దేశవాళి  ప్రతిష్టాత్మక టోర్నీ రంజీ ట్రోఫీ(Ranji Trophy) లో హైదరాబాద్‌(Team Hyderabad) జట్టు మరోసారి అదరగొట్టింది. ఇప్పటికే వరుసగా రెండు మ్యాచుల్లో విజయాలు సాధించి మంచి ఊపు మీదున్న హైదరాబాద్‌ జట్టు.. మూడో మ్యాచ్‌ను ఘనంగా ఆరంభించింది. అఫ్గాన్‌(Afghanistan)తో టీ 20 సిరీస్‌ సందర్భంగా హైదరాబాద్‌ జట్టును వీడిన తిలక్‌ వర్మ.(Tilak Varma).. తిరిగి జట్టులో చేరడంతో హైదరాబాద్‌ పటిష్టంగా మారింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన సిక్కిం బ్యాటింగ్‌కు దిగింది. ఇదే ఎంత తప్పుడు నిర్ణయమో సిక్కిం జట్టుకు వెంటనే తెలిసొచ్చింది. హైదరాబాద్‌ బౌలర్లు త్యాగరాజన్‌ ఆరు వికెట్లు, సీవీ మిలింద్‌ నాలుగు వికెట్లతో చెలరేగడంతో సిక్కిం కేవలం 79 పరుగులకే ఆలౌట్‌ అయింది. వీరిద్దరి బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు సిక్కిం జట్టు తీవ్రంగా కష్టపడింది. 

 

హైదరాబాద్‌ బ్యాటర్ల ఊచకోత

అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌కు ఓపెనర్లు తన్మయ్‌ అగర్వాల్‌ 137 పరుగులతో అద్భుత శతకం సాధించాడు. ఇప్పటికే భారీ శతకంతో మంచి ఫామ్‌లో ఉన్న గహ్లోత్‌ రాహుల్‌ సింగ్‌ మరోసారి కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. 83 పరుగులతో రాణించాడు. తన్మయ్‌ అగర్వాల్‌- గహ్లోత్‌ రాహుల్‌ సింగ్‌ హైదరాబాద్‌కు అదిరిపోయే ఆరంభం ఇచ్చింది. వన్‌డౌన్‌లో వచ్చిన రోహిత్‌ రాయుడు సైతం 75 పరుగులతో రాణించాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్‌ తిలక్‌ వర్మ 66 బంతుల్లోనే 70 పరుగులు సాధించాడు. అతడికి తోడుగా మరో ఎండ్‌లో సహకారం అందిస్తున్న చందన్‌ సహానీ 8 పరుగులు చేశాడు. తొలిరోజు ఆట ముగిసే సరికి వీరిద్దరు అజేయంగా నిలవగా.. హైదరాబాద్‌ ఏకంగా 302 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఇప్పటికే రంజీ తాజా సీజన్‌లో ప్లేట్‌ గ్రూపులో హైదరాబాద్‌ జట్టు ఇప్పటికే తొలి రెండు మ్యాచ్‌లలో విజయాలు సాధించింది. నాగాలాండ్‌, మేఘాలయపై గెలుపొందింది.

 

తొలి మ్యాచ్‌లో ఇన్నింగ్స్ విజయం

రంజీ ట్రోఫీ తొలి మ్యాచ్‌లో హైదరాబాద్‌ రెండు రోజుల్లోనే నాగాలాండ్‌ను మట్టికరిపించింది. ఇన్నింగ్స్‌ 194 పరుగుల తేడాతో నాగాలాండ్‌పై హైదరాబాద్‌ ఘన విజయం సాధించింది. తొలుత రాహుల్‌ సింగ్‌ గహ్లోత్‌ డబుల్‌ సెంచరీ... కెప్టెన్‌ తిలక్‌ వర్మ శతకంతో భారీ స్కోరు చేసిన హైదరాబాద్‌... తర్వాత నాగాలాండ్‌ను రెండు ఇన్నింగ్సుల్లోనూ తక్కువ పరుగులకే ఆలౌట్‌ చేసింది. హైదరాబాద్‌ బ్యాటర్ రాహుల్‌ సింగ్‌ గహ్లోత్‌ 143 బంతుల్లో డబుల్‌ సెంచరీ సాధించాడు. ఈ క్రమంలో రవిశాస్త్రి తర్వాత రంజీ ట్రోఫీలో వేగవంతమైన డబుల్‌ సెంచరీ చేసిన రెండో ప్లేయర్‌గా రాహుల్‌ గుర్తింపు పొందాడు. 

 

రెండో మ్యాచ్‌లోనూ ఇన్నింగ్స్‌ విజయం

మేఘాలయ(Meghalaya) పై ఇన్నింగ్స్‌ 81 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి హైదరాబాద్‌ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. రెండురోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో.. మేఘాలయాను హైదరాబాద్‌ జట్టు చిత్తు చేసింది. తొలుత మేఘాలయను తొలి ఇన్నింగ్స్‌లో 33.1 ఓవర్లలో 111 పరుగులకే హైదరాబాద్‌ ఆలౌట్‌ చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన హైదరాబాద్‌ హైదరాబాద్‌ ఏడు వికెట్ల నష్టానికి 346 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. రోహిత్‌ రాయుడు 124 పరుగులతో అజేయంగా నిలవగా.. చందన్‌ సహానీ అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన మేఘాలయను హైదరాబాద్‌ బౌలర్లు 154 పరుగులకే ఆలౌట్‌ చేశారు. దీంతో మేఘాలయపై ఇన్నింగ్స్‌ 81 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.