన సూపర్-4 స్టేజ్ మ్యాచ్‌లో అక్షర్ పటేల్ గాయపడ్డాడు. అక్షర్ గాయం చిన్నదేనని ప్రపంచ కప్‌నకు ముందు కోలుకుంటాడని అనుకున్నారు కానీ గాయం అనుకున్నంత చిన్నది కాదని మరికొన్ని రోజులు అతనికి రెస్ట్ అవసరమని మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది. అందుకే ప్రపంచకప్‌ జట్టు నుంచి అక్షర్‌ను తప్పించింది. 


భారత్ తరఫున మూడు ఫార్మాట్లు ఆడే ఆటగాడిగా మంచి గుర్తింపు ఉంది అశ్విన్‌కి. ఇప్పటి వరకు 94 టెస్టులు, 115 వన్డేలు, 65 టీ20లు ఆడాడు. అశ్విన్ టెస్టుల్లో 489, వన్డేల్లో 155, టీ20ల్లో 72 వికెట్లు పడగొట్టాడు. బంతితో పాటు బ్యాట్‌తో కూడా అద్భుతాలు చేయగల సత్తా ఉన్న ప్లేయర్ అశ్విన్‌. టెస్టుల్లో 5 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు సాధించాడు. వన్డేల్లో కూడా 1 హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 


వరల్డ్‌ కప్‌ భారత తుది జట్టు


రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్.