Ranji Trophy 2022-23:  దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ రంజీకి సమయం ఆసన్నమైంది. నేటి నుంచి రంజీ ట్రోఫీ మ్యాచ్ లు ప్రారంభం కానున్నాయి. 38 జట్ల మధ్య జరిగే ఈ పోటీకి మంగళవారం తెరలేవనుంది. ఈ టోర్నీలో మొత్తం 135 మ్యాచులు ఆడనున్నారు. కరోనా కారణంగా గత రెండేళ్లు ఈ టోర్నీని కుదించి నిర్వహించారు. అయితే ఈసారి పూర్తిస్థాయిలో దీన్ని నిర్వహించనున్నారు. ముంబయి, మధ్యప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, సౌరాష్ట్ర, విదర్భ, దిల్లీ ట్రోఫీ రేసులో ఉన్నాయి. 38 జట్ల మధ్య జరిగే ఈ పోటీకి మంగళవారం తెరలేవనుంది. తెలుగు జట్లు హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ ఎలైట్ గ్రూప్- బి లో పోటీపడనున్నాయి. హైదరాబాద్‌ సొంతగడ్డపై తన తొలి మ్యాచ్‌లో తమిళనాడుతో తలపడనుండగా.. ఇదే గ్రూపులో ఆంధ్ర విజయనగరంలో ముంబయిని ఢీకొంటుంది.


వీరికి కీలకం


టీమిండియాలో స్థానం ఆశిస్తున్న కొందరు ఆటగాళ్లకు ఈ రంజీ ట్రోఫీ కీలకం కానుంది. అజింక్య రహానే, పృథ్వీ షా, ఇషాంత్ శర్మ లాంటి వారు ఆ జాబితాలో ఉన్నారు. వరుస వైఫల్యాలతో జాతీయ జట్టులో చోటు కోల్పోయాడు సీనియర్ బ్యాటర్ అజింక్య రహానే. ఇప్పుడు మళ్లీ జట్టులోకి రావాలంటే రంజీ ట్రోఫికి మించిన వేదిక లేదు. 12 ఏళ్ల తర్వాత భారత జట్టులోకి ఎంపికైన జైదేవ్ ఉనద్కత్ ని అతడు ప్రేరణగా తీసుకోవాలి. డిసెంబర్‌ 23న ఐపీఎల్‌ వేలం ఉన్న నేపథ్యంలో మరో సీనియర్‌ ఇషాంత్‌శర్మకు కూడా తొలి రెండు మ్యాచ్‌ల్లో రాణించడం కీలకం. దేశవాళీలో సత్తా చాటుతున్నా భారత జట్టులో పునరాగమనం చేయలేకపోతున్న పృథ్వీ షాకు కూడా ఈ రంజీ సీజన్‌ ఎంతో విలువైంది. గత సీజన్ల కంటే బరువు తగ్గి ఫిట్‌గా మారిన పృథ్వీ ఎలా ఆడతాడన్నది ఆసక్తికరం. భారత జట్టు చోటు ఆశిస్తున్న యశస్వి జైస్వాల్‌కు ఈ టోర్నీ కీలకం. 






ఎలైట్ అండ్ ప్లేట్


ఎలైట్ ఇలా


ఎలైట్‌లో అగ్రశ్రేణి.. ప్లేట్‌లో చిన్న జట్లు ఉంటాయి. ఎలైట్‌లో మొత్తం 32 జట్లను 4  గ్రూపులుగా విభజించారు. ప్రతి గ్రూప్‌లో 8 జట్లు ఆడతాయి. ఆయా గ్రూప్‌ నుంచి అగ్రస్థానంలోని 2 జట్లు క్వార్టర్‌ఫైనల్‌ చేరతాయి. క్వార్టర్ ఫైనల్ లో తలపడిన 8 జట్ల నుంచి 4 సెమీఫైనల్ చేరుకుంటాయి. అనంతరం 2 సెమీఫైనలిస్ట్ జట్ల మధ్య ఫైనల్ జరుగుతుంది.


ప్లేట్ ఇలా


ప్లేట్‌లో 6 జట్లు ఉంటాయి. ఇవి మిగిలిన 5 జట్లతో ఒక్కో మ్యాచ్‌ ఆడతాయి. టాప్‌-4 జట్లు నేరుగా ప్లేట్‌ సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఫైనల్‌ చేరిన రెండు జట్లు వచ్చే సీజన్‌లో ఎలైట్‌లో పోటీపడతాయి. ఈ సీజన్‌లో ఎలైట్‌ జట్లతో ప్లేట్‌ జట్లు తలపడవు. ఈ సారి ఎలైట్‌లో పోటీపడిన 32 జట్లలో అట్టడుగున నిలిచే రెండు జట్లు వచ్చే సీజన్లో ప్లేట్‌ గ్రూప్‌లో ఆడతాయి.


ఎక్కడ చూడాలంటే


రంజీ ట్రోఫీలోని కొన్ని మ్యాచులు స్టార్ స్పోర్స్ ప్రసారం చేస్తుంది. అలాగే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అన్ని మ్యాచులు లైవ్ స్ట్రీమింగ్ అవుతాయి.